Saturday 30 August 2014

hair problems


ఉద్యోగులకు ‘యాంటీసె్ట్రస్‌?
ఆఫీసు పని ముగించుకుని బయటపడ్డాక కూడా ఆఫీసు నుంచి ఫోన్లు, ఇ-మెయిల్స్‌ వస్తున్నాయా? వాటి నుంచి బయటపడలేక, వ్యక్తిగత సమయాన్ని వదులుకోలేక విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారా? మిగతా దేశాల్లో సంగతేమో కాని జర్మనీలో అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగుల్ని బయటపడేసేందుకు ‘‘యాంటీస్ర్టెస్‌’’ చట్టాన్ని అమలుచేసే యోచనలో ఉందక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి కంపెనీల్లో కొన్ని దీన్నో పాలసీగా అమలుచేస్తున్నాయి కూడా.
ఇంతకీ ఈ యాంటీస్ర్టెస్‌ చట్టం ఏం చెప్తుందంటే.... కార్యాలయాల్లో పనిగంటలు ముగించుకుని బయటపడ్డాక కూడా పనికి సంబంధించిన ఫోన్లు లేదా మెయిల్స్‌ ద్వారా సదరు ఉద్యోగిని ఇబ్బంది పెట్టకూడదు. పనివేళలు ముగిశాక కూడా ఆఫీసు పని మీ వెంటపడడానికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్లు. వీటి పుణ్యాన ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటారు. దాంతో పనివేళలు పూర్తయ్యాక కూడా కంపెనీలు మెయిల్‌ పంపడమో, ఫోన్‌ చేయడమో చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు 24గంటలు ఆఫీసు పనిచేస్తున్నట్టే భావిస్తున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. ఇది అటు కంపెనీకి, ఇటు ఉద్యోగికి ఇద్దరికీ మంచిది కాదని జర్మనీ ప్రభుత్వం యాంటీస్ర్టెస్‌ చట్టం ఏర్పాటుచేస్తామంటోంది. ఇదిలా ఉంటే యుకెలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ పనివేళలు ముగిశాక కూడా ఉద్యోగులకు ఆఫీసు వ్యవహారాలకి సంబంధించిన ఇ-మెయిల్స్‌ వెళ్తూనే ఉంటాయి. మెయిల్స్‌ వస్తే రానివ్వండి మీరు మాత్రం సాయంత్రాలు, వారాంతాలు వాటికి దూరంగా ఉండడమే బెటర్‌ అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకాదు మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే కనుక ఈ విషయాలు ఆచరించండని కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. ఆఫీసు పనివేళలు పూర్తయ్యాక ఆఫీసు వ్యవహారాల గురించి ఇ-మెయిల్‌ చేయొద్దని సహోద్యోగులకు, కంపెనీ వారికి చెప్పండి. ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్లకు దూరంగా ఉండండి. ఆఫీసు వర్క్‌ ఇ-మెయిల్స్‌ కోసం వేరే మెయిల్‌ ఐడి ఏర్పాటుచేసుకోండి. మొత్తంమీద చెప్పొచ్చేదేమిటంటే పనివేళలు పూర్తయ్యాక ఆఫీసు పనిని పార్సిల్‌ కట్టి పక్కన పడేయండి.
చిన్నారులను ఆడించడం ఎలా?
తొలిసారి గర్భం ధరించిన మహిళలు తమకు పుట్టబోయే పిల్లలను ఎలా చూసుకోవాలి, ఎలా ఆడించాలనే విషయాలు బిడ్డ పుట్టకముందరే నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భార్యాభర్తలిరువురూ ఉద్యోగాలు చేస్తుండడంతో కో-పేరెంటింగ్‌ పట్ల జంటలు ఆసక్తి చూపుతున్నారు. బొమ్మలను తమ పిల్లగా భావించుకుని వాటితో మాట్లాడడం, ఆడడం వంటివి సాధన చేస్తున్నారు. ఇలాంటి 182 జంటలను ఓహియో యూనివర్సిటీ అఽధ్యయనకారులు పరీక్షించారు. బొమ్మతో వారు సంభాషిస్తున్న తీరు, చూపుతున్న శ్రద,్ధ ఆ బొమ్మలతో వాళ్లు ఆడుతున్న తీరుని వీడియోలో రికార్డు చేశారు. వారు సాధన చేసినట్టుగానే పిల్లలు పుట్టిన తర్వాత తమ చిన్నారులను వారు చూడగలుగుతున్నారు. బొమ్మలతో ఆడుకున్నట్టు, మాట్లాడినట్టుగానే పుట్టిన తమ చిన్నారులతో కూడా ఈ జంటలు వ్యవహరిస్తున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు.
పరగడుపున పొట్టను శుభ్రపర్చడం ఎలా?
నిద్ర లేచిన దగ్గర నుంచి టిఫిన్‌ తినే ముందు వరకు ఉన్న సమయాన్ని పరగడుపు సమయం అంటారు. ఈ సమయంలో 2 నుంచి 3 లీటర్ల వరకు నీటిని తాగవచ్చు. ఎవరి స్థితిని బట్టి వారు ఇబ్బంది పడకుండా తాగండి. ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగవద్దు. రాగి పాత్ర ఉన్నవారు రాత్రి అందులో నీరు పోసి ఉదయాన్నే తాగడం శ్రేష్ఠం. కడుపులో మంటలు, పేగుపూత లేదా అల్సర్‌, ఆస్తమా, దగ్గు లేదా కఫం, ముక్కురొంప, ఇస్నోఫిలియా మొదలగు ఇబ్బందులున్న వారు 5 లీటర్ల నీటిని తాగబోయేముందు గోరువెచ్చగా చేసుకుని తాగడం మంచిది. ఇలా సమస్యలు తగ్గేవరకూ చేయాలి.

మొదటి దఫా నీరు 

నిద్ర లేచిన వెంటనే అవసరమైతే మూత్రానికి వెళ్లివచ్చి, నోరు వాసనగా ఉంటే పుక్కిలించి ఊసి నీటిని తాగడం ప్రారంభించండి. సీసాతో గానీ చెంబుతో గానీ నిండుగా తీసుకొని ఎత్తి పట్టుకొని తాగడానికి ప్రయత్నించండి. ఒక్క బిగువన ఎంత వరకు ఇబ్బంది లేకుండా తాగగలిగితే అంత నీరు తాగండి. లీటరు కంటే తక్కువగా నీరు తాగిన వారు 4, 5 నిమిషాలు విశ్రాంతి ఇచ్చి మిగతా నీటిని తాగే ప్రయత్నం చేయవచ్చు. మరీ కష్టంగా ఉంటే మళ్లీ 2, 3 నిమిషాలు ఆగి తాగవచ్చు. మొత్తంమీద ఒక్కసారిగా గానీ, 2, 3 సార్లుగా గానీ 5, 6 నిముషాల వ్యత్యాసంలో లీటరు నుంచి లీటరున్నర వరకు మీ ఓపికను బట్టి (లీటరుంపావు-మధ్యస్తంగా అందరికీ బాగుంటుంది) నీటిని తాగండి. కొత్తలో కొన్ని రోజులు వికారంగా ఉండడం గానీ, తిప్పడం గానీ, వాంతులు కావడం గానీ జరగవచ్చు. అయినా ఏమీ కాదు. అలాంటి వారు కొద్దిగా నీటిని తగ్గించి తాగడం మంచిది. ఇలా నీటిని తాగాక మీరు టీవీ చూసినా, కబుర్లు చెప్పుకున్నా, పేపరు చదువుతున్నా, పనిలో పడినా మీకు విరేచనం సాఫీగా కాదు. విరేచనం లేచిన వెంటనే జాడించి వెళ్లాలంటే నేను చెప్పినట్లు చేస్తే తేలిగ్గా పనవుతుంది. నీళ్లను తాగాక మీ మనసును, ఆలోచనలను పొట్ట, పేగులపై (బొడ్డు కిందిభాగం) పెట్టి 5, 10 నిముషాల అటూ ఇటూ నడుస్తూ పరిశీలించండి. మీరు తాగిన ఎక్కువ నీటి బరువు మీ మలం పేగుపై పడి మలాన్ని ముందుకు గెంటుతూ ఉంటుంది. వేరే ఆలోచనలు మీరు చేయకపోతే మలం పేగుకు ఉండే నరాలు బాగా రిలాక్సయ్యి ఎక్కువ మలం జరిగి ముందుకు వస్తుంది. నీళ్లు తాగాక పేగులపై మనసు లగ్నం చేయడమనేది సుఖ విరేచనానికి అతి ముఖ్యమైన రహస్యం. బాగా అర్జంట్‌ అయ్యేవరకు బయటే తిరగండి. ఇక ఆపుకోలేకుండా వచ్చేస్తున్నదీ అన్నపుడు దొడ్లోకి వెళితే, ఒకే ఇన్‌స్టాల్‌మెంటులో ముక్కకుండా తేలిగ్గా పడిపోతుంది. మీకు హమ్మయ్య ! అనిపిస్తుంది. ఇలా మొదటి విరేచనం అయితే మీరు నిన్న మధ్నాహ్నం తిన్న భోజనం తాలూకు మల పదార్థం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మీరు తాగిన నీరు పొట్ట, పేగుల నుంచి 15, 20 నిముషాల్లో రక్తంలోనికి వెళ్లి, అక్కడ నుంచి కణాలలోనికి వెళ్లి కాలుష్యాన్నంతా నానబెడుతుంది. నీళ్లను తాగిన 20 నిమిషాల తర్వాత ఏదన్నా పని చేసుకోవచ్చు లేదా వ్యాయామాలు చేయడం ప్రారంభించవచ్చు. మొదటిసారి నీరు తాగి విరేచనం అయ్యాక ఎవరన్నా వ్యాయామం చేసినా లేదా రెక్కలు కదిలే పనులు చేసుకున్నా ప్రాణవాయువు లోపలకు బాగా వెళ్లి లోపల ఉన్న చెడు బాగా దహనం చెంది, అదంతా బాగా నీటిలో కరుగుతూ ఉంటుంది.

