Monday 15 June 2015

Telugu short story

రేపటి బీడు

Posted On Thu 21 May 14:50:12.603801 2015
                   మా వైపు కోర్టులో శ్రీను ఒక్కడే మిగిలాడు. కూతకెళ్లి, ఇద్దర్ని అవుట్‌ చేయడంతో; నేను, రమేష్‌ బతికొచ్చాం. ఇప్పుడు కోర్టులో ముగ్గురమయ్యాం. స్కోరు సమానమైంది. ఒకే ఒక్క పాయింటు. ఎవరికొస్తే వారు విజేత. చుట్టూ చేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూలు. సాయంత్రం అయిదు కావస్తోంది. విశాలమైన మైదానం మధ్యలో కబడ్డీ ఆట క్లైమాక్సుకు చేరింది.
అవతలి వైపు కెప్టెన్‌ కూతకు సిద్ధమయ్యాడు. మా నలుగురికీ లోలోపల వణుకు మొదలైంది.
సుమారు ఎనభై కేజీల బరువుండే ఆ శాల్తీని అటకాయించడం అంత తేలిగ్గాదు. ముగ్గురం ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. కబడ్డీ...కబడ్డీ.. అంటూ మా కోర్టులో సగం దూరం వచ్చాడో లేదో మా శ్రీనుగాడు పాములా నేలమీద పాకి, అతగాడి కాళ్లను చుట్టేశాడు. మేమిద్దరం వెనకా ముందూ వాటేసుకుని కదలకుండా చేశాం. అంతే పిల్లల కేరింతలు మైదానంలో ప్రతిధ్వనించాయి. జోనల్‌ పోటీల ఫైనల్స్‌ మా స్కూలు గెలిచింది.
మరుసటి రోజు టీమంతా ఒకచోట చేరి, పార్టీ చేసుకున్నాం. పది పప్పుండలు, పది నూజీడీలు, చాక్లెట్లు, రెండు గోల్డ్‌స్పాట్‌ బాటిళ్లు తెచ్చుకుని సమానంగా పంచుకుని సంతోషంగా గడిపాం. అప్పుడే మేం పదో తరగతి చదువుతున్నాం.
మా ముగ్గుర్నీ అందరూ పొగిడారు. ఆరో తరగతి నుంచే మాది విడదీయరాని అనుబంధం, రమేష్‌ది శాఖమూరు. రోజూ సైకిల్‌పై వచ్చేవాడు. ఒక్కో సారి, నాలుగు కిలోమీటర్లు నడిచే వచ్చేవాడు. శ్రీను, నేను పెదపరిమి వాసులమే. శ్రీను తండ్రి నాలుగెకరాల రైతు. మాకు పదికెరాలపైనే ఉండేది. ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న మృతి చెందడం, ముగ్గురు పిల్లల్ని చదివించాల్సిరావడంతో, అమ్మ, ఒక్కో ఎకరం అమ్మసాగింది. ఆదివారం వచ్చినా, పండగ సెలవు వచ్చినా నేనూ శ్రీనూ పొలం పనులకు వెళ్లేవాళ్లం. వాడు గొడ్డులా కష్టపడతాడు. మునుంలో దిగాడంటే, పత్తి చకచకా తెగి, వాడి 'వంచె' గబగబా నిండాల్సిందే. పత్తి మోళ్లు పీకడం మొదలు పెట్టాడంటే, మేం వాడి వెనుక పరుగులు పెట్టాల్సిందే.
సంక్రాంతి రోజు చూడాలి మా ముచ్చట! శ్రీను, నేను కొత్త చొక్క, కొత్త నిక్కరు తొడుక్కుని తాడికొండ సినిమాకు వెళ్లేవాళ్లం, నాలుగు కిలోమీటర్లు నడిచి. అరుదుగా అలాంటి 'పండగ' లు మాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. పదో తరగతి ప్రథమ శ్రేణిలో పాసైనందుకు నన్ను మా బంధువులందరూ అబ్బురంగా చూశారు. సెకండ్‌ క్లాస్‌లో పాసైన శ్రీను చదువు మానేసి, తండ్రికి తోడుగా తలగుడ్డ చుట్టి నాగలి పట్టాడు.
శ్రీను బాగానే చదివేవాడు. రమేష్‌ పప్పుసుద్ద. నేను బాగా చదువుతాననీ, అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తానన్న గర్వం తలకెక్కి, రమేష్‌ను చిన్నచూపు చూస్తున్న తరుణంలో ఓ రోజు సాయంత్రం స్కూలు వదలగానే రమేష్‌తో కలిసి వాళ్ల ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వాళ్లింట్లోనే ఉన్నాను.
''ఏం బాబూ నువ్వన్నా బాగా సదువుతావా, లేక మా సన్నాసిలాగానేనా'' అన్నం వడ్డిస్తూ
అడిగింది రమేష్‌ తల్లి. నేను నవ్వి ఊరుకున్నాను. వాడు మాత్రం ''అట్టనమాకమ్మా, ఆడు క్లాస్‌లో ఫస్టు'' అన్నాడు. ''అవునా! మానాయనే, మానాయనే...'' అంటూ మెటికలు విరిచింది.
ముద్దపప్పు, గోంగూర పచ్చడి, వంకాయ ఇగురు, ఉలవచారు, ఆ భోజనం రుచి ఇప్పటికీ నాలుకపైనే ఉంది. భోజనాలయ్యాక రాత్రి పదింటికి నిద్రపోయాం.ఉదయం ఆరున్నర అవుతుండగా మెలకువ వచ్చింది.
''కానీ కానీ, పని ఒగదెగడంలా. గేదెల్ని కట్టేరు. పేడకళ్లు తీసేరు...' పంచలోంచి రమేష్‌ వాళ్ల నాన్న కేకలు వినిపిస్తున్నాయి. బద్ధకంగా ఒళ్లు విరుచుకుంటూ బయటికొచ్చి, మెల్లా మీదికి చూపు సారించాను.
''అదుగో, ఆ సిబ్బిలో పేడ దీసుకెళ్లి దిబ్బలో పడేరు. ఎడ్లకు ఉలవలు పెట్టు. గేదె మూతికి సిక్కం గట్టి గాటికి కట్టేరు. పొలికట్టె దీస్కొని
చెత్తంతా ఊడ్చేరు. దూడకు కుడితి తాగించు... ''వాళ్ల నాన్న, తన తొడమీద గోగుతాడు పేనుతూ, రమేష్‌కు పనులు పురమాయిస్తున్నాడు. వాడు యంత్రంలా ఒకదాని తర్వాత ఒక పని చక్కబెడుతున్నాడు. అయినా ఆయన హడావుడి చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒకట్రెండు దెబ్బలు కూడా వేశాడు.
నేను బ్రష్‌ చేసి, టిఫిన్‌ చేసే లోపల, రమేష్‌ పొలం వెళ్లి, సైకిల్‌ మీద మేత మోపు తెచ్చాడు.
హడావిడిగా స్కూలుకు సిద్ధమయ్యాడు. నేను వెనక కూచోగానే సైకిల్‌ను ముందుకు
దూకించాడు రమేష్‌. ''సారీరా...'' పొలాల మధ్య డొంకదారిలో ఉసీగా సైకిల్‌ తొక్కుతున్న రమేష్‌ వీపుమీద చెయ్యివేస్తూ అన్నాను. ''ఎహే, ఇయ్యేమీ
నువ్వు పట్టించుకోమాక. మనకిది రోజూ మామూలే...'' తేలిగ్గా కొట్టిపారేశాడు రమేష్‌. ఆ తర్వాత నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠాలు వివరిస్తూ, వాడు పదో తరగతి పాసవడానికి శక్తి వంచన లేకుండా తోడ్పడ్డాను.

1995 ఆగస్టు15
ముగ్గురం రాములవారి గుళ్లో సమావేశమయ్యాం. నేనొస్తున్నానని ఉత్తరం రాయడంతో రమేష్‌ కూడా పరిమి వచ్చాడు. అప్పటికీ నేను డిగ్రీ పూర్తి చేసి ఓ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నాను. రమేష్‌, శ్రీను వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. ''ఏంటిరా ఇది, మన ఊరిలో ఇంత ఫ్యాక్షనిజమా? పట్టపగలు నడిరోడ్డు మీద ఒక మనిషిని గొడ్డళ్లతో నరికి చంపడం ఏమిటి!'' నమ్మలేనట్టుగా అడిగాను.
'ఇదేం జూశావ్‌. మొన్న కాంగ్రెసోళ్లు టిడిపి నాయకుణ్ణి బాంబులేసి చంపారు. రెండో రోజు టిడిపి వాళ్లు కాంగ్రెస్‌ మండలాధ్యక్షుణ్ని ఇనపరాడ్లతో కొట్టి చంపారు'' నింపాదిగా చెప్పాడు శ్రీను.
'' అన్యాయమైపోతున్నదల్లా పిల్లలే. స్కూలు గురించి పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో వాళ్ల చదువులు దెబ్బతింటున్నాయి.'' విశ్లేషించాడు రమేష్‌. వాడిది శాఖమూరే అయినా పరిమి గురించి బాగా తెలుసు.
''అందుకే, మనమే ఏదో ఒకటి చెయ్యాలి.'' అన్నాను, శ్రీరాముడి విగ్రహం వెనుక పేరుకున్న బూజును చూస్తూ. '' మనమేం చెయ్యగలం?'' ఇద్దరూ ఏకకంఠంతో అడిగారు.
''ఓ సంస్థను ప్రారంభిద్దాం. చదువుకునే పిల్లలకు అవసరమైన సహకారం అందిద్దాం. నా ఫ్రెండ్స్‌ ద్వారా డబ్బు పోగుచేసే బాధ్యత నాది. విద్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత మీది.'' వివరించాను.
అలా ప్రారంభమైన 'చేయూత' స్వచ్ఛంద సంస్థ అతి త్వరలోనే పిల్లల నేస్తమైంది. వారి చదువులకు మార్గదర్శి అయింది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకారవేతనమైంది. మెల్లగా గ్రామ పెద్దలు కూడా సంస్థలో సభ్యులయ్యారు. మా కార్యక్రమాలకు అండగా నిలిచారు.
2007 మార్చి 21
పెదపరిమిలో రైతులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అయిదు వందల మందికి పైగా హాజరైన రైతులనుద్దేశించి లాంఫాం శాస్త్రవేత్త అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. వారిలో శ్రీను, రమేష్‌ కూడా ఉన్నారు.
అప్పటికి సంవత్సరం క్రితం జర్నలిస్టు ఉద్యోగం వీడి, హైదరాబాదులోని స్వచ్ఛంద సంస్థలో మేనేజర్‌గా చేరాను. ఆ సంస్థ తరపున ఈ శిబిరం ఏర్పాటు చేశాను.
రమేష్‌ లేచి, ఓ ప్రశ్న అడిగాడు. శాస్త్రవేత్త సంతోషంగా తల ఊపుతూ, రమేష్‌ను స్టేజీ మీదకు పిలిచి ''ముందు , పత్తిసాగులో మీ అనుభవాలు చెప్పండి.'' అన్నారు.
రమేష్‌ గొంతు సవరించుకుని, మాట్లాడటం మొదలు పెట్టాడు. విత్తనాన్ని ఎంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల దగ్గర్నుంచీ దళారుల కారణంగా ధర గిట్టుబాటు కాని వాస్తవం దాకా అనర్గళంగా మాట్లాడాడు. మధ్య మధ్యలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అన్యాపదేశంగా వివరించాడు. ఇరవై నిమిషాల తర్వాత వాడు ''ఏదో నోటికొచ్చిందల్లా మాట్లాడాను. తప్పులుంటే క్షమించండి.'' అని రెండు చేతులూ జోడించగానే కరతాళధ్వనులు మిన్నంటాయి.
అది మొదలు, మా సంస్థ తరుపున రాష్ట్రంలో ఎక్కడ రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించినా, రమేష్‌ను ప్రత్యేకంగా రప్పించేవాణ్ణి. వాడు సిసలైన వ్యవసాయ భాషలో రైతుల్ని కట్టిపడేసేవాడు.
పరిమిలో కార్యక్రమం ముగియగానే కోటయ్య అనే రైతు నా దగ్గరికొచ్చి.తనను తాను పరిచయం చేసుకున్నాడు.పెనుమాక గ్రామానికి చెందిన ఆయన కాకతాళీయంగా ఈ శిబిరానికి వచ్చాడట. ఇలాంటిది తమ గ్రామంలో కూడా నిర్వహించ మని అడిగాడు. వారం తిరక్కుండానే పెనుమాకలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. అది మధ్యాహ్నానికి ముగిసింది. భోజనం తర్వాత కోటయ్య నన్నూ మా బృందాన్నీ పొలాలకు తీసుకెళ్లాడు. విజయవాడకూ, కృష్ణానదికీ అత్యంత సమీపంలో ఉన్న పెనుమాక, ఒక ఆకుపచ్చని కలకు ప్రతిరూపం. ఎండ ఫెళ్లున కాస్తున్న మార్చి నెల చివరి వారంలో కూడా పచ్చని పంటలు కనువిందు చేస్తున్నాయి. ఉల్లి, అరటి, కూరగాయల సాగు ఎక్కువగా కనిపించింది. కోటయ్య ఎకరం పొలంలోని దొండచెట్లు విరగకాశాయి.
''దొండను పందిళ్ల మీద పాకిస్తారు కదా!'' నేల మీదే తీగలు సాగిన చెట్ల నుంచి అవిరామంగా కాయలు కోస్తున్న కూలీల వంక చూస్తూ సందేహం వ్యక్తం చేశాను.
''అవును సారూ, ఇంతకు ముందు పందిళ్లు వేసేవాళ్లం. ఇప్పుడా అవసరం లేకుండానే నేలమీద కాస్తున్నాయి. మంచి దిగుబడి వస్తంది. విజయవాడ మార్కెట్టు దగ్గర కావడంతో రేటు బాగానే గిట్టుబాటయితాంది.'' సంతోషంగా చెప్పాడు. ఒక గోతాము నిండా దొండకాయలు పోసి, మా కారులో వేశాడు కోటయ్య.
2012 మే 23
పెదపరిమిలో శ్రీను పెద్ద కూతురి పెళ్లి సందర్భంగా అందరం కలిశాం. అప్పటికి నాకు బాగా స్థిరత్వం దొరికింది. మా పిలల్లు హైస్కూలు చదువుల్లో ఉన్నారు. రమేష్‌కు వ్యవసాయం బాగా కలిసొచ్చింది. అదును చూసి అవసరం గ్రహించేవాడు. తండ్రి నుంచి సంక్రమించిన అయిదెకరాలకు తోడు మరో మూడెకరాల భూమి కొన్నాడు. కొడుకునీ కూతుర్నీ ఇంజినీరింగ్‌ చదివిస్తున్నాడు. శ్రీను తనకున్న నాలుగెకరాలకు తోడు మరో నాలుగెకరాల కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. పెద్దమ్మాయి డిగ్రీ పూర్తి చేయగానే, పెళ్లి తలపెట్టాడు. ఆ అమ్మాయికి రెండెకరాలు అప్పగించాడు. రెండో కూతుర్ని సీఏ చదివిస్తున్నాడు. చిట్టీల ద్వారా పొదుపు చేసుకున్న సొమ్ముతో శ్రీను సలహా మీదటే నేనూ పరిమిలో రెండెకరాల పొలం కొనుక్కున్నాను.
2014 సెప్టెంబరు
మా ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలోని 'తుళ్లూరు'ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. రాత్రికి రాత్రి మా ఊరి భూములకు రెక్కలొచ్చాయి. పొలాలు కోట్లకు పడగలెత్తాయి. సగం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం లేని మారుమూల గ్రామంలో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులు వెలిశాయి. కార్లు క్యూ కట్టాయి. దళారుల్ని ఆకస్మిక అదృష్టం వరించింది. రాజధాని నిర్మాణానికి తొలిదశలో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తుకు అనుకూలంగాలేని 'అవలక్షణం' కారణంగా మా ఊరిని మినహాయించారు. అయితే మా ఊరి పొలం సింహ భాగం తుళ్లూరు గ్రామపరిధిలో ఉంది. నాదీ, శ్రీనుదీ కూడా అక్కడే ఉంది. మా పొలం నెత్తిన ''ల్యాండ్‌ పూలింగ్‌ కత్తి'' వేలాడుతోంది.
దళారుల పుణ్యమాని నెల తిరక్కుండానే మా ఊరి బీడు భూమి కూడా ఎకరం కోటిన్నరకు చేరుకుంది. ఓ రోజు రమేష్‌ ఫోన్‌ చేసి నేను పొలం అమ్మాలనుకుంటున్నాను. నువ్వు కూడా ఇచ్చేస్తావా, మంచి బేరం వచ్చింది.'' అన్నాడు. ''శ్రీను గాడేమంటున్నాడు?' ఆరా తీశాను.
''వాడా ....సెంటిమెంటల్‌ ఫూల్‌. ఆ మట్టిని అమ్ముకోలేనంటున్నాడు.'' చెప్పాడు హేళనగా నవ్వుతూ. ''అయితే నేనూ ఫూల్‌నే.'' అన్నాను. వాడు ఫోన్‌ పెట్టేశాడు.
రమేష్‌ రెండెకరాల పొలం అమ్మాడు. మూడు కోట్ల రూపాయలతో మకాం గుంటూరుకు మార్చాడు. ఫైనాన్స్‌ వ్యాపారం ప్రారంభించాడు. ఖరీదైన మిత్రులు జత కలిశారు.
2015 ఫిబ్రవరి 27, శక్రవారం
''రామీ, భూమిని ప్రభుత్వానికి అప్పగించక తప్పేట్టు లేదు..'' ఫోన్‌లో చాలా నీరసంగా ఉంది శ్రీను గొంతు. ''ఎందుకని? మీరంతా కలిసి అభ్యంతర పత్రం సమర్పించారుగా'' అడిగాను.
''అధికారులు తెలివిగా బెదిరిస్తున్నారు. ఈ నెల 28 లోపు భూమిని అప్పగిస్తే మనకు ఎకరానికి పన్నెండొందల గజాల స్థలం కేటాయిస్తారట. అది భవిష్యత్తులో కోట్ల ఖరీదు చేస్తుందట. లేకపోతే భూ సేకరణలో భాగంగా బలవంతంగా లాగేసుకుని, తృణమో పణమో పరిహారంగా ఇస్తారట.'' బాధగా చెప్పాడు శ్రీను.
''మరి ఏం చెయ్యాలనుకుంటున్నావు?'' ''ఇచ్చేదామ్‌రా. ఈ టెన్షన్‌ మనం భరించలేము. రాత్రికి బయల్దేరి వచ్చెరు. నీది కూడా ఇచ్చేద్దువు గానీ.''
''ఓకే శ్రీనూ. టికెట్‌ బుక్‌ చేసుకుంటాలే. ఇంకేంటి సంగతులు?''
''ఇంకో ముఖ్యమైన సంగతుందిరా, రమేష్‌ గురించి...''
''ఏమైంది రమేష్‌కు? రెండు చేతులా సంపాదిస్తున్నాడని విన్నాను.''
''డబ్బు పాపిష్టిదిరా. వాడేదో ఇల్లీగల్‌ వ్యవహారాల్లో ఇరుక్కున్నాడట. వాడి భార్య నాకు వారం నుంచీ ఫోన్లు చేస్తోంది. ఓసారి మనిద్దరినీ తనింటికి రమ్మని బతిమాలుతోంది. రేపొస్తావుగా వెళ్లి పాపం ఆమె బాధేమిటో కనుక్కుందాం.''
2015 ఫిబ్రవరి 28, శనివారం, ఉదయం పది గంటలు
తుళ్లూరులో ప్రత్యేక ప్రభుత్వ కార్యాలయం
జనంతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వాజ్ఞను శిరసా వహించి బుద్ధిగా భూమిని అప్పగించడానికి వచ్చిన మాలాంటి వాళ్లు, ఇంకేవేవో పనులపై వచ్చినవాళ్లతో కీసరబాసరగా ఉంది. శ్రీనూ నేనూ భూమినివ్వడానికి సంసిద్ధత తెలుపుతున్నట్లు సంతకాలు పెట్టి బయటికొచ్చాం. శ్రీను మౌనంగా ఉన్నాడు. వాడి మొహంలో బాధ, పగిలిన పత్తిగుల్లలా స్పష్టంగా కనిపిస్తోంది. మెయిన్‌ రోడ్డు మీదకి చేరుకున్నాం. అక్కడ కొంతమంది రైతులు ధర్నా చేస్తున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా నినాదాలిస్తున్నారు. ఇంతలో ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ వచ్చి, మైకును ఓ రైతు చేతికిచ్చి మాట్లాడమన్నాడు. తలకు కండువా, భుజాన పైపంచెతో, మాసిన గడ్డంతో మాట్లాడటానికి  సిద్ధమైన కోటయ్యను వెంటనే పోల్చుకోలేకపోయాను. గుర్తిం చగానే దగ్గరగా వెళ్లి శ్రద్ధగా అతని మాటలు వినసాగాను.
''అసలేమనుకుంటున్నారు రైతుల గురించి? మట్టిని నమ్ముకుని మట్టిలోనే బతుకుతున్న వాళ్లం. ఆ మట్టిని లాగేసుకుంటే మాకేగాదు, జనానిగ్గూడ అన్నం ముద్ద దొరకదు. మూడు కార్లు పండే భూమి. మండు వేసవిలో గూడా మల్లెలు పండే భూమి. ఎకరం ఉండా దిగుల్లేకుండా సంసారాలు సాదుతున్నాం. పిల్లల్ని చదివించుకుంటున్నాం. పెళ్లిళ్లు చెయ్యగల్గుతున్నాం. ఎకరానికి రెండు లక్షల ఆదాయం వస్తుంది. ఇప్పుడు దాన్ని లాగేసుకుని ఏటా పాతిక వేలు ఇస్తామంటే, అది ఏ మూలకొచ్చేను? ఎవురి కడుపు నింపేను? నాలుగెకరాల్లోంచి రొండెకరాలిమ్మంటే అర్థముంది. ఉన్నది మొత్తం ధారదత్తం సెయ్యమంటున్నారు. పదెకరాల రైతు కూడా బికారిగా మారాల్సిందేనా?..''
పాతికపైగా గ్రామాల్లోని పంటపొలాలు సమస్తం రాజధాని నిర్మాణానికి ఇచ్చే యాల్సిందేనని సర్కారు ఆదేశం. ''ఎకరం దొండ తోటసాగుకు ఏటా పదిహేను వందల మంది కూలీలు
పడతారు. ఈ ప్రాంతం నుంచి లారీలకు లారీలు కూరగాయలు మార్కెటుకు పోతున్నాయి. ఇంత మంది కూలీల కడుపులేం గావాలి? మీ దగ్గర రాజధాని పెట్టబట్టే మీ భూములకు రేట్లొచ్చాయని మంత్రులు బుకాయిస్తున్నారు. బోడి ఇప్పుడు పెరగడమేంది...మా భూములు ఎప్పుడో కోటి దాటాయి. అయినా రాజధాని నిర్మాణా నికి లచ్చ ఎకరాలు నిజంగా అవసరమా?'' కోట య్య ఆవేశంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అన్యమ నస్కంగానే అక్కణ్నుంచి కదిలాం, శ్రీను బైకు మీద. ముందుగా అనుకున్న ప్రకారం, పరిమి వెళ్లే దారి మధ్యలోనే చెరువు దగ్గర్నుంచి ఎడమవైపు ప్రయాణించి శాఖమూరు చేరుకున్నాం. ''రండన్న య్యా !'' ఆహ్వానించింది రమేష్‌ భార్య. నలభై నిండక ముందే శరీరం మీద ముసలితనం వాలినట్లు, నిస్సత్తువగా ఉందామె. మొహంలోని దిగుల్ని దాచుకోలేకపోతోంది. పైపై మాటలు పూర్తయ్యాక ''రమేష్‌ రెండు మూడు రోజులకోసారైనా ఇంటికొస్తున్నాడా?'' తీగ లాగాను. అమె ఒక్క పెట్టున ఏడ్చేసింది. మేం కంగారు పడ్డాం.
నేను కొంచెం దగ్గరగా వెళ్లి ''ఊరుకోమ్మా, ప్లీజ్‌, ఊరుకో. నీ కష్టంలో మేం పాలు పంచుకుంటాం. ధైర్యంగా ఉండు.'' అన్నాను ఆమె స్థిమిత పడింది. ''అదెవత్తో, టీవీ నటి అంట. అయన దాంతో ఉంటున్నాడు, ఊరంతా ఆ విషయం కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. తల కొట్టేసిన ట్లయింది. నాకు...''.
అప్పటికే అన్ని విషయాలూ శ్రీను చెప్పడంతో నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు.
''నువ్వేం కంగారు పడకు. మేమిద్దరం రేపు గుంటూరు వెళ్లి, మందలిస్తాం. కొట్టో తిట్టో వాణ్ని ఆ రొంపిలోంచి బయటికి తీసుకొస్తాం.'' ధైర్యం చెప్పా ను.
''డబ్బు చాలా పాపిష్టిది అన్నయ్యా. పొలం మట్టి రూపంలో ఉండగా ఆయన దేవుడు. ఆది డబ్బు రూపంలోకి మారిందో లేదో మాయదారి రోగాలు పుట్టుకొచ్చాయి.'' రెండు వాక్యాల్లో రమేష్‌ జీవితాన్ని విశ్లేషించిందామె.
ఆమె దగ్గర సెలవు తీసుకుని బండి మీద బయల్దేరాం. చెరువు దాటగానే, మెయిన్‌ రోడ్డు మీద పరిమి వైపు ఫర్లాంగు దూరం పోయాక, బైకును డొంకలోకి మళ్లించాడు శ్రీను.
''ఇటెక్కడకిరా?'' అడిగాను.
పోగొట్టుకున్న పొలాన్ని చివరిచూపు చూద్దామని... అంటూ బైక్‌ స్టాండ్‌ వేశాడు. ఇద్దరం చేలోకి నడిచాం. పత్తిచేను చివరి దశలో ఉంది. మునుం మధ్యలో నడుస్తుంటే, మొక్కలు ఎండుకట్టెల్లా గుచ్చుకుంటున్నాయి. ఒక్కసారిగా, పిచ్చిపట్టిన వాడిలా శ్రీను రయ్యిన పొలానికి అడ్డంగా పరుగెత్తాడు. కంగారుగా నేను కూడా పరుగెత్తుతూ వెళ్లాను. గట్టు దాకా వెళ్లి, అక్కడ కూలబడ్డాడు వాడు. నేను వెళ్లి పక్కనే కూచున్నాను, పత్తిగుల్లలు గీసుకుపోయి, వాడి చేతులు అక్కడక్కడా రక్తమోడుతున్నాయి. వాడు రొప్పుతున్నాడు. నేను సముదాయిస్తున్నట్టుగా, వాడి భుజం మీద చెయ్యి వేశాను. బావురుమన్నాడు.
''ఇక్కడే! ఇక్కడే రా... నేను అరక దున్నడం నేర్చుకుంది. గొర్రు తిప్పడం, విత్తనం ఎద బెట్టడం, కలుపు తియ్యడం,మందు చల్లడం... అన్నీ ఈ మట్టిలోనే నేర్చుకున్నాను. పత్తి, మిర్చి, మినుము, కంది, శనగ, జామ... ఎన్ని రకాల పంటలిచ్చిందో ఈ తల్లి. కేవలం ఈ నేల మీదనే సంసారం గడిచింది. పెద్దకూతురి పెళ్లి చేశాను. చిన్నదాన్ని సీఏ చదివిస్తున్నాను... ఇప్పుడు ఇచ్చేశాను. ప్రభుత్వానికి నా వంతు కానుకగా ఇచ్చేశాను. తల్లి వేరు తుంచుకున్నాను. మట్టి బంధం తెంచుకున్నాను. రేపట్నుంచి ఎలా బతకాలి? తెల్లారే లేచి, ఏ దిక్కుగా నడవాలి? నాగలిని ఏం చెయ్యాలి?'' శ్రీను గుండెలవిసేలా విలపిస్తున్నాడు, పత్తిచెట్టును పొదివి పట్టుకుని. నాకు తెలియకుండానే, నా కళ్లు తడిదేరాయి. వాణ్ని ఓదార్చడానికి విఫలయత్నం చేశాను.ఏడ్చీ ఏడ్చీ సొమ్మసిల్లి పడిపోయాడు శ్రీను.
2015 మార్చి, అదివారం
నేను, శ్రీను ఉదయం తొమ్మిదింటికి పరిమిలో బయల్దేరి పదింటికి గుంటూరు చేరుకున్నాం. ఆటోలో నేరుగా రమేష్‌ ఫ్ల్లాటు దగ్గరకు వెళ్లాం. అపార్టుమెంటు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే జనం మూగి ఉన్నారు. వాడు నాలుగో అంతస్తులో ఉంటాడు. లిఫ్ట్‌లో పైకి వెళ్లడానికి ప్రయత్నించగా, ఓ పోలీస్‌ అడ్డుకున్నాడు. అంతమంది జనం, నలుగురు కాన్‌స్టేబుళ్లు అక్కడెందుకున్నారో మాకర్థం కాలేదు. ఓ పక్కగా నిలబడి, వింతగా చూస్తున్నార. ఇంతలో లిఫ్ట్‌ కిందికి వచ్చింది. అందులోంచి, ఇద్దరు పోలీసులు రమేష్‌కు చెరో పక్క నిలబడి బయటికొచ్చారు. తోసుకుంటున్న జనాన్ని తప్పించుకుంటూ, వాడి చెరో రెక్క పట్టుకుని చకచకా తీసుకెళ్లారు. అంత హడావుడిలోనూ గోడవారగా నిలబడి ఉన్న మా ఇద్దర్నీ రమేష్‌ ఓరకంట గమనించినా, చూడనట్లే ముందుకు సాగిపోయాడు. మాకంతా అయోమయంగా ఉంది. ''ఏం జరిగింది?'' అని జనంలోంచి అడిగిన ఓ వ్యక్తికి మరో వ్యక్తి చెబుతున్న సమాధానం మాకు స్పష్టంగా వినిపిస్తోంది.
''గంట క్రితం, బ్రాడీపేటలో ఉన్న లాడ్జిలో ఎవరో ఓ టీవీ నటిని హత్య చేశారట. ఆ హత్యతో ఇతనికి సంబంధం ఉండొచ్చన్న కారణంతో అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు.''
మాకిక అక్కడ ఉండ బుద్ధి కాలేదు. బీడువారిన హృదయాలతో భారంగా కదిలాం.

No comments:

Post a Comment