Tuesday 9 December 2014

Jansi laxmi bhai


Yoga for working people


Same planet like earth


Honesty give good image


Shining with Beatroot


Chaildern - Tension


US - Study


Rama sethu in india


Heart - Fruit


Cancer Protection


knee problems


Avoid Boddinkalu! How?


telugu vantakalu


skin care


Chaild care


Best 3 things must eat


beauty- sandalwood


Family time is importent


Beauty - Sandalwood


Aim high tagets



 


Wednesday 3 December 2014

సూపర్ కార్ వచ్చేస్తోంది!

రెప్పపాటులో 150 మీటర్ల ప్రయాణం
3.6 సెకన్లలో మైలు దూరానికి దూసుకుపోయే స్పీడు
గంటకు 1600 కిలోమీటర్ల ప్రయాణ వేగం
1,35,000 హార్స్‌పవర్ సామర్థ్యం
...ఇవన్నీ రాకెట్ ఫీచర్లనుకుంటున్నారా...కాదు. ఓ కారు గుణగణాలివన్నీ! పేరు బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కార్. మరో ఏడాదిలో రోడ్డుపైకి రానున్న ఈ కారు ఇప్పుడు సర్వత్రా సంచలనం రేకెత్తిస్తోంది. ఫార్ములా వన్ రేస్ కార్లను తలదనే్న రీతిలో, రాకెట్లతో పోటీపడే స్పీడుతో వాయువేగ మనోవేగాలతో దూసుకుపోయే బ్లడ్‌హౌండ్‌పైనే ఇప్పడందరికీ ఆసక్తి. కుర్రకారుకు కిర్రెక్కించే, రేసర్లకు కిక్కెక్కించే ఈ సూపర్‌సోనిక్ కారు మరి కొన్ని రోజుల్లోనే టెస్ట్ డ్రైవ్‌కు సిద్ధం కాబోతోంది. ఇంతకీ ఎక్కడుందా బ్లడ్‌హౌండ్?
యుకేలోని బ్రిస్టల్‌లో ప్రాజెక్టు టెక్నికల్ సెంటర్‌లో తుది దశ డిజైనింగ్‌లో ఉన్న బ్లడ్‌హౌండ్‌కు సృష్టికర్త స్కాట్‌లాండ్‌కు చెందిన ఓ బిగ్‌షాట్. పేరు రిచర్డ్ నోబెల్. గతంలో థ్రస్ట్ సూపర్‌సోనిక్ కారు (గంటకు 763 మైళ్ళ వేగం)ను రూపొందించిన ఘనత రిచర్డ్‌దే. రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ పైలట్‌గా పనిచేసిన ఆండీ గ్రీన్‌తో కలసి బ్లడ్‌హౌండ్ రూపకల్పనలో బిజీగా ఉన్న రిచర్డ్ వచ్చే ఏడాదికి టెస్ట్ డ్రైవ్‌కి తీసుకువస్తానంటున్నాడు.
ఫీచర్ల విషయానికొస్తే బ్లడ్‌హౌండ్‌లో రెండు ఇంజన్లు ఉంటాయి. అందులో ఒకటి రాకెట్ ఇంజన్ . మరొకటి రోల్స్ రాయిస్ జిజె 200 ఇంజన్. వీటి సంయుక్త సామర్ధ్యం 1,35,000 హెచ్‌పి. ఏడు టన్ను ల బరువు. బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా 250 కంపెనీలు పనిచేస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లో దక్షిణాప్రికాలో హై స్పీడ్ టెస్ట్ డ్రైవ్‌కు వెడతామంటున్న రిచర్డ్... సైన్స్ అండ్ టెక్నాలజీలో యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నదే తమ ప్రాజెక్టు లక్ష్యమంటున్నాడు. *

సక్సెస్ నిచ్చెనెక్కడమెలా!

వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న యువత తపనకు
చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..
పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధ్యమయ్యేవేనా..ఉద్యోగ
మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో
స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల
దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే
ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను
తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి.
నేటి యువత కోరికలకు కొదవ లేదు. ఆత్మ విశ్వాసానికీ ఢోకా లేదు. అదే వారిని పరుగులు పెట్టిస్తోంది. ధైర్యంగా ఏ రంగంలోకైనా దూకేసేందుకూ ప్రేరణ అవుతోంది. తమ ముందు తరంకంటే కూడా నేటి తరం వేగంలోనే కాదు, దేన్నయినా సాధించగమన్న ధీమాలోనూ తిరుగులేనిదే. తామేపని చేపట్టినా, ఏ బాధ్యత నిర్వర్తించినా అందులో తమ ముద్ర ఉండాలన్న తపన, యావ యువతకు మెండుగానే ఉన్నాయి. వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ అద్వితీయంగా రాణించాలన్న వీరి తపనకు చోదకశక్తి ఆత్మవిశ్వాసమే. అయితే, వాస్తవాలకు జీవితానికి మధ్య ఏకోశానా పొంతన ఉండదు. డిగ్రీలకూ, ఉద్యోగానికీ కూడా అంతే దూరం. నర్సరీ మొదలుకుని..పట్టా పుచ్చుకునే వరకూ యువతలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు. పరుగులు పెట్టించే మనోరథాలు! అంత సులభంగా సాధయమయ్యేవేనా..ఉద్యోగ మార్కెట్‌లో అడుగు పెట్టిన వెంటనే ఉపాధి అవకాశాలు చిరునవ్వుతో స్వాగతం పలికే అవకాశం ఉందా..నేటి పోటీ ప్రపంచంలో..ఒక్కో ఉద్యోగానికి వేల దరఖాస్తులు దాఖలవుతున్న నేపధ్యంలో అడుగడుగునా నిరాశే ఎదురవుతుంది. ధైర్యంగా అడుగేయలేని అనిశ్చితే తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మ విశ్వాసం, స్వీయ ప్రతిభపై నమ్మకం రాణిస్తాయి. అశాంతిని, నిరాశను తొలగించి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలిగే మనోధైర్యాన్ని అందిస్తాయి. అందరికీ ఇలాంటి ఆత్మస్థయిర్యం ఉండకపోవచ్చు. కుటుంబ నేపథ్యం..పెరిగిన తీరుతెన్నులూ ఇందుకు ప్రధానంగా కారణం అవుతాయి. కొందరిది దూకుడు మనస్తత్వమైతే ఇంకొదరిది ఒకటికి పదిసార్లు ఆలోచిస్తేగానీ ముందుకెళ్లలేని డోలాయమానం. ఇలాంటి పరిస్థితుల్లో ఊహాప్రపంచం ఉంచి బయటికి రావాలి. స్వీయ ప్రతిభను తులనాత్మక రీతిలో బేరీజు వేసుకోవాలి. జీవిత లక్ష్యాలు ఎండమావులు కాకుండా వాస్తవికతను సంతరించుకోవాలి. ఇందుకు ప్రధానంగా కావాల్సిన, అనివార్యంగా ఉండాల్సిన లక్షణం..సవాళ్లను ఢీకొనగలిగే మనస్తత్వం. జీవన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎత్తు పల్లాలు వెలుగు నీడల్లా అడుగడుగునా తారసిల్లుతూనే ఉంటాయి. రోజురోజుకూ మారిపోతున్న పరిస్థితుల్లో..దేశాల మధ్య సరిహద్దులు తొలగిపోయి ఎల్లల్లేని అవకాశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇలాంటి పరిస్థితులూ, పరిణామాలు సహజమే. నేల విడిచి సాముచేసే ధోరణిని పక్కన పెట్టి అందిన అవకాశాలకు తగ్గట్టుగా రాణించడంలోనే సక్సెస్ ఉంటుంది. తగిన నైపుణ్యాన్ని సంతరించుకోవడంలోనే జీవిత వైకుంఠపాళిలో గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఏటేటా లక్షలాది మంది జాబ్ మార్కెట్‌లోకి అడుగు పెడుతున్న తరుణంలో..ఉద్యోగమా..ఉపాధా అన్నది పెద్ద మీమాంసగా మారుతోంది. చదువుకు తగ్గ ఉద్యోగం గగనమయితే..అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకునే నైపుణ్యం ఎండమావిగా మారుతోంది. ఈ సందిగ్థావస్థ నుంచి బయట పడాలంటే ముందుగా కావాల్సింది వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన. ఊహా ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఆత్మ విశ్వాసమే పెట్టుబడిగా ముందుకు దూసుకుపోగలిగే నైజం. ఎలాంటి ఆసరా లేని నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారున్నారు. అలాంటి వారి జీవితాలు జీవన పోరాటంలో విసిగివేసారి నైరాస్యంలో కొట్టుకుపోతున్న యువతకు ఆదర్శం కావాలి. వారి బాటలో ముందుకెళితే సవాళ్లు దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అందని ఆకాశం అందినంత ఆనందాన్ని కలిగించే అవకాశాలు అందివస్తాయి. ఆత్మస్థయిర్యమే పెట్టుబడిగా..పట్టుదలే సోపానంగా సాగినప్పుడే ఇవన్నీ సాకారం అవుతాయి. నేటి యువత సక్సెస్ మంత్రం..జీవితంలో ఎదిగే తంత్రం ఇదే.
*

పాలకులకు పట్టని గురజాడ


ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, ఆయన ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించామా? ఈ శతాబ్ది కాలాన్ని కొంత స్వతంత్రం లేకా, తర్వాత స్వతంత్రంలోనూ మనం అశ్రద్ధ, అవిధేయత, అసమర్థతల మధ్యే ప్రధానంగా గడిపామన్నది ఒక కటువైన వాస్తవం. కొన్ని పరిశోధనలూ, కొంత విశే్లషణాత్మక విమర్శ వెలువడినా, దాని కోసం నిష్ణాతులు పనిచేసినా, ఇంకా జరగాల్సింది చాలా ఉన్నదన్నది పచ్చి నిజం. ఎవరో కథలు రాసిన వారిని చూపెట్టి, ఇంకేవో ఘనతలు ఒక రంగంలో సాధించిన వారిని చూపెట్టి, గురజాడను పక్కన పెట్టడం సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెడ్డి పోయె... నాయుడొచ్చె చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా గురజాడను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గురజాడ తర్వాత వందేళ్ళకు పుట్టిన కాళోజీ, జయశంకర్ వంటి ధీమంతులకు తెలంగాణ ప్రభుత్వం విశేషించి ఉత్సవాలు జరుపుతుండగా, గురజాడను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
1903లో తన తెలుగు కథలకు ఏడేళ్ళు ముందే గురజాడ ఆంగ్లంలో ఒక కథ రాశారు. అది ‘స్టూపింగ్ టు రైజ్’. (గురజాడ ఈ పేరు పెట్టడంలో ‘స్టూపింగ్ టు కాంకర్’ పేరిట 1773లో ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన నాటకం గమనానికి వస్తుంది). అప్పటికి ఆంగ్లంలో కథలు రాసిన భారతీయ రచయితలు కొద్దిమందే ఉండొచ్చు. లేదా తొలి తరం భారతీయ ఆంగ్లకథా వికాసకర్తలు అయిన ఆర్.కె.నారాయణ్, రాజారావు, ముల్క్‌రాజ్ ఆనంద్‌ల కన్నా ముందున్నాడనడంలో సందేహం లేదు. ఈ గణాంకాలు ఏవి వెలికితీద్దామన్నా మన వద్ద ఆ కథ మూలం లేదు. దానిని పారేసుకున్న అశ్రద్ధ మనది. అనువాదం చేసిన అవసరాల సూర్యారావు గారు దానిని జాగ్రత్త చేయలేకపోయారు. విశాలాంధ్ర వారి మధ్య, స్టేట్ ఆర్కైవ్స్ శాఖ వారికి చేరేలోపు ఆ కథ ఎక్కడో గల్లంతు అయిపోయింది. పాత కవులవి దొరకలేదు అంటే ఓ అర్థం వుంది. కానీ నూరేళ్ళలోపే జరిగిన ఒక ప్రామాణిక రచనను ఆధారాలు లేకుండా పారేసుకున్న మన అశ్రద్ధ, మరే ఇతర భాషా సమాజానికి ఉంటుందని అనుకోలేం. కన్యాశుల్కం తొలి ముద్రణ ప్రతి సైతం అంతే. ఆరుద్ర దానిగురించి రాయగా రాయగా ఆ పూనికతో బండి గోపాలరెడ్డి (బంగోరె) దానిని మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారంలో కూచుని ఆనాడు జిరాక్స్ వెసులుబాటు లేనందువల్ల నకలు రాసుకున్నాడు. దీంతో ఆ రచన అక్కడ వుందన్న సమాచారం మనకు అప్పుడు తెలిసింది. ఒక వెలోరియమ్ ఎడిషన్ కూడా తీసుకురావాల్సిన అవసరాన్ని బంగోరె ప్రస్తావించాడు. ఆ కన్యాశుల్కం ప్రతి జీర్ణావస్థలో వుంటే, దానిని డిజిటల్ కాపీ చేసి భద్రపరిచే జాగ్రత్తలు ఇటీవలే మొజాయిక్ సాహిత్య సంస్థ తీసుకుంది. గురజాడ 150వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్రలో, విజయవాడలో దానిని 2012లో బహిరంగ ప్రదర్శనకు పెట్టింది. తొమ్మిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని ఎవరికి తోచిన కత్తిరింపులతో వారు ప్రదర్శించడం తప్పితే - ఈ నాటకం గురించి ఒక సమ్యక్ అవగాహన, దృష్టి ఈ నూరేళ్ళలో మనం ఏర్పరచుకోలేదు. చక్కని టెలిఫిల్మ్స్‌లా తీయతగ్గ చిత్రపరిశ్రమ మనకున్నా, గురజాడ రెండు కథలు అలాగే ఉన్నాయి. కన్యాశుల్కం సినిమాని 1955లో నిర్మించిన నిర్మాతలు తమకేదో దివ్యమైన హక్కులున్నట్టుగా నాటక ముగింపును మార్చివేశారు. ఇదే పని ఇంకే ప్రపంచ నాటకానికి, సాహిత్య రూపానికి ఆ దేశంలో జరిగితే అక్కడి ప్రజానీకం సహిస్తారా అన్నది సందేహమే. తక్కువ సమయంలో ప్రదర్శితమయ్యే సంపూర్ణ నాటకం గురించి మనకు అసలు ఏ ఆలోచనలూ లేకపోవడమే ఒక శిఖరాయన జడత్వం. యువతరం ఈ దిశలో ఆలోచన చేస్తున్న ఒకే ఒక్క ఆశాకిరణం - ప్రముఖ రచయిత కుమారుడైన అట్టాడ సృజన్ గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథను ‘కమిలి’ పేరిట ఒక లఘుచిత్రంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. గురజాడ గేయ కథానికలైన పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కల, డామస్ పీతియస్ - ఏదీ కూడా మన నాటకాలవాళ్లకీ, రూపకాలవాళ్లకీ, రేడియోవాళ్లకీ, టెలివిజన్ వాళ్లకీ, సినిమావాళ్లకీ, రాష్ట్ర చలనచిత్ర మండళ్ళ దృష్టిలో పడలేదు. ఏవో స్కూల్ వార్షికోత్సవాల్లో పిల్లలు ప్రదర్శనలు ఇచ్చుకోవడం తప్ప, మన సాంస్కృతిక సమాజం వీటి గురించి పెద్దగా చేసిందేమీ లేదు. గురజాడ రాసిన నీలగిరి పాటలు చక్కని సంగీత ప్రదర్శనగా రూపొందించడానికి ఎంతో పనికొస్తాయి. వాటిని పాడే గాయకుడూ కనిపించడు, సంగీత దర్శకుల మాట సరేసరి. షేక్‌స్పియర్, టాల్‌స్టాయ్, గోర్కీ, టాగోర్, శరత్, వల్లథోల్, సుబ్రహ్మణ్య భారతి, ఫకీర్ మోహన్ సేనాపతి వంటి వారి పట్ల ఆయా భాషా సమాజాల స్పందన, మన తెలుగువారి కన్నా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. అనువాదాల విషయానికొస్తే - అమ్మకానికి అమ్మాయిలు (గర్ల్స్ ఫర్ సేల్) పేరిట వేల్చేరు నారాయణరావు చేసినది అనువాదం కాదు, అపరాధం. ఇంకో జాతిలో అయితే మూల రచనలో ఆయన తీసుకున్న స్వాతంత్య్రానికి, అనువాదకుడు, ప్రచురణకర్తలపై చట్టపరమైన చర్యలు మొదలై వుండేవి. గురజాడ వ్యక్తిత్వం గిరీశంలో ఉందని భావించేవారి సంఖ్య ఎంత ఉన్నా, వాల్మీకి రావణుడిలో ఉన్నాడంటే ఎంత నొచ్చుకుంటామో అటువంటిదే ఈ వదరుబోతుతనం కూడా.
గురజాడ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంలోనూ పాలకులూ, మనం చూపిన, చూపుతున్న అశ్రద్ధ అంతా ఇంతా కాదు. తాను నివసిస్తున్న ఇల్లు తనకు ఎలా వచ్చిందో తన లేఖల్లో వివరంగా రాశారు. పెద్ద దావా సెటిల్ చేయడంతో తన సేవలకు పారితోషికంగా ఇస్తామన్న సొమ్ములో రెండువేలో, పదిహేను వందలో చెల్లుబాటు చేసుకుని ఖాళీ జాగా కూడా ఇస్తే ఇల్లు కట్టుకుంటానని కూడా గురజాడ రాసిన లేఖల్లో వుంది. ఇప్పుడుంటున్న ఇల్లు ఇరుకుగా వుందని, కొత్త ఇంటికోసం నూయి తవ్వించి, ఇంటి నిర్మాణ సామగ్రి కుప్పలు వేసి, కాపలావాడిని పెట్టిన వైనాలన్నీ ఆయన డైరీలో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకపోవడం వల్ల, గురజాడ కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యల వల్ల ఆయన కట్టుకున్న ఇల్లు ప్రైవేటు వ్యక్తుల పరమై నేలమట్టమై పోయింది. గురజాడ మరణించేవరకూ నివసించిన ఇల్లు ఒకప్పటి గుర్రపుశాల. దానినే కొన్ని దశాబ్దాల కింద అప్పటి ప్రభుత్వం ఒక చిన్న స్మారక మందిరంగా మార్చింది. చెక్క సున్నంతో కట్టిన పాతకాలపు హెరిటేజ్ కట్టడం అది. పక్కనే పెద్దఎత్తున లోతుగా పునాదులు వేసి, వ్యాపారపరమైన నిర్మాణాలు జరిపితే, అది కూలిపోవడం ఖాయం. దీన్ని అడ్డుకునే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్దకానీ, విజయనగరం స్థానిక అధికారుల వద్దకానీ ఉన్నట్టుగా లేవు. అది కూలిపోయిన వార్త కూడా ఈ శతవర్ధంతి వత్సరంలో వింటామేమో. ఇదీ మన సమర్థత!
గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుండి మేల్కొని, గురజాడ 150 జయంతి సందర్భంలో ఆయన పేరిట ఐదుకోట్ల నిధి ప్రకటించింది. అందులో, ఆ ఏడాది హడావిడికి ఒక ముప్ఫయి లక్షల కన్నా ఖర్చు అయిన దాఖలాలు లేవు. ఇప్పటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను గౌరవించడమో, ఆ నిధిని ఇంకా పెంచడమో చేస్తే తెలుగు జాతికి సాంస్కృతిక ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అమ్ముడైపోయిన గురజాడ స్వంత ఇంటి స్థలాన్ని పక్కనే ప్రస్తుతం ఉన్న చిన్న మెమోరియల్‌ను కలిపి ఒక సముచిత స్మృతి కేంద్రంగా విజయనగరంలో నిర్మిస్తే తెలుగు జాతి సంతోషపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లా ముఖ్య కేంద్రంలో గురజాడ కళామందిరాలు ఏర్పాటుచేయడం, నాటక సమాజాలకు ఒక సెంట్రల్ హాల్, సాహిత్య సంఘాల సభలకు చిన్న సమావేశ మందిరాలు, ఆధునిక వసతులు కలిగిన గ్రంథాలయం సమకూర్చడం తెలుగు జాతి ఖ్యాతికి దోహదపడే చర్య. కొత్త రాష్ట్రంలో, గురజాడ శతవర్ధంతి వత్సరంలో ‘దృశ్య మాధ్యమాల్లో గురజాడ సాహిత్యం’ అనే దానిపై దృష్టి పెట్టి, కార్యాచరణ రూపొందించి అమలు చేయడం ఎంతైనా అవసరం. ఇప్పుడైనా ఇది మొదలుపెడితే, గురజాడ మనకు దూరమైన ఈ రెండో శతాబ్దిలో, కనీసం, ఒక బాధ్యతాయుతమైన జాతిగా తలెత్తుకు నిలబడగలుగుతాం.

Think before you go USA

ఆలోచించి మరీ... అమెరికా వెళ్లండి..!

అమెరికన్ డాలరు విలువ నేడు అరవై రూపాయల పైచిలుకే. అంటే అమెరికాలో ప్రజలు ఇక్కడవారికన్నా అరవై రెట్లు సుఖపడతారు కాబోలు!. సినిమాల్లో, టీవీలో, వార్తాపత్రికల్లో అమెరికా దేశపు ఫొటోలు చూసినవారికి అలా అన్పించడంలో తప్పులేదు. విశాలమైన రోడ్లు, నాలుగెకరాల తోటలో అందమైన భవంతులు, పడవల్లాంటి కార్లు... ఇవన్నీ చూస్తుంటే అమెరికా భూతల స్వర్గమే అని ఎవరికైనా అనిపిస్తుంది. అందునా అమెరికాలోని భారతీయులు మరింత ఎక్కువగా సుఖపడుతూ ఉండి ఉండాలి. అమెరికాలో పౌరులందరినీ కలిపి లెక్కకడితే సగటు కుటుంబ ఆదాయం ఏడాదికి సుమారుగా 82 వేల డాలర్లు. అమెరికాలో ఉన్న సగటు భారతీయ కుటుంబ ఆదాయం 88 వేల డిలర్ల దాకా ఉంటుంది. ఇది భారతీయులకు గర్వకారణమే. డాలర్లను రూపాయలలోకి మారిస్తే సంవత్సరాదాయం యాభై లక్షల పైచిలుకే. ఇది భారతీయులకు- అందునా తెలుగువారికి ఆశాకిరణం. ఆశలకు కారణం. అప్పో సొప్పో చేసైనా పిల్లలను అమెరికాకు పంపించాలి. అలా సాధ్యం కాకపోతే వారికి అమెరికా సంబంధం చెయ్యాలి. ఈ విషయంలో ఆడపిల్లా, మగ పిల్లవాడూ అన్న తేడా లేదు. పిల్లలు అమెరికాలో సుఖపడాలి, మనని సుఖపెట్టాలి.
మరి పిల్లలను అమెరికా పంపించడమెలా? బాగా తెలివైన పిల్లలను అక్కడ యూనివర్సిటీలు ఫీజు లేకుండా చేర్చుకోవడమే కాదు, నెలకు మూడు వేల దాకా స్టయఫండ్ ఇస్తాయి, అమెరికా రావడానికి విమాన ఛార్జీలు చెల్లిస్తాయి. తెలివిగల పిల్లలకు ఫీజు రాయితీలు ఇస్తాయి. తెలివితేటలను బట్టి యూనివర్సిటీలో సీటు రావడం, ఫీజు రాయితీ ఉంటుంది. మంచి యూనివర్సిటీలో ఫీజు రాయితీ లేకుండా చేరడమా? ఓ మోస్తరు యూనివర్సిటీలో ఫీజు రాయితీతో చేరడమా? అన్నది విద్యార్థి ఇష్టంపై, తల్లిదండ్రుల శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువగా అంచనా వేసినా ఒక సాధారణ విద్యార్థి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చెయ్యడానికి యాభై లక్షలైనా ఖర్చవుతుంది. కొన్నిచోట్ల తక్కువ కావచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ కావచ్చు. బాధ్యత తెలిసిన పిల్లలు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, వీలైతే చిన్న చిన్న మొత్తాలు సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిస్తారు.
యాభై లక్షలు ఒకేసారి డబ్బు సమకూర్చడం చాలామందికి సాధ్యం కాదు. అలాంటివారికి లోన్ తీసుకోవడం తప్పనిసరి. కష్టమేముంది? ఏడాదిలో పిల్లలు తీర్చెయ్యగలరు కదా! ఎనభై వేల డాలర్ల జీతమంటే మాటలా? ఇక్కడే ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. ఎనభై ఎనిమిది వేల డాలర్ల ఆదాయంతో ఉద్యోగం మొదలెట్టడం అందరికీ సాధ్యం కాదు. అధవా మొదలెట్టగలిగితే జీవితం ఎలా ఉంటుంది? అమెరికాలో అందరూ అందమైన తోటలో అయిదారు బెడ్రూమ్‌లు ఉన్న ఇళ్ళల్లోనే ఉండరు. అక్కడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయి. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె వెయ్యి డాలర్ల ప్రాంతంలో ఉంటుంది. కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలలో ఎక్కువ కావొచ్చు; లూసియానా, మిస్సిసిపీ వంటి రాష్ట్రాలలో తక్కువ కావచ్చు (ఇండియాలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌కి అరవై వేలు చెల్లిస్తున్నామా!). విద్యార్థులూ, కొత్తగా ఉద్యోగంలో చేరినవారూ ముగ్గురు, నలుగురు కలిసి ఫ్లాట్ తీసుకుని అద్దె పంచుకుంటూ ఉంటారు. నలుగురు ఉంటామని చెప్పి ఎక్కువమంది ఉంటారన్న ఇమేజీ భారతీయుల గురించి అక్కడ ఉంది. నిజానిజాలు భగవంతుడికెరుక.!
ఇంటి తరువాత ముఖ్యమైనది భోజనం. మన దేశంలోలానే అక్కడా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ తేడాలుంటాయి. సీజన్‌కీ, సీజన్‌కీ తేడాలుంటాయి. అందుకే ఇక్కడ ఇచ్చినవి ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. మన దేశంలో పాలు లీటరు ముప్ఫై ఎనిమిది రూపాయలైతే అక్కడ లీటరు అరవై ఒక్క రూపాయలు. ఇక్కడ బ్రెడ్ ఇరవై రెండయితే అక్కడ నూట నలభై అయిదు రూపాయలు. బంగాళా దుంపలక్కడ కిలో నూట యాభై, టమాటోలు రెండు వందల ఇరవై, గుడ్లు అమెరికాలో డజను నూట ముప్ఫై రూపాయలు (ఇవన్నీ డాలర్లను రూపాయలలోకీ, పౌండ్లను కిలోలలోకీ మార్చి ఇచ్చిన ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే). దొండ, అరటి, చేమ వంటి మన కూరలింకా ఖరీదు. పోనీ హోటల్‌కి వెడదామంటే భోజనం పది డాలర్లు. ఒక్క మనిషికి మామూలు భోజనం ఆరు, ఏడు వందల రూపాయలా? అమ్మ బాబోయ్..! నీళ్ళ సీసా వంద రూపాయలు. టాక్సీకి కిలోమీటరుకి దగ్గర దగ్గరగా వంద రూపాయలు.
మీడియాలో కొంతకాలం కిందట దేవయాని అనే ఫారీన్ సర్వీస్ ఆఫీసరు ఉదంతం వచ్చింది కాబట్టి పనిమనుషుల మాట ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. లాన్ కత్తిరించడానికీ లేదా ఇల్లు క్లీన్ చెయ్యడానికీ వంద నుంచి రెండు వందల డాలర్లదాకా తీసుకుంటారు. చాలా పెద్ద జీతాలున్నవారు తప్ప పనులకు మనుషులను పెట్టుకోలేరు. స్వయంగా చేసుకోవలసినదే. ఒక కుటుంబం ఇండియా రావాలంటే కనీస ఖర్చు అయిదారు వేల డాలర్లు. అందుకే మూడేళ్ళకోసారి కానీ చాలామంది రాలేరు.
ఇదంతా అమెరికాలో జీవితం దుర్భరంగా ఉంటుందని చెప్పడానికి కాదు. ఆ దేశంలోనూ సుఖపడే అంశాలెన్నో ఉన్నాయి. రోడ్లు విశాలంగా, శుభ్రంగా ఉంటాయి. చెత్తా చెదారం ఉండవు. నీళ్ళకీ, కరెంటుకీ ఇబ్బంది లేదు. మన దేశంలో కొన్ని సుఖదాయకాలున్నట్లే అక్కడా కొన్ని ఉన్నాయి. అమెరికా వెళ్ళాలనుకునే యువతకూ, పంపించాలనుకునే తల్లిదండ్రులకూ ఒక్కటే విన్నపం. పూర్తిగా ఫీజు వేవర్, స్ట్ఫైండ్‌తో చదువుకునే అవకాశం దొరికితే మంచిదే. కంపెనీ యాజమాన్యం వారి ఖర్చులమీద పంపినా మంచిదే. అలా కాకుండా సొంత ఖర్చుపై చదువుకుందుకు వెళ్ళేవారు జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం మంచిది. డాలరనగానే అరవై రూపాయల పైచిలుకు అనుకుని లెక్కలు వెయ్యవద్దు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాసులో చదివిన విద్యార్థులు డాలరు విలువ అయిదు రూపాయల నుంచి పది రూపాయల దాకా ఉండచ్చని లెక్కకట్టారు. అమెరికాలో ఎనభై వేల డాలర్లంటే ఇండియాలో అయిదారు లక్షల రూపాయలు మాత్రమే (హెచ్చుతగ్గులతో). ఆ లెక్కన ఖర్చుకి తగ్గ రాబడి ఉంటుందా? అని ఆలోచించండి.
పిల్లలను చూసి, వారు చూపించే అమెరికా అద్భుతాలు చూడడానికో, మనవలను పెంచడానికో చాలామంది అమెరికా వెళ్లి వస్తుంటారు. వారు చెప్పే విశేషాలతో అమెరికాను ఊహించుకోవద్దు. మూడేళ్లకో, నాలుగేళ్లకో ఓసారి ఇండియాకి వచ్చి గొప్పలు కొట్టుకునే ప్రవాస భారతీయుల మాటలనూ పూర్తిగా నమ్మవద్దు. బోస్టన్ నుంచి హ్యూస్టన్‌దాకా, అలాస్కా నుంచి అలబామాదాకా, వాషింగ్టన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ డి.సి దాకా బస్సులో తిరిగితే కానీ అమెరికా అసలు స్వరూపం తెలియదు. అమెరికా భూతల స్వర్గమూ కాదు, భూతాలు మాత్రమే తిరిగే నరకమూ కాదు. ఆ విషయం గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. శుభం భూయాత్.

High blood pressure

అధిక రక్తపోటు.. దంతాలకూ సమస్యే..!

బరువు పెరిగినకొద్దీ గుండెకి ఎక్కువ దూరం రక్తనాళాలలో రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. అందుకని గుండె గట్టిగా మూసుకుని తెరుచుకోవాల్సి వస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. గుండె గదులు పెద్దవవుతాయి. గదుల్లోని రక్తం పూర్తిగా పంప్ కాక మిగిలిపోతుంటుంది. శరీరంలోనే కాదు, రక్తంలోనూ కొవ్వు పెరుగుతుంది. రక్తనాళాల, గుండె జబ్బులొస్తాయి. అధిక రక్తపోటుతోపాటు అధిక బరువువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటిస్ వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావం పళ్లమీదా పడుతుంది. అందుకని దంతవైద్యం కోసం వెళ్లినపుడు అధిక రక్తపోటుంటే చెప్పాలి.
అధిక రక్తపోటున్నవాళ్లకి దంత, చిగుళ్ల శస్త్ర చికిత్సలలో రక్తస్రావం ఎక్కువవుతుంది. అందుకని ముందే తెలుసుకుంటే జాగ్రత్తపడవచ్చు.
నోట్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికే కాదు, క్రిముల్ని నాశనం చేయడానికి లాలాజలం తోడ్పడుతుంటుంది. అధిక రక్తపోటువల్ల నోరెండిపోతున్నట్లుంటుంది. దాంతో చిగుళ్ల వ్యాధులూ వస్తాయి. అందుకని రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే అధిక బరువుని తగ్గించుకోవాలి.
శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రక్తంలోనూ కొవ్వు పెరుగుతుందనుకున్నాం! దాంతో ఎథిరోస్క్లీరోసిస్ వచ్చి రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం రావచ్చు. ముఖ్యంగా దంతాల చిగుళ్లకి రక్తం సరఫరా చేసే నాళాలలో అడ్డంకులవల్ల చిగుళ్ల జబ్బులు రావచ్చు. అధిక రక్తపోటుకి వాడే మందులవల్ల నోటికి రుచి తెలియదు. దానినే ‘డిస్‌గేసియా’ అంటారు. అంటే మందుల ప్రభావం నోటి మీదుంటుందనేగా.
దంతవైద్యుడి దగ్గరకు వచ్చే ప్రతి విజిట్‌లోను రక్తపోటు చూసుకుంటుండాలి. రక్తపోటుని బట్టి దంత చికిత్సని వైద్యుడు ప్లాన్ చేస్తాడు. పొడిగించి చేసినా ఫరవాలేదనుకున్న చికిత్సల్ని తర్వాత చేస్తాడు. ఏ మందులు వేసి తగ్గించాలో కూడా వైద్యుడే నిర్ణయిస్తాడు.
ఈ ఇబ్బందులన్నీ పడి దంత చికిత్స చేయించుకునే బదులు బరువుని అదుపులో ఉంచుకోవడం మంచిది! కాబట్టి బరువుని అదుపులో ఉంచుకోవడంవల్ల అన్ని అవయవాలు అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తపడవచ్చు. అన్ని చికిత్సలకి అందుబాటులో ఉండవచ్చు. బరువు పెరగడం ఆరోగ్యానికి భారం.. అనారోగ్యానికి ఆలవాలం.

who can do liver donation?

కాలేయ దానం ఎవరైనా చేయొచ్చు..

య్యలేక ఈ అవయవాల్ని తీసేసి, వేరే అవయవాల్ని పెట్టక తప్పదు. మరి అప్పుడు అవయవాలు కావాలి, అవయవాలు లేకపోతే ‘మార్పిడి’ అనే మాటకి అర్థమే లేదు.
ఇప్పుడు ఏ అవయవం కోసమైనా ఎదురుచూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే, దాతల సంఖ్య చాలా తక్కువ. ఇది బాధపడాల్సిన పరిస్థితి. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల కలిగే స్థితి.
ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయితే అతని అవయవాలతో దాదాపు 9 మంది కొత్త జీవితాన్ని పొందుతారు. రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, గుండె, ఫాంక్రియాస్, లివర్‌లని దానం చేయవచ్చు. ఒక్కో అవయవం ఒక్కరికి అమరుస్తారు కాబట్టి 9 మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు.
ఇక్కడ మరో టెక్నికల్ విషయం గురించి ఆలోచించాలి. గుండె తీసిన 4 గంటలలోపే అమర్చి, కొట్టుకునేట్టు చెయ్యాలి. అలాగే కాలేయం 8 గంటల లోపు, కిడ్నీలు 24 గంటలలోపు.. ఇలా ఒక్కో అవయవాన్ని అమర్చేందుకు కచ్చితమైన కాలవ్యవధి ఉంది. అందుకని అవయవాలు దొరుకుతున్నాయంటే వాటి కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలో, ప్రాణాపాయం ఉన్నవాళ్ళని ముందు సిద్ధం చేస్తారు.
గుండె కొట్టుకుంటుంటే, రక్తప్రసరణ జరుగుతుండడంతో అన్ని అవయవాల్ని తీసుకోవచ్చు. అన్ని అవయవాల్ని తీసేసిన తర్వాత ఆఖరుకి గుండెని తీస్తారు. కానీ అమర్చేటపుడు గుండెని ముందు అమర్చాలి. కాలేయాన్ని సమయం మించకుండా అమర్చాలి.
ఇలా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అవయవదానం చేస్తే ‘కెడావరిక్ డొనేషన్’ అంటారు. అలా కాకుండా బతికున్న వాళ్ళనుంచి కొన్ని అవయవాలు లేక అవయవ భాగాలు తీసుకోవచ్చు. దానిని ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు. అంటే బ్రతికున్నవాళ్ళనుంచి దానం జరుగుతుందన్నమాట. రెండు కిడ్నీలుంటే ఒక కిడ్నీ దానం చేయవచ్చు. కానీ ఒక లివర్ వున్నా దాంట్లో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. లివర్ రెండేసి రెండేసి ఉన్న ఎనిమిది భాగాలు, ఎనిమిది భాగాలకి రక్తప్రసరణ వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కో ఫ్లోర్‌లో రెండేసి ఫ్లాట్లున్న నాలుగంతస్థుల భవనం లాంటిది లివర్. ఏ ఫ్లాట్‌కి ఆ ఫ్లాట్‌కి డ్రైనేజ్, తాగు, వాడుక నీరు సరఫరా వేరుగా ఉంటుంది. అలాగే లివర్ కూడా. లివర్‌లో 1/3 వంతు ఉన్నా లివర్ చేసే పనులన్నీ చేయగలదు. పైన 4 లోబులని దానం చేస్తే అవతలి మనిషి బ్రతుకుతాడు. రెండు నెలల్లో ఇద్దరి లివర్లు పూర్తి స్థాయికి పెరుగుతాయి. చనిపోయేంతవరకు పెరిగే అవయవం లివర్ ఒక్కటే. లివర్ పెద్ద రసాయన కర్మాగారం. ఆ రసాయనాల్ని బయట తయారుచేయాలంటే ఫ్యాక్టరీని కొన్ని ఎకరాలలో పెట్టాలి. రక్తాన్ని శుద్ధిలో ఉంచే అవయవం- లివర్. అటువంటి లివర్ దెబ్బతింటే వేరేది పెట్టుకోవడం తప్పదు! ఇలా బ్రతికి ఉన్నవాళ్ళ దగ్గర్నుంచి లివర్ స్వీకరించడం ‘లివింగ్ డోనర్ డొనేషన్’ అంటారు.
‘కెడావరిక్ డొనేషన్స్’ సంఖ్య పెరిగితే, ‘లివింగ్ డోనర్ డొనేషన్స్’ తగ్గు తాయి. లివింగ్ డోనర్ డొనేషన్స్‌లో ఇద్దరికి, రెండు శస్త్ర చికిత్సలు జరగాలి. కెడావరిక్ డొనేషన్ అయితే జరిగేది ఒక్కటే శస్తచ్రికిత్స. రెండో వ్యక్తికి రిస్క్ ఉండదు.
ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎంతోమంది డాక్టర్లు ‘కాలేయ మార్పిడి’ని విజయవంతంగా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి శస్తచ్రికిత్సల కోసం హైదరాబాద్ దాటి వెళ్ళనక్కరలేదు.
ఒకప్పుడు ఇలాంటి పెద్ద శస్తచ్రికిత్సలకి విదేశాలకి వెళ్ళేవారు. ఇప్పుడు విదేశాలవాళ్ళు, ఈ పెద్ద కొత్త శస్తచ్రికిత్సలకోసం మన దేశానికి వస్తున్నారు. ఇది ‘రివర్స్ ట్రెండ్’. ఇక్కడ తక్కువ ఖరీదుతో చికిత్స జరుగుతుందని, అక్కడ చేసేది ఇక్కడివాళ్ళే, ఇప్పుడు వెనక్కి వచ్చేశారని, వాళ్ళ సామర్థ్యం, పెరిగిన టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో చికిత్సలు జరుగుతున్నాయని తెలిసి ఇక్కడికి జనం వస్తున్నారు. మెడికల్ టూరిజం పెరుగుతోంది. ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుంటేనే అవయవ దానంపై తగిన అవగాహన ఏర్పడుతుంది.

black teeth

నలుపుదనం.. పిప్పి పన్నుకు సంకేతం


మనం ప్రతిరోజూ ముఖం నోరు, దంతాలు, నాలుక శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఈ కార్యక్రమాలన్నీ కూడా దైనందిన జీవితంలో మామూలుగా భావించి చేస్తుంటారు. ఈ ప్రక్రియలో పళ్ళు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల పళ్ళు గారపట్టడం, పుచ్చిపోవడం, నోటిలో పుళ్లు ఏర్పడతాయి. అసలు నోటిని పరీక్షగా చూసుకునే అలవాటు చాలామందికి ఉండదు. కాని అద్దంలో నోటిని పరీక్షించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. పంటిమీద నల్లని మచ్చ ఏర్పడిందంటే పన్ను పుచ్చిపోవడానికి ప్రారంభదశలో ఉన్నదని గ్రహించాలి. ఆ తరువాత నల్లని మచ్చ రంధ్రంగా ఏర్పడుతుంది. పన్నుకు రంధ్రం పడితే మనకు ఇట్టే తెలుస్తుంది. ఎందుకంటే మనం చిన్న ఆహార పదార్థాలు ఆ పంటి రంధ్రంలో ఇరుక్కుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. నొప్పిగా కూడా ఉంటుంది. కూల్‌డ్రింక్స్, స్వీట్లు, పులుపు మొదలైన ఆహార పదార్థాలు తిన్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. ఈ పరిస్థితిలో వైద్య సహాయం పొందినట్లయితే, అంటే దంత వైద్యుని దగ్గరకు వెళ్లినట్లయితే ఆ పుచ్చిన పంటికి జింక్ ఆక్సైడ్ సిమెంట్‌గాని, సిల్వర్‌గాని నింపుతాడు. కాని ఏ విధమైన చికిత్స పొందనట్లయితే ఆ పన్ను బాగా పుచ్చిపోయి పంటిలో ఉన్న జీవనాడులు, రక్తనాళాలు బయటపడిపోయి బాక్టీరియా ప్రవేశించి, పంటిని నాశనం చేస్తుంది. ఈ పరిస్థితిలో కూడా విపరీతమైన నొప్పి కలుగుతుంది.
పంటినొప్పికి పెయిన్‌బామ్ వాడవచ్చా?
చాలామంది పంటినొప్పి వచ్చిందంటే ఏదో ఒక నొప్పిని తగ్గించే బామ్‌ని వాడతారు. వేడినీటితో లేక వేడి ఉప్పుతో కాపడం చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల పంటి దగ్గర దవడ ఎముక బాగా కమిలిపోయి ఇంకా ఎక్కువ నొప్పి రావడం జరుగుతుంది. తరువాత దవడ వాపు వచ్చి విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా పెయిన్‌బామ్‌ను వాడకూడదు. అలా వాడడంవల్ల దవడ భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీము తీసివేయడానికి దవడ దగ్గర రంధ్రం చేసి చీమును తొలగించాలి. లేకుంటే ఆ చీము గొంతులోని మాగ్జిలరీ సైనస్‌లోకిపోయి ఎంకా ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. కనుక పరిస్థితి విషమించకుండా చీముని తీసివేయవలసి ఉంటుంది.
అదేవిధంగా బాగా పుచ్చిపోయిన పంటి రూట్‌లో క్రిందగా దవడ ఎముక భాగంలో చీము ఏర్పడుతుంది. ఈ చీమును తీసివేయకుంటే దవడ బాగా వాచి అక్కడ చీము పేరుకుపోయి ఉంటుంది. దీనిని డెంటల్ ఏబ్బిస్ అంటారు. ఈ దశలో కూడా మనకు చాలా నొప్పి కలుగుతుంది. ఈ దవడ మీద ఉన్న చీమును తీసివేస్తే కాని వాపు తగ్గదు. కనుక దవడకు రంధ్రం చేసినట్లయితే చీమంతా బయటకు పోతుంది. ఆ తరువాత ఆ భాగంలో ఒక మచ్చ ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా దంతవైద్యుడిని సంప్రదించినట్లయితే పన్ను పీకవలసిన పనిలేదు. ఆ పంటికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేసి చికిత్స చేసి పంటిని కాపాడుకోవచ్చు.
పన్ను తీసివేస్తే కన్ను పోతుందా?
పన్ను పీకించుకోవడంవల్ల ఏ విధమైన ప్రమాదం లేదు. చాలామంది పన్ను పీకించుకుంటే కంటిచూపు తగ్గడం, కొంతమంది కళ్లు పోతాయి అనే మూఢ నమ్మకాలు ఉన్నాయి. కాని పన్నుకు కన్నుకు ఎటువంటి సంబంధం లేదు. పన్ను పీకించుకోవడంవల్ల ఎట్టి పరిస్థితుల్లోను కంటికి ఎలాంటి హాని జరగదు.
పుచ్చిన పంటిలో పురుగులుంటాయా?
పళ్లను మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంవల్ల బాక్టీరియా అంటే రోగపూరిత సూక్ష్మజీవులు ఇవి మన కంటికి కనిపించవు. బాక్టీరియాను మైక్రోస్కోప్‌తోనే చూడవలసి ఉంటుంది. కనుక పంటిలో ఏ విధమైన పురుగులు, కీటకాలు ఉండవు. కొంతమంది మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి పురుగు తీయించుకోవడం చేస్తారు. కొంతమంది చెవిలో పసర్లు వేసి నోటిలోనుండి పురుగులు పడడం, మరి కొంతమంది నోటిలో పసరు వేసి పుక్కిలించడంవల్ల పుచ్చిన పంటిలో ఉన్న పురుగులు పడిపోయి, ఆ తరవాత పంటి నొప్పి ఉండదు అని చెబుతుంటారు. ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలే తప్ప మరేమీ కాదు.