రెండవ దఫా నీరు 

మొదటిసారి లీటరు నీటిని మాత్రమే తాగిన వారు గంట విరామం తర్వాత రెండవ దఫా నీరు తాగవచ్చు. మొదటిసారి లీటరుంపావు తాగిన వారు గంటంపావు గ్యాప్‌, లీటరున్నర తాగిన వారు గంటన్నర గ్యాప్‌ ఇవ్వడం మంచిది. ఇలా తాగితే శరీరానికి ఇబ్బంది ఉండదు. కొంతమంది టైమ్‌ లేక తొందరగా రెండవసారి నీరు తాగేసరికి ముఖం ఉబ్బడం, తల డిమ్‌ అవ్వడం, కళ్లు తిరగడం జరుగుతాయి. అలా ఎవరూ చేయకండి. నీటిని మళ్లీ ముందులా బాటిల్‌లో గానీ చెంబులో గానీ తీసుకొని లీటరు నుంచి లీటరుంపావు వరకు 5, 6 నిమిషాల గ్యాప్‌లో తాగడానికి ప్రయత్నించండి. అలా నీటిని తాగాక మనసును పేగులపై పెట్టి అటూ, ఇటూ నడుస్తూ రెండవ విరేచనం అవ్వడానికి ప్రయత్నించండి. మొదటిసారే చాలా వెళ్లిపోయింది, ఇంకా ఏముంటుంది అని అనిపించవచ్చు లేదా ఒకసారి వెళితే రోజుకు సరిపడా అనుకోవచ్చు. ఇది పొరపాట. మన విరేచనం పేగు మీటరున్నర పొడవు ఉంటుంది. మొదటిసారి వచ్చిన విరేచనం అర మీటరు భాగం పేగులోనిదై ఉంటుంది. మిగతా పేగులోని బోలెడు మలమంతా మొదటి విరేచనం అయిన అరగంటలోనే మలద్వారం వద్దకు జరిగి విసర్జనకు రెడీగా ఉంటుంది. మీరు నేను చెప్పినట్లు ప్రయత్నం చేయండి. అర్జెంట్‌ అనిపించే వరకూ బయటే తిరగండి. అప్పుడు వెళ్లండి. రెండవ విరేచనం ఇంకా సాఫీగా, కాస్త పలుచగా, మరికొందరికి నీళ్లలా వచ్చేస్తుంది. నీళ్లుగా రెండవ విరేచనం అయినా కంగారు పడనవసరం లేదు. మనం తాగిన నీళ్లే కొన్ని అలా వచ్చి పేగుల్ని క్లీన్‌ చేస్తున్నాయి. రెండవ విరేచనంలో వచ్చే మల పదార్థం నిన్న సాయంకాలం తిన్న టిఫిన్‌ తాలూకు, రాత్రి తిన్న భోజనం తాలూకు పదార్ధమై ఉంటుంది. ఇలా రెండు విడతలా విరేచనం అయితే మీ పేగు మొత్తం పూర్తిగా పరిశుభ్రం అయినట్లుగా భావించండి. కొంతమందికి రెండవసారి విరేచనం అవ్వదు. కంగారు వద్దు. నిదానంగా దారిలో పడుతుంది. మీరు తాగిన రెండవ దఫా నీరు 15, 20 నిముషాల్లో మీ రక్తంలోనికెళ్లి ఇంతకు ముందు నానిన కాలుష్యాన్ని, రక్తంలోని దోషాలను పట్టుకొని అటు చెమట గుండా, ఇటు మూత్రం గుండా బయటకు లాక్కొచ్చేస్తుంది. ఇలా రెండు దఫాలుగా మీరు తాగిన నీరు మీలోని 5 లీటర్ల రక్తాన్ని, 70 శాతం నీటిని, కోటానుకోట్ల జీవకణాలను స్నానం చేయిస్తుది. ఇన్నాళ్ళూ మనకు పైకి స్నానం చేయడమే తెలిసింది గానీ లోపలకు స్నానం చేయడం ఇప్పుడు తెలుసుకున్నారు. మన శరీరం తనలో ఉన్న కాలుష్యాన్ని తెల్లవారుజాము సమయం నుంచి టిఫిన్‌ తినే ముందు వరకూ బయటకు గెంటుకునే ప్రయత్నంలో ఉంటుంది. కాబట్టి మనం పరగడుపున నీటిని తాగి శరీరానికి భారాన్ని తగ్గించిన వారమయ్యాం. ఇలా ప్రతిరోజూ మనం శరీరానికి అవసరమైన నీటినిచ్చి ఆరోగ్యాన్ని పుచ్చుకుందాం. మొదటి, రెండవ దఫాలలో నీటిని బాగా తక్కువ తాగిన వారు మూడవ దఫాగా ఇంకొంచెం తాగవచ్చు. అలవాటులో నీటిని రెండు దఫాలుగా ముగించి వేయడం మంచిది. ప్రయాణాల్లో లేదా ఎప్పుడన్నా కుదరనప్పుడు కాస్త సడలించుకోండి.

నీ జతగా.. నేనుండాలి --- Movie review


' ఫీల్ ' లేని రీమేక్!

  • 29/08/2014
  •  | 
  • -ఆశ్రీత్
** నీ జతగా.. నేనుండాలి (ఫర్వాలేదు)
తారాగణం:
సచిన్ జోషి, నజియా హుస్సేన్
రావు రమేష్, శశాంక్ తదితరులు
సంగీతం: జీత్ గంగూలీ
మిథున్, అంకిత్ అంకుర్
మాటలు: మధుసూదన్
కథ, స్క్రీన్‌ప్లే: షాగుఫ్తా రఫీక్
పాటలు: చంద్రబోస్
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: జయ రవీంద్ర
ఆషికీ-2 సినిమా చూశారా? ఐతే అర్జంట్‌గా- ఆ సినిమా తాలూకు అనుభూతుల్ని ‘మైండ్’లోంచి తుడిచేయండి. లేకుంటే- మీరు ఏ చిత్ర రాజాన్ని తిలకిస్తున్నారో మీకే అర్థం కాదు కాబట్టి. థియేటర్ ముందు పోస్టర్ చూసి- ‘నీ జతగా...’ నేనుంటాలె అని భ్రమించి వెళ్తే మాత్రం అంతా శూన్యమే. ‘నేనుండను’ అన్నా వదిలిపెట్టరు. ఈ సినిమా ఆరంభించింది మొదలు.. ప్రేక్షకుణ్ణి ఓ సందేహం వెంటాడుతూండాలి. ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారంటే ఈ చిత్ర ఛాయల్ని నామమాత్రంగానైనా చూపెట్టగలగాలి. లేకుంటే - ‘్ఫల్’ ఉండదు. ఆషికీ-2 కథలో ఎటువంటి ప్రత్యేకతలూ లేకున్నప్పటికీ - నటీనటుల హావభావాలతో ఆద్యంతం రక్తి కట్టించి.. సగటు ప్రేక్షకుణ్ణి కట్టి పడేసింది. అంతకు మించిన బ్రహ్మాండమేదైనా జరిగితే తప్ప.. ఆ అనుభూతిని కళ్ల ముందు ఉంచటం కష్టం. ఇన్ని తెలిసీ - మాతృక నుంచీ స్క్రీన్‌ప్లేని సైతం యధేచ్ఛగా వాడేసిన ఈ సినిమా మీ ‘జత’ కట్టిందా? లేదా? అన్నది చూద్దాం.
తన గాత్రంతో జనాన్ని ఉర్రూత లూగించే రాఘవ జయరామ్.. ఉరఫ్ ఆర్జే (సచిన్) ఏ పాటనైనా అవలీలగా పాడేసి - శ్రోతల మదిలో పదేపదే ‘రింగ్ టోన్’లా మారతాడు. ఐతే- అతడికి ఉన్న ఒకే ఒక్క బలహీనత - తాగుడు. దానికి బానిస. రికార్డింగ్ ఏ అర్ధరాత్రో అపరాత్రో అయినా- మందు కోసం కిలోమీటర్ల కొద్దీ వెళ్లటం అతనికి అలవాటు. దీంతో కెరీర్ కుంటు పడే పరిస్థితికి వస్తుంది. అతడి ఫ్రెండ్ ఎంత చెప్పినా పట్టించుకోడు. ఒకానొక సందర్భంలో ఆర్జేకి గాయత్రి నందన (నజియా) ఒక సాదాసీదా బార్‌లో పాట పాడుతూ కనిపిస్తుంది. ఆమె పాట అతణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. అది తన పాటే. తను పాడిందాని కంటే మరింత మధురంగా ఆలపించటంతో తొలిచూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. సినీ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడితో పరిచయాల్తో - ఆమెని మేటి గాయనిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. యాదృచ్ఛికంగా నందన కూడా ఆర్జే ప్రేమలో పడుతుంది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకొంటారు. నందన సంగీత ప్రపంచంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంది. ఆర్జే తన తాగుడిని వదిలిపెట్టడు. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఆర్జేని ఎంతగానో ప్రేమించిన నందన అతణ్ణి ఆ ఊబి నుంచీ బయటికి తెచ్చేందుకు కెరీర్‌ని కూడా వదలుకోటానికి సిద్ధపడుతుంది. తన కారణంగానే నందన ఉజ్జ్వల భవిష్యత్‌ని నాశనం చేసుకుంటుందని భావించిన ఆర్జే చివరికి ఏం చేశాడు? ఆమె నుంచీ దూరంగా వెళ్లిపోయాడా? ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
ఆషికీ-2 ఏమంత గొప్ప సినిమా కాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ - ఆ సినిమాలో శ్రద్ధాకపూర్ హావభావాలూ - చూపులు ఇప్పటికీ జనాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సినిమాని సినిమా చూళ్లేదు. ఒక జీవితాన్ని చూశారు. ఆ భావాల తాలూకు నీడలు మనసులో ముద్రవేశాయి. అందుకు తగ్గట్టే- ఆడియో హృదయంలో వీణియల్ని మోగించింది. కాబట్టే- ఒక సాదాసీదా కథ సైతం... సూపర్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది. ఇదీ ఆ చిత్ర విశేషం. మరి ఇన్ని వివరాలు తెలిసిన దర్శకుడు ఆ కథని ఏ విధంగా మలిస్తే - ప్రేక్షకుల్ని తమవైపు తిప్పుకోగలం అని ఆలోచించలేదు. అసలు ఆ ఆలోచనే పెట్టుకోలేదు. రీమేక్ అంటే అక్కడి స్క్రీన్‌ప్లేని ఇక్కడికి తెచ్చుకోవటం అన్న ఒక్క పని మాత్రం చేశాడు. స్క్రీన్‌ప్లే ఏది చెప్తే అది చేసేశాడు. ఎక్కడ కెమెరా అక్కడే అన్నట్టు. దాంతో - ఏ సినిమా చూస్తున్నాం అన్న సందేహం వస్తుంది. కానీ - ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పోనీ- హీరో హీరోయిన్లైనా ‘ఆషికీ-2’ చూశారా? అంటే అదీ అనుమానమే. చూస్తే సరిపోదు.. ఆయా పాత్రల నైజాన్ని మనసులో జీర్ణించుకోవాలి. అదీ చేసినట్టు కనిపించదు. ఆషికీ-2లో ప్లస్ పాయింట్ల నన్నింటినీ - ఏటి వదిలేసి.. స్క్రీన్‌ప్లే అన్న మహదాయుధంతో ‘ప్రేమ’ యుద్ధానికి బయల్దేరారు. అక్కడా బోర్లా పడ్డారు.
లవ్‌స్టోరీకి ఆయువుపట్టు - హీరోహీరోయిన్లు అన్నది తెలిసిందే. వారిద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ పుట్టకపోతే - రొమాన్స్ పండదు. ఆ విషయం తెలిసీ - అతి పేలవమైన నటనతో ప్రేక్షకుల్ని చిత్ర హింసలకు గురి చేస్తారు. ‘వౌనమేలనోయి’ సినిమాతో పది-పనె్నండేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సచిన్ జోషి - కొన్నాళ్లు ఒకటీ రెండు సినిమాలు చేసి - మళ్లీ ఇలా ప్రత్యక్షమయ్యాడు.
ఇతగాడి నటనలో ఎంపిక పెట్టాల్సిందేం లేదు. ఎందుకంటే- ఏ భావమైనా ఒకేలా పలుకుతుంది. కాబట్టి- మనకి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అంతేగానీ - నవరస భావాల్ని పలికించటం అతడికి తెలీదు. పాఠాలు చెప్పినా వేస్ట్. మద్యానికి బానిసై కెరీర్‌ని నాశనం చేసుకునే బరువైన కేరెక్టర్‌ని ఇతగాడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు. దాంతో కేరెక్టర్ తేలిపోయింది. నజియా ఫర్వాలేదనిపిస్తుంది. కానీ- ఇటువంటి కథలకు గ్లామర్‌తోపాటు - సరైన భావాల్ని పలికించ గలగాలి. అంటే ఏమిటని అడిగినా అడగొచ్చు కాబట్టి- దీనికీ అడ్జస్ట్ అయిపోవటమే. రావు రమేష్, శశాంక్ తమ పని తాము చేసుకుపోయారు.
ఫొటోగ్రఫీ కొంతలో కొంత నయం. బాలీవుడ్ ట్యూన్స్‌ని యధాతథంగా దింపేశారు గానీ - సాహిత్యం ఏదో తెచ్చి పెట్టుకొన్నట్టుగా ఉంది. కుదర్లేదు. ఇక ఏ శాఖ గురించీ ప్రస్తావించనక్కర్లేదు.
పూరీ శిష్య బృందంలో ఒకడైన జయ రవీంద్ర ఈ సినిమాకి ఏ మాత్రం కష్టపడలేదనిపిస్తుంది. యధా స్క్రీన్‌ప్లే - తథా జయ.


కలుపుగోలు (కథ )

  • - చింతల ఉదయసాయికుమార్
  •  
  • 03/08/2014
నా బాల్య మిత్రుడు రెడ్డి నాకు చిన్ననాటినుండి ఆత్మీయుడు. అతనంటే నాకు ప్రాణం. మేమిద్దరం కలిసి నాలుగైదేళ్ళయింది. ఉద్యోగాల వల్ల మేమిద్దరం చెరో ఊర్లో వుంటున్నాం. మిత్రుడైన రెడ్డిని రమ్మని నేనే ఫోన్ చేశాను. ఎవరి బతుకు పనుల్లో వారు చేరిపోవడం వల్ల మా ఇద్దరి మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో మందగించాయి. కులాసాగా మాట్లాడుకుందామని నేను ఫోన్ చేశాను. అతనంటే నాకు ఎందుకో ప్రత్యేక అభిమానం. చాలా రోజుల తర్వాత మిత్రుడి ఆత్మీయతలు గుర్తురాసాగాయి. అందువల్లే రమ్మని ఆహ్వానించాను. రెడ్డి చక్కటి రచయిత. కవిత్వం, కథలు రాయడంతోపాటు, వ్యాసాలు రాసి వివిధ పత్రికలకు పంపిస్తుంటాడు. కొత్త పుస్తకాలు కొంటుంటాడు. రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని నేను కథావ్యాసంగాన్ని చేబట్టి రచయితగా రాణించాలని నాకు తహతహలాడేవాడిని. రెడ్డి ఎప్పుడూ ఫోన్ చేసి పలకరించినా, కథల గురించి, కవిత్వం గురించి చాలా వివరంగా చెబుతాడు. కథ ఎలా రాయాలో తగిన సూచనలు ఇస్తుంటాడు. రచయితగా ఎదగడం వల్ల విశాలత్వం పెరిగి, ఇంటా బయటా బాధ్యతలు తెలిసి వస్తాయని రెడ్డి అంటుండేవాడు. రెడ్డి రచనలు ఇటీవలి కాలం నుండి చిన్నపత్రికలతోపాటు, అప్పుడప్పుడు పెద్ద పత్రికల్లో ప్రచురితమవుతున్నాయ. చాన్నాళ్ళనుండి నాకు కూడా పుస్తకాలు, సాహిత్యాధ్యయనం వుంది. కవితలు, కథలు చదవడంతో పాటు వాటి రచనా తీరును పరిశీలిస్తుండేవాడిని. రెడ్డి తన రచనా వ్యాసాంగంలో కథారచన గూర్చే ఎక్కువగా వివరిస్తుండేవాడు. పత్రికల్లో ఇతరులు రాసిన ఏవేని మంచి కథలు అచ్చయినపుడల్లా ఫోన్ చేసి మరీ చెబుతాడు. వాటిని చదవటంతో పాటు శైలి పరిశీలించమని అంటుండేవాడు. నేను నా ఆఫీసు, ఇతర పనుల బిజీ వల్ల చదవడం నాకు కుదరనప్పటికీ, చదివాను బాగుందని, అబద్ధాలు సైతం చెప్పేవాడ్ని. నా అసమర్థతను, బద్ధకాన్ని అలా కప్పిపుచ్చుకునేవాడ్ని. రెడ్డి అంతరంగానికి కాస్తోకూస్తో అర్థమైనా, కథారచన చేబట్టమని బలవంతం చేసేవాడు. కథారచనలో వివిధ పాత్రల చిత్రణ, కథలోని భాష, శైలీ, శిల్పం, ముగింపు ఎలా వుండాలో విశదీకరిస్తూ చర్చ జరిపేవాడు. ఇదంతా ఇప్పటిదాకా ఫోన్‌లోనే జరిగేది. సాహిత్యం పట్ల రెడ్డికున్న శ్రద్ధాసక్తులకి నేను అబ్బురపడేవాడ్ని. వారానికి రెండుసార్లయినా ఫోన్ చేసి చెప్పేవాడు. రెడ్డి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నట్లనిపించింది. రెడ్డి నిరంతర ప్రేరణ వల్ల నాకు కథలు రాయాలన్న తలంపు కలిగింది. రెడ్డిలా రాయకున్నా, కాస్తోకూస్తో కథారచన చేబట్టాలన్న ఆసక్తి నాలో బలపడింది. ఓ రెండు కథలు రాసి, టైపుచేయించి, రెడ్డి చెప్పినట్లుగా పత్రికలకు కొరియర్‌ద్వారా పంపాను. చిత్రంగా రెండు కథలూ ఓకే అయ్యాయ. ఓ కథను సవరించి పంపమన్నారు. మరో కథ మాత్రం ప్రచురణకు అర్హమైనట్లుగా తెలిపి, ఒక నెల వ్యవధిలో మరో కథను ప్రచురించారు. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. నోబెల్ బహుమతి వచ్చినట్లుగా ఫీలయ్యాను. నేను నా కలంతో తెల్లకాగితంపై పేర్చిన అక్షరాల్ని అచ్చులోకి చూసుకుని తెగమురిసి పోయాను. నా మిత్రుల నుండి అభినందనలు అందాయి, అందుతున్నాయి. ఎంతో సంతోషపడ్డ నేను, ఈ శుభవార్తని రెడ్డికి తెలియపరిచాను. రెడ్డి కూడా ఆనందించాడు. కథ బాగుందని, శైలిని, చక్కని ముగింపును జోడిస్తే మంచి కథా రచయితవవుతావని కితాబునిచ్చాడు. రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహం నన్ను కదిలించింది. నాలోని సోమరితనాన్ని కుదిపేసింది. రెడ్డి చెప్పినట్లుగానే కథలు రాస్తుండేవాడిని. రెడ్డి రాక కోసం ఎదురుచూస్తున్న నాకు, ఓ రోజు కరీంనగర్ వస్తున్నానని చెప్పిన తర్వాత నాకు కలిగిన ఆనందం అంతా ఇంతాకాదు. రెడ్డి రాక నాకు నవ వసంతంలా అనిపించింది. ఉగాది పండుగ జరుపుకునేంత సంబురమైంది. రెడ్డిని ఆనందంగా రిసీవ్ చేసుకున్నాను. అతనున్న రెండు రోజుల్లో మా ఇరుగు పొరుగువారితో ఆత్మీయుడిగా కలిసిపోయాడు. నా ఆఫీస్‌కి సెలవుపెట్టి రెడ్డితో జల్సాగా, ఖుషీగా కరీంనగర్ అంతా తిరిగాను. సాహిత్య విషయాలపై, పత్రికల ధోరణిపై విపులంగా చర్చించుకున్నాం. తను సైతం చాన్నాళ్ళకు కలుసుకున్నందులకు తబ్బిబ్బయిపోయాడు. నా సహచర్యంలో, నా పరిసరాల్ని,వ్యక్తుల్ని తనే స్వయంగా పరిచయం చేసుకుని అందరితో హృదయపూర్వకంగా మాట్లాడాడు, రెడ్డి. గమ్మత్తయిన విషయం ఏమిటంటే నా చుట్టుపక్కల వారితో ఇంతకాలంగా మొక్కుబడిగా మాట్లాడుకోవడమే కాని, రెడ్డి వెళ్ళినంత లోతుగా, పూర్వాపరాల్లోకి వెళ్ళి నేను ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడలేదు. అలాంటి వ్యక్తులతో మమైకమై సరదాగా సంభాషించాడు, రెడ్డి. అది ఆయనలో వున్న కలుపుగోరుతనమని, రచయితగా మారాక రెడ్డి లో వచ్చిన మార్పు నన్ను ఆశ్చర్యపరచింది. రెండురోజులు హాయిగా అందరితో సఖ్యంగా వుండి, సరదాగా గడిపేసి వెళ్ళిపోయాడు,రెడ్డి. రెడ్డి వెళ్ళాక నాకు ఎందుకో ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. నెలరోజుల తర్వాత రెడ్డి నాకు ఫోన్ చేసి, ఫలానా పత్రికలో ‘కలుపుగోలుతనం’ అనే కథ అచ్చయిందని, చదివి అభిప్రాయం చెప్పమన్నాడు. ఆ కథ సాంతం చదివి ఆశ్చర్యపోయాను. అది నన్ను కేంద్రంగా చేసుకుని రాసిందని, మా ఇరుగుపొరుగు సఖ్యత గూర్చి రాసిందని అర్థమయ్యింది. కాకపోతే మనుషుల మధ్య యాంత్రిక జీవితం అనుభవిస్తున్న నేను జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, ఇన్నాళ్ళు లేమిగా వున్న నాకు కలుపుగోలుతనం ఆవశ్యకత తెలిసివచ్చింది. దాని ప్రాధాన్యతను నేను గుర్తించాను. ఇరుగుపొరుగుతో ఆత్మీయంగా కలుపుగోలుగా వుండాలని, రెడ్డి నాలోమార్పురావడానికే ఇలా రాసి వుంటాడని భావించాను. నాలోని ఒంటరితనాన్ని దూరం చేయడానికి, సఖ్యతను పెంచడానికి నన్ను ఇతివృత్తంగా తీసుకుని రాసిన కథ నాకు ఎంతగానో నచ్చింది. ముఖాముఖిగా చెప్పకుండా, కథ రూపంలో చెప్పి నాకూ, నాలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మనస్సులోనే రెడ్డికి కృతజ్ఞత చెప్పుకున్నాను. అంతేకాదు, నేను కలుపుగోలుతనాన్ని అలవరుచుకోవడమే అసలైన కృతజ్ఞత అని కూడా నిర్ణయంచుకున్నాను.
- చింతల ఉదయసాయికుమార్

తెలిసిన నిజం(కథ)

  • - పైడిమర్రి రామకృష్ణ, సెల్ నెం: 9247564699
  •  
  • 10/08/2014
ఉదయం పదిగంటలు అయింది. చల్లటి గాలి వీస్తోంది. గాలి వీచినప్పుడల్లా పూలపరిమళం గాలితోపాటు తేలివస్తోంది. మామిడి చెట్టుమీద కోయిల కూస్తోంది. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో పుస్తకం చదువుకుంటూ కూర్చోవటం చాలా ఇష్టం నాకు. అందుకే బస్సులు, ఆటోలు, ఇతరత్రా వాహనాల రణగొణధ్వనులకు దూరంగా ఊరిచివర ఇల్లు కట్టుకున్నాను. వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎదురిళ్లలోని పచ్చటి చెట్లు కంటికింపుగా కనిపిస్తూ ఉంటాయి.
ఆరోజు కూడా వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉన్నాను.
‘ఏమండోయ్! నేను మహిళా మండలికి వెళుతున్నాను. ఇల్లు జాగ్రత్త!’ అంటూ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని జడలోని పూలదండ సరిచేసుకుంటూ ఇంట్లో నుంచి వచ్చింది నా శ్రీమతి మాధవి.
చదువుకుంటున్న నన్ను చూడగానే ‘అబ్బబ్బ! పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారూ! నేను అనుకుంటూనే ఉన్నాను. ఈరోజు ఆదివారం కదా! ఒక సరదా లేదు, ఏం లేదు. ఎప్పుడూ చదువుకుంటూ కూర్చుంటారు. ఏముందండీ ఆ రామాయణంలో, భారతంలో! శూర్పణఖ రాముడిని ప్రేమించింది. ఇష్టం లేకపోతే లేదని చెప్పవచ్చుగా! బంగారం లాంటి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. కృష్ణుడు మాత్రం? ‘ఏదో పసిపిల్లాడు కదా! పాలిద్దాం’ అని వచ్చింది పూతన. ఆమె ప్రాణాలు తీసేశాడు. మాతృత్వంలోని మాధుర్యం గురించి మీ మగవాళ్లకి ఏం తెలుసండీ! స్ర్తిలు అందరూ దుర్మార్గులూ, స్ర్తిలను హింసించే వాళ్లందరూ దేవుళ్లూనా? ఛీ!్ఛ! అశ్లీల సాహిత్యాన్ని నిషేధించినట్లు ఈ పురాణాలని కూడా నిషేధిస్తే కానీ జనం బాగుపడరు. ఈరోజు మహిళా మండలిలో నేను ఉపన్యసించబోయే అంశం కూడా ఇదే!’ అన్నది.
‘సరేలే! నీకు ఆలస్యం అవుతుంది, వెళ్లు వెళ్లు!’అన్నాను.
మాధవి వరండా మెట్లు దిగి నాలుగు అడుగులు వేసింది. అక్కడ కుండీలో సన్నజాజి మొక్కను చూస్తూ ‘ఏమండీ! మొన్న మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న సన్నజాజి మొక్క అప్పుడే ఎంత పెద్దదయిందో చూశారా! బుజ్జిబుజ్జి మొగ్గలు కూడా వేస్తోంది పిచ్చిముండ! సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో!’ అని మురిపెంగా చూస్తూ వెళ్లింది.
నేను మళ్లీ చదవటంలో మునిగిపోయాను. చుట్టుపక్కల పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. అలా ఒక గంట గడిచింది. గేటు తీసిన శబ్దం అయింది. మాధవి తిరిగి వస్తోంది. పూలమొక్కలు మేస్తున్న గేదెను అదిలిస్తూ ‘్ఫ! ఫో! పాడు గేదె’ అంటూ పుల్ల తీసుకుని తోలేసింది.
నా దగ్గరకు రుసరుసలాడుతూ వచ్చి ‘నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సన్నజాజి మొక్కను పక్కింటి వాళ్ల గేదె తినేస్తుంటే చూస్తూ కూర్చుంటారే! కర్ర తీసుకుని నాలుగు తగిలించకుండా..’ అన్నది కోపంగా.
‘నీ పూల మొక్కని తినేసేది ‘దున్న’ అయితే అలాగే తనే్నవాడిని. కానీ అది గేదె. నీ వాదన ప్రకారం స్ర్తిజాతి హింసకు గురికాకూడదు కదా! అందుకే చూస్తూ ఊరుకున్నాను’ అన్నాను.
‘సంతోషించాంలే!’.. అంటూ మాధవి చరచరా ఇంట్లోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ మీద పడేసి సోఫాలో పడుకుంది.
నేను కూడా లోపలికి వచ్చి ‘అప్పుడే మీటింగ్ అయిందా? వెంటనే వచ్చాశావే!’ అన్నాను పక్కన కూర్చుంటూ. మాధవి చివాలున లేచి అమ్మవారిలా చూస్తూ ‘పురాణాలను నిషేధించాలని నేను ఉపన్యసిస్తున్నానా! ఎంపిడిఓ గారి భార్య మధ్యలో అడ్డువచ్చి నా వాదన అంతా తప్పేనని కొట్టిపారేసింది. దాంతో నాకు తిక్కరేగి మీటింగ్ మధ్యలోనే లేచి వచ్చేశాను’ అన్నది.
‘మంచిపని చేశావు’ అన్నాను తాపీగా.
‘ఏమిటీ!’ అన్నది కోపంగా.
‘కూల్ డౌన్! కూల్ డౌన్! కోపం తగ్గించుకుని నిదానంగా ఆలోచించి చూడు. ఎన్నో కోట్ల మంది ప్రజలు వేల సంవత్సరాలుగా శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని దేవుళ్లుగా పూజిస్తున్నారు. వారంతా తెలివితక్కువ వాళ్లేనంటావా? శూర్పణఖ భర్తని రావణుడు చంపేస్తాడు. అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. కానీ అబల ఏం చేయగలదు? ‘రావణాసురుడిని వధించగలిగేది రాముడొక్కడే!’ అని చెపుతాడు నారదుడు. ‘అయితే వెంటనే రాముడి దగ్గరకు వెళ్లి రావణుణ్ణి వధించమని ప్రార్థించనా?’ అంటుంది. ‘ఓసి పిచ్చిదానా! రాముడెంత పరాక్రమవంతుడైనా అన్యాయంగా ఎవరికీ హానిచేయడు. రాముడికి రావణుడి మీద కోపం కలిగేటట్లు చెయ్యి. నీ అభీష్టం నెరవేరుతుంది’ అని ఉపాయం చెప్పి చక్కా పోతాడు నారదుడు. అప్పుడు శూర్పణఖ రాముడి చేత పరాభవింపబడినట్లుగా నటించి, సీతను అపహరించుకు రావటానికి రావణుడిని పురిగొల్పుతుంది. రావణుడు కూడా రాముడి చేతిలో మరణించేటట్లు వరం కోరుకుని ఉన్నాడు. కాబట్టి విధి ప్రేరితుడై వెళతాడు’.
‘అలాగే కంసుడికి శ్రీకృష్ణుడి చేతిలో చావు రాసిపెట్టి ఉంది. కానీ అతడి జాడ తెలియదు. దేశంలోని బాలపాపల్ని అందరినీ చంపమని తన అనుచరులను పంపుతాడు. వారిలో పూతన ఒకతె. తన స్వార్థం కోసం పసివాళ్లందరినీ చంపడం అన్యాయం కాదా! అందుకే కృష్ణుడు పూతన ప్రాణం తీసేశాడు. ఇవన్నీ పురాణాలని లోతుగా చదివితే కానీ అర్థం కావోయ్ అమాయకురాలా!’ అన్నాను.
‘ఏమిటోనండీ! నేనేమైనా మీకులాగా అంత పెద్దపెద్ద పుస్తకాలు చదివానా? చేశానా? టీవీలో పౌరాణిక సీరియల్స్ చూస్తుంటే దేవుళ్లందరూ దుర్మార్గుల్లాగా కనిపించారు. రేపటి నుంచి నేను కూడా టీవీ చూడటం తగ్గించి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటాను’ అన్నది మాధవి.
‘మంచిది’ అన్నాను నవ్వుతూ.


వైద్యోనారాయణోహరిః (కథ)

  • - కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం (సూర్యశ్రీ)
  •  
  • 17/08/2014
ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం విధి వక్రీకరించడంతో శర్మ చేతివేళ్లకి ఏదో మాయరోగం వచ్చింది. కుడి చేతి వేళ్లలో భరించలేనంతగా మంటలు పుట్టడంతో తల్లడిల్లిపోతున్నారు. స్థానికంగా పేరుగడించిన మంచి డాక్టర్ శంకర్‌ని కలిసారు. మంచికి మారుపేరై సేవా దృక్పథంతో సామాజిక స్పృహ నేపథ్యంగా ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఎంతో మందికి ఎనలేని వైద్య సేవలందించిన మహోన్నత వ్యక్తి ఆయన. అలా ఆయన వైద్య సేవలందుకున్న అశేష ప్రజానీకంలో శర్మ ఒకరు.
తాత్కాలిక ఉపశమనార్థం ఆయన మందులిచ్చి ‘ఓ నాల్రోజుల తరువాత కలవండి’ అన్నారాయన! ఆ మాటలకు కొండంత ధైర్యం వచ్చిన శర్మ ‘హమ్మయ్యా’ అనుకుంటూ ఇంటిముఖం పట్టారు. ఆయనకు వచ్చిన అనారోగ్యమేమిటో? ఎలాంటిదో? డాక్టరేమన్నారో? అనేక భయాందోళనలతో కూడిన ప్రశ్నలు భార్యామణి హృదయంలో రొద చేస్తుంటే టెన్షన్ భరించలేక వీధి గుమ్మంలోనే ఉండిపోయింది రెప్పార్పకుండా! ఇంటికి తిరిగొచ్చిన పెనిమిటి ‘మరేం ఫర్వాలేదుట.. టాబ్లెట్స్ రాసిచ్చారంతే’ అని చెప్పుకుపోతుండడంతో గట్టిగా ఊపిరి తీసుకుందా ఇల్లాలు - పాపం మళ్లీ కథ మొదటికే వస్తుందని గ్రహించలేక!
వేళ్లన్నీ ఎర్రబడిపోయాయి. లోలోపల శూలాలతో పొడిచేస్తున్నట్లుగా ఉంది. వేళ్లల్లో మంటలు పుడుతున్నాయి. కనీసం ఇడ్లీ ముక్కకూడా విరవలేని పరిస్థితి. ‘ఓరి భగవంతుడా! ఏమిటి నాకో దుస్థితి? అనుకుంటూ మళ్లీ హుటాహుటిన శంకర్ గారి వద్దకు పరుగెత్తారు. భర్తపడే శారీరకావస్థకు భార్యామణి తల్లడిల్లిపోతోంది. పెళ్లయి రెండేళ్లు కాకుండానే తల్లిని కాబోతున్నానన్న ఆనందం కూడా లేకుండా పోయిందామెకు పాపం! భర్త ఓ పక్క అవస్థపడుతుంటే ఆనందం ఆమె స్వంతం ఎలా అవుతుంది? పోనీ పుట్టింటి వాళ్లకో అత్తింటి వాళ్లకో విషయం చెబితేనో? అమ్మో! ఇంకేమయినా ఉందా? పాపం దూరాన ఉండి వాళ్లేమీ చేయలేరు సరికదా! వాళ్లని కూడా బాధ పెట్టిన వాళ్లమవుతాం’ అనుకుని ప్రస్తుతానికి చెప్పద్దనే నిర్ణయానికి వచ్చేసిందా సాధ్వి. శర్మది ప్రైవేట్ ఉద్యోగం. ఆర్థిక స్థితి కూడా అంతంతమాత్రం. చేతినిండా డబ్బున్నా కొన్ని సమస్యలు పరిష్కారవుతాయి. ఆ అవకాశం ఆయనకామడదూరంలో ఉంది.
‘చూడండి శర్మగారూ! ఇలా టాబ్లెట్స్ ఎంత కాలమని వాడతారు చెప్పండి! వాడినంత సేపూ బాగానే ఉన్నట్లుంటుంది’ ఆపేస్తే పెయిన్స్ మళ్లీ స్టార్ట్ అవుతాయి.
శంకర్ డాక్టర్ మాటలకు నిశే్చష్టుడై నిలువు గుడ్లేసిన శర్మ కాసేపటి దాకా తేరుకోలేక పోయారు. అతి ప్రయత్నం మీద నోరు తెరచి ‘మరి నా పరిస్థితేమిటి డాక్టర్?’ అతి దీనంగా అడిగేసరికి డాక్టర్ చిరునవ్వుతో-
‘మరేం ఫరవాలేదు. అనవసరంగా భయపడకండి. చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది’
‘అమ్మో ఆ.ప.రే.ష.నా?’ అంటూ అంత శర్మ నోరు తెరిచాడు.
‘అనవసరంగా భయపడకండి. హైదరాబాద్‌లోని నిమ్స్‌కి వెళ్లండి. అక్కడ మంచి మంచి చేయి తిరిగిన డాక్టర్లుంటారు. చక్కటి వైద్యం మీకందుతుంది. చిన్నాపరేషనే! గాబరాపడకండి. వీలైనంత తొందరగా వెళ్లండి. వ్యాధి ముదిరితే ప్రమాదం’ అంటూ ఏవేవో టాబ్లెట్స్ రాసిస్తూ కొండంత ధైర్యాన్ని నూరిపోసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు చెప్పి ఇంటిముఖం పట్టిన శర్మ జరిగినదంతా భార్యామణికి పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె హృదయం ఆవేదనతో బరువెక్కిపోయింది.
ఓ మూడ్రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ చేరుకున్నాడు శర్మ. అక్కడున్న బంధువొకాయన సహాయంతో ‘నిమ్స్’లోకి అడుగుపెట్టిన శర్మకు అంతా అయోమయంగా ఉంది. రోగులతో కిటకిటలాడిపోతున్న హాస్పిటల్ ప్రాంగణంలో తిరుగాడుతూ వాళ్లనీ వీళ్లనీ అడిగి మొత్తంమీద తన వ్యాధిని నిర్ధారించి పరిష్కరించే వాస్క్య్‌లర్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిని కలుసుకోగలిగాడు.
‘మరేం ఫరవాలేదు. నేనున్నాగా!’ అంటూ ఆయన వెన్నుతట్టారు. ఆ అమృత స్పర్శకే రోగం నయమైపోయిందా అనిపించింది శర్మకి.
‘ఎనిమిది వేలు దాకా చేత్తో పట్టుకోండి. అయినా అంతవదనుకోండి’ అంటూ ధైర్యం చెబుతూ ‘ఈ గురువారం ఆపరేషన్ చేద్దాం! ఆపరేషన్ అంటే ఏదో పెద్దగా ఊహించేస్కుని గాబరాపడిపోకండి. సూది గుచ్చినట్లు కూడా ఉండదు సరేనా!?’ అంటూ శర్మకి మనోధైర్యాన్ని నూరిపోశారు.
‘ఈ బుధవారం జాయిన్ అవండి. ఆపరేషన్ అయిన వారంలోపు డిశ్చార్జ్ చేసేస్తాం! మళ్లీ ఫ్యూచర్‌లో మీకెలాంటి ఇబ్బంది ఉండదు సరేనా?’ అంటూ భరోసా ఇచ్చారు. ‘ఎనిమిది వేలంటే మాటలా? రెండు దశాబ్దాల క్రితం అంత పెద్దమొత్తం చేత్తో పట్టుకోవాలంటే ఓ మధ్య తరగతి కుటుంబీకుని వల్ల అయ్యే పనేనా? ఎస్టిమేషన్ సర్ట్ఫికెట్ ఒకటి రామకృష్ణ గారి నుండి తీస్కుని హెడ్ ఆఫీస్‌కి వెళ్లి అప్లికేషన్ రాసిచ్చిన గంటలోపే శర్మ పరిస్థితినర్థం చేసుకున్న అధికారులు చెక్ రాసిచ్చేసారు. శర్మతో మాట్లాడుతూనే చీమకుట్టినట్లు కూడా అనిపించనంతగా అతిలాఘవంగా ఆపరేషన్ పూర్తి చేసేసి వార్డుకు పంపించేశాడు.
ఓ నాల్రోజుల అనంతరం కుట్లు విప్పేసి మందులు రాసిస్తూ డిశ్చార్జ్ చేసి పంపించేసేటప్పుడు తన శారీరక స్థితిగతులపై వెల్లువెత్తిన ప్రశ్నల వర్షాన్ని శర్మ ఒక కాగితంపై కురిపించాడు.
‘సార్! నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడిగితే విసుగెత్తించిన వాడనవుతానని ఈ జాబితా మీ ముందుంచుతున్నాను’ అంటూ డాక్టర్ చేతికందించాడు శర్మ. ఆయన చిరునవుతో సందేహాలన్నీ పటాపంచలు చేసేస్తూ ‘్ఫ్యచర్‌లో మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ పనులన్నీ మీరు యధావిధిగా కొనసాగిస్తారు. విత్ ఇన్ ఫ్యూడేస్ యు ఆర్ ఆల్వేస్ పెర్‌ఫెక్ట్’ అనేటప్పటికి కొండంత భారం దిగిపోయి మనసు తేలికపడింది శర్మకి.
శర్మలాంటి వేలాది మంది రోగుల రోగపు మంటలార్పేస్తూ ... మనో ధైర్యాన్నందిస్తూ అపరధన్వంతరులుగా రోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న డాక్టర్ల పేర్లెన్నని ఏకరువు పెట్టగలం!? అందుకే అన్నారేమో! వైద్యోనారాయణోహరిః అని!!
- కొడుకుల సూర్య సుబ్రహ్మ

నిషా (కథ)

  • - అగేహానంద్
  •  
  • 24/08/2014
గంగాధర్‌రావు సాటాపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీమీద వచ్చాడు. అప్పటికే అక్కడ అపరంజని, పింగాక్షిలనే ఇద్దరు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారు. మీటింగ్‌ల కోసం విద్యాధికారి కార్యాలయానికి తిరగలేక వాళ్లిద్దరూ గంగాధరరావునే హెడ్‌మాస్టర్‌గా ఉండమన్నారు. సాటాపూర్‌లో అదొక్కటే పాఠశాల అవడంతో వారివాళ్లందరూ ‘మా హెడ్‌మాస్టర్‌గారు’ అని సంబోధించేవారు. బడిలో కొత్త పుస్తకాలు వచ్చినా, ఆటల్లో విద్యార్థులు బహుమతులు గెలిచినా పిల్లలకు బహూకరించేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా జెండా ఎగరేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. మండల సమావేశాలకు, శిక్షణ తరగతులకు తప్పకుండా వెళ్లేవాడు గంగాధర్‌రావే. మండలాఫీసులో ‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గారు’ అని పిలిచేది కూడా గంగాధర్‌రావునే. మండల ఆఫీసునుండో, ఎమ్మార్వోనుండో, డిఇఓ నుండో ఉత్తరాలు వస్తే తెరిచేది కూడా హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. తిరిగి వాటికి తగిన విధంగా జవాబులు రాసేది కూడా ఆయనే. ఏ పత్రం రాసినా చివరికి సంతకం చేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. క్రమక్రమంగా గంధార్‌రావు తన స్నేహితులకు, చుట్టాలకు హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుగానే పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే పరిచయస్తులు, వీధివాళ్ళు, బంధువులు అందరూ ఆయన్ని హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావు అని పిలవడానికి అలవాటుపడ్డారు.
సాటాపూర్‌కు గంగాధర్‌రావు వచ్చి మూడేళ్లు దాటాయి. జూన్‌లో మళ్లీ బదిలీల కోసం ప్రకటన వచ్చింది. గంగాధర్‌రావు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాని నచ్చిన ఊరు దొరక్క వెళ్లలేదు. అపరంజని టీచర్ బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోయింది. ఆ ఖాళీలో రామ్‌దాస్ వచ్చారు. జూలై మొదటి తేదీకల్లా విధుల్లో చేరాలని ఉత్తర్వులు వచ్చాయి.
గంగాధర్‌రావుకన్నా రామ్‌దాస్ సీనియర్. దీంతో హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుకు షాక్ తగిలింది. గత మూడేళ్లుగా తాను సాటాపూర్‌కు హెడ్‌మాస్టర్. ఇప్పుడు తనకున్నా సీనియర్ అయిన రామ్‌దాస్ వస్తే తాను మామూలు ఉపాధ్యాయుడు అవుతాడు. సాటాపూర్ హెడ్‌మాస్టర్ పదవి పోతుందనిపించడంతో మనసంతా ఆందోళనతో నిండిపోయింది.
ఏంచేయాలో తోచక ఉపాధ్యాయ సంఘ భవనానికి వెళ్లాడు. చిన్న చిన్న పైరవీలు చేసే నాయకుడు అప్పారావును కలిసి తన బాధను చెప్పుకున్నాడు. ‘నేను రామ్‌దాస్‌గారికి చెప్పి చూస్తాను. మన ప్రయత్నం మనం చేద్దాం’ అని భరోసా ఇచ్చాడు అప్పారావు.
మర్నాడు సాయంత్రం అప్పారావు రామ్‌దాస్‌ని కలిశాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడి మెల్లిగా అసలు విషయంలోకి వచ్చాడు.
‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గా గంగాధర్‌రావు ఉంటేనే బాగుంటుంది’ అన్నాడు.
‘గంగాధర్‌రావు నాకన్నా జూనియర్ కదా? అతనెలా హెడ్‌మాస్టర్ అవుతాడు’ అడిగాడు రామ్‌దాస్.
‘గత మూడేళ్లుగా గంగాధర్‌రావు సాటాపూర్‌లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్‌ను చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇకముందు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది’ చెప్పుకొచ్చాడు అప్పారావు.
‘కావొచ్చు. కానీ గంగాధర్‌రావు 96 డిఎస్‌సి, నేను 95 డిఎస్‌సి. కాబట్టి నేనే సీనియర్‌ని. నా జూనియర్‌ని హెడ్‌మాస్టర్‌గా నేనెందుకు అంగీకరించాలి’ అని ప్రశ్నించాడు రామ్‌దాస్.
‘అది కాదన్నా... సాటాపూర్‌లోనూ, మొత్తం మండలంలోనూ హెడ్‌మాస్టర్‌గా పిలిపించుకుంటున్న గంగాధర్‌రావు ఇకముందు అసిస్టెంట్‌గా పిలిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఎవరైనా ‘పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా? నువ్వే చెప్పు. ఒక సంవత్సరం ఆగితే తర్వాతి కౌన్సిలింగ్‌లో వేరే ఊరికి బదిలీ అయిపోతాడు. దానికి నేను హామీ’ అన్నాడు అప్పారావు.
తలెత్తి సూటిగా అప్పారావు కళ్లల్లోకి చూశాడు రామ్‌దాస్.
‘అప్పారావ్... కాలం మారింది. పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా అనేది పాత నానుడి. ఈ రోజుల్లో పూలు అమ్మితే లాభం వస్తుందనుకుంటే పూలే అమ్ముతాడు. కట్టెలమ్మితో లాభమనుకుంటే కట్టెలే అమ్ముతాడు. నేడు లాభంతో పనికాని వస్తువులతో ఏం పని? వాటిని ఇంట్లో అయితే ఉంచుకోం కదా’ ఎదురుదెబ్బ కొట్టాడు.
‘నేను సీనియర్‌ని, నా జూనియర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేయలేను. నేనే హెడ్‌మాస్టర్‌ని అవుతాను. అడ్జెస్టు అవమని గంగాధర్‌రావుకే చెప్పండి’ అనేసి వెళ్లిపోయాడు రాందాస్.
ఆ మర్నాడు అప్పారావు సందేశం విన్న గంగాధర్‌రావుకి నిషా దిగడం మొదలైంది.

పింఛన్ (కథ)

  • - గుండు రమణయ్య గౌడ్
  •  
  • 31/08/2014
‘డొడ్డంక ఢాం.. డొడ్డంక ఢాం..’ డప్పు కొడుతూ సపాయి రామయ్య ఊరు చాటింపు చేస్తున్నాడు. ‘బియ్యం, చక్కర, గోధుమలు, ఫించన్లు, వికలాంగుల ఫించన్లు అచ్చినయి, గ్రామ పంచాయతీలో తీసుకోవాలంటూ’ గట్టిగా చెప్పి, మళ్లీ ‘డొడ్డంక ఢాం.. డొడ్డంక ఢాం..’ డప్పు కొడుతూ వెళ్లిపోతున్నాడు.
సఫాయి రామయ్య డప్పు చాటింపు వినగానే రంగయ్యకు పోయిన ప్రాణం వచ్చినట్లయ్యింది. ఎందుకంటే రంగయ్యకు పింఛను వస్తేనే పూట గడిచేది. రంగయ్య, అతని భార్య వాటితోనే బతికేది. ప్రతి నెల ఒకటో తారీఖునే అన్ని వచ్చేవి. ఈ నెల మూడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. మూడు రోజులు ఆలస్యం అయ్యేసరికి ప్రాణం మూడు తిరుగులు తిరిగింది. పింఛన్ వస్తేనే ఇంట్లో అన్ని సామాన్లు కొనుక్కునేది. పింఛను రాక ఈ మూడు రోజులు రంగయ్యకు నరకం కనబడింది.
ఒకప్పుడు రంగయ్యది పెద్ద ఉమ్మడి కుటుంబం. దాదాపు ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. దానికి ఇద్దరు పాలేర్లు ఉండేవారు. వ్యవసాయం పని వాళ్లతో చేయించేవాడు. నాలుగు ఎద్దులు, పాల కోసం రెండు బర్రెలు ఉండేవి. రంగయ్యకు నలుగురు సంతానం. ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. తన పిల్లలు చిన్నగా ఉన్న సమయంలో రంగయ్య తన వద్ద పని చేసే పాలేరుకు మంచి అమ్మాయిని చూసి పెండ్లి కూడా చేశాడు. రంగయ్య ఇల్లు చూడటానికి కళ్లు చాలేవి కావు. అంత పెద్దగా ఉండేది భవంతి. ఆ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగేది. కానీ రంగయ్య కుటుంబంపై కాలం పగబట్టింది. కొన్ని రోజులలో అనేక మార్పులు సంభవించాయి. కొడుకులు, కోడళ్లు మాటలు వినో.. లేకపోతే ఏమైందో ఏమో ఇంటికి రావటం కొంచెం కొంచెం తగ్గించేశారు. చాలా రోజులకొకసారి చుట్టపు చూపుగా వచ్చి వచ్చి వెళ్లేవారు. ఓ వైపు రంగయ్య వయస్సు పెరిగిపోయంది. కుటుంబ సభ్యులు రోజురోజుకి దూరం అవుతున్నారు. కోడళ్లకు అత్తామామలపై కోపాలు పెరిగిపోయాయి. ఆస్తి ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ దగ్గరయ్యారు. ఆస్తి దూరమయ్యేసరికి మానవ సంబంధాలు కూడా దూరమవుతున్నాయి. రామయ్య తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యేవాడు. రంగయ్య ఇంట్లో ఇప్పుడు ఏ పాలేర్లు లేరు. అంతా బోసిపోయి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎకరం పొలం తనే ఒంటరిగా సాగు చేసుకుంటున్నాడు.
ఓ రోజు దుస్సంఘటన జరగనే జరిగింది. ఆ రోజు పెందలకడనే లేచి పొలంలో పెంట పోయడానికి తనకున్న బక్కచిక్కిన రెండు ఎడ్లతో బండి కట్టుకొని పొలం వైపు వెళ్లాడు. బారెడు పొద్దెక్కినా ఇంటికి రాలేదు. ఇంటివద్ద రంగయ్య భార్యకు గుండెల్లో ఆందోళన మొదలైంది. అక్కడ పొలంలో శరీరం సరిగా సహకరించక రంగయ్య తూలి కిందపడ్డాడు. లేద్దామని ప్రయత్నిస్తే లేవరావటం లేదు. తొంటిలో తీవ్ర నొప్పనిపించింది. సమయం తెల్లవారుజామున నాలుగున్నర, ఐదు మధ్యలో అనుకుంటా పక్కనే ఊరి నుండి ‘అల్లాహ్ అక్బర్’ అంటూ మసీదునుండి వినబడుతోంది. రంగయ్య ఎంత అరిచినా అక్కడ ఎవరూ లేరు. కాసేపటికి రంగయ్య మొర ఆ దేవుడు కరుణించాడేమో.. పక్క పొలం యువకుడు ఉదయానే్న లేచి హనుమాన్ పూజ చేసుకొని మాలధారణతో ఉన్నట్లున్నాడు. తన పొలంలో నీరు చూసుకుంటూ ఇటువైపు చూసేసరికి ఎద్దుల బండి పక్కన రంగయ్య పడి ఉన్నాడు. వెంటనే ఆ యువకుడు ‘ఏమైంది తాతా’ అంటూ పరుగెత్తుకొచ్చాడు. లేపడానికి ప్రయత్నించాడు. ‘అమ్మా.. నొప్పి’ అంటూ రంగయ్య మూలుగసాగాడు. ఆ యువకుడు ఆ బండిలో ఉన్న పెంటను తీసివేసి అదే బండిలో రంగయ్యను తీసుకొని ఇంటికి వచ్చాడు.
పట్టణాల్లో ఉన్న కొడుకులకి, కూతుళ్లకి సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రంగయ్యకి తుంటిలో విరిగింది. మేజర్ ఆపరేషన్ జరిగింది. తాను కోలుకోవడానికి, లేచి నడవడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. రంగయ్య మనస్సు మాత్రం తన ప్రాణంలా భరించే పొలంపైనే ఉంది. రైతు దేశానికి వెనె్నముక అన్నట్లు రంగయ్యకు ఉన్న ఎకరం పొలం తనకి వెనె్నముక. ఈసారి పొలం సరిగా పండలేదు, వేరే వాళ్లకి కౌలుకివ్వటం వల్ల.
ఇప్పుడు రంగయ్య వికలాంగుడు అయిపోయాడు. ఒకప్పుడు పది ఎకరాలు ఒక్కచేత్తో దునే్న మనిషి ఒంటికాలువాడయ్యాడు. గ్రామంలో ఉన్న సుంకర్లని, సర్పంచిని అడిగి మెల్లగా వికలాంగ సర్ట్ఫికెట్ జిల్లా కేంద్రం నుండి తెచ్చుకున్నాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. పింఛన్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాల్లో అన్ని పైరవీలేనాయే. వికలాంగ పింఛన్ ఐదువందలు, తెల్లరేషన్ కార్డు ద్వారా బియ్యం, పప్పులు, కిరోసిన్ రావటం వల్ల నెలనెలా గడుస్తోంది. తన బ్రతుకంతా ఉన్న ఎకరం పొలంపైనే, పింఛన్ పైనే. ప్రతి నెల పింఛన్ వస్తేనే రంగయ్యకు బ్రతుకు, మెతుకు. కానీ ఈ నెల ఆ పింఛన్, రేషన్ సామానులు రెండు, మూడు రోజులు ఆలస్యం అయ్యేసరికి ప్రాణమంతా చితు బొత్తియింది. ‘డొడ్డంక.. ఢాం.. డొడ్డంక.. ఢాం..’ అంటూ సపాయి రామయ్య డప్పు సప్పుడు వినగానే రామయ్య మనసు తేలికయ్యింది. ఇక నెల దాకా ఏ బాధ లేదు తిండితిప్పలుకు అనుకున్నాడు.
బ్రతుకంటే సుఖం కాదు, కష్టం అని ఆ రోజు పూర్తిగా అర్థమై పోయింది రంగయ్యకు. ‘మనిషి జీవితం నిత్యపోరాటం’. ఇది నగ్న సత్యం. కష్టం అనుభవించి సుఖం పొందటం తేలికే.. కానీ సుఖం అనుభవించి కష్టపడాలంటే జీవితానికి ఎదురీతే.. అందుకే.. కష్టం నుండి వచ్చిన సుఖాన్ని మించినదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఒక్కసారిగా ‘రంగయ్య’ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి ఆనంద పారవశ్యంతో.

లివర్‌కు వరం.. ‘కీహోల్’ విధానం

  • -డా.టామ్ చెరియన్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
  •  
  • 27/08/2014
==========
లివర్ శస్తచ్రికిత్సలు చాలా కష్టతరమైనవి. ఎవరుపడితే వారు చేయలేరు. అందుకు ఎంతో పరిజ్ఞానం ఉండాలి. ఈఅవయవం ద్వారా ఎంతో రక్తం ప్రసరిస్తుంటుంది. అందుకు రక్తస్రావం ఎక్కువకాకుండా శస్తచ్రికిత్స చేయాలి. అలాగేలివర్‌కి ఎన్నో అనుసంధానాలుంటాయి. అవేవీ దెబ్బతినకుండాను చేయాల్సి ఉంటుంది. అందుకే కీహోల్ సర్జరీ మిగతా అవయవాలకు పదిహేనుసంవత్సరాల క్రితమేప్రారంభమైనా, లివర్‌కి ఇప్పుడు ప్రారంభమైంది
==========
గాల్‌బ్లాడర్స్ తొలగించడం దగ్గర నుంచి హెర్నియా శస్త్ర చికిత్స వరకు ఇప్పుడు కీహోల్ ద్వారానే చేస్తున్నారు. ఇలా కీహోల్‌తో చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. ఆసుపత్రిలో ఎక్కువ రోజులుండక్కరలేదు. ఖర్చు తగ్గుతుంది. ఇన్‌ఫెక్షన్స్ ఉండవు. అందుకే పూర్తిగా కోసి చేసే శస్త్ర చికిత్సలు తగ్గిపోతాయి. ఇప్పుడు లివర్ శస్త్ర చికిత్సల్ని కూడా కీహోల్‌తో చేస్తున్నారు. ఇది ఆరోగ్య రంగం సాధించిన మరో ప్రగతి.
లివర్ శస్తచ్రికిత్సలు చాలా కష్టతరమైనవి. ఎవరుపడితే వారు చేయలేరు. అందుకు ఎంతో పరిజ్ఞానం ఉండాలి. ఈ అవయవం ద్వారా ఎంతో రక్తం ప్రసరిస్తుంటుంది. అందుకు రక్తస్రావం ఎక్కువ కాకుండా శస్త్ర చికిత్స చేయాలి. అలాగే లివర్‌కి ఎన్నో అనుసంధానాలుంటాయి. అవేవీ దెబ్బతినకుండాను చేయాల్సి ఉంటుంది. అందుకే కీహోల్ సర్జరీ మిగతా అవయవాలకు పదిహేను సంవత్సరాల క్రితమే ప్రారంభమైనా, లివర్‌కి ఇప్పుడు ప్రారంభమైంది. మరో విషయం గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 3వేలకి పైగా కీహోల్ శస్త్ర చికిత్సలు విజయవంతమయ్యాయి. ఈ మధ్యనే హైదరాబాద్‌లో లివర్ కీహోల్ శస్త్ర చికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ నైపుణ్యాన్ని సంపాదించగలిగారు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమాత్రం నైపుణ్యం, మంచి అనుభవం లేనివారితో శస్త్ర చికిత్సలు చేయించుకోకూడదు.
ఈ కీహోల్ శస్త్ర చికిత్సలవల్ల నొప్పి తక్కువ, రక్తస్రావం తక్కువ, గాయం త్వరగా మానుతుంది. ఆసుపత్రిలో ఉండే రోజులు తక్కువ. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. మచ్చలుండవు.
రోగి పరిస్థితి లాంటి విషయాల్నిబట్టి విజయం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కీహోల్ శస్త్ర చికిత్సల్లో మరణం 0.3 శాతం కన్న తక్కువ అని 2009లో సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఓపెన్ శస్త్ర చికిత్సకన్నా కీహోల్ లివర్ శస్త్ర చికిత్సలో మరణం శాతం చాలా తక్కువ.
కంతి రకాన్ని బట్టి కీహోల్ సర్జరీ ఎలా చేయాలో నిర్ధారించుకుంటారు. కాన్సర్‌లకి ఈ చికిత్స ఎంతో ఉపయోగం. ముఖ్యంగా కొన్ని రకాల కాన్సర్‌లకు! గత ఏడు సంవత్సరాల గణాంకాల్ని పరిశీలించినప్పుడు లివర్ కాన్సర్‌ని తొలగించడానికి 58 శాతం కీహోల్ సర్జరీలనే విజయవంతంగా చేసారు. కీహోల్ సర్జరీలు సురక్షితం. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ తక్కువ.
ఈ అధునాతన కీహోల్ సర్జరీ సరైన శిక్షణ పొందిన వారితోనే చేయించుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. వైద్యుడికి ఈ కీహోల్ సర్జరీలు చేయడానికి ముందు వందైనా ఓపెన్ మేజర్ లివర్ సర్జరీలు చేసిన అనుభవం ఉండి తీరాలి.
లివర్ కాన్సర్స్ తొలగించడానికి కీహోల్ శస్త్ర చికిత్సలు బాగా ఉపకరిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు లివర్ డోనార్ ఆపరేషన్‌ని కూడా కీహోల్ సర్జరీతో చేస్తున్నారు. ఇది డోనార్స్‌కి వరంలాంటిది. ఆధునిక శస్త్ర చికిత్సల్ని ఆహ్వానిద్దాం. కాకపోతే వాటిలో అనుభవం ఉన్నవాళ్ల దగ్గరకే వెళ్లి చికిత్స చేయించుకుందాం. లేకపోతే ఇబ్బంది పడడమే కాక నూతన విధానాలంటే ప్రజలు భయపడిపోతారు. లివర్ కాన్సర్‌లను ప్రారంభ దశలోనే గుర్తించగలగాలి. భయపడాల్సిన పనిలేదు. కీహోల్ ద్వారా కాన్సర్ భాగాన్ని తీసివేయవచ్చు. మరో రెండు నెలల్లో లివర్ మళ్లీ పూర్తిస్థాయికి పెరుగుతుంది. లివర్ లోపల కాన్సర్‌లుంటే లివర్ మార్పిడి శస్తచ్రికిత్సతో స్వస్థత చేకూర్చవచ్చు.

ప్రశ్న - జవాబు -- మలబద్ధకంతో బాధ

  • 27/08/2014
మలబద్ధకంతో బాధ
ప్ర:నా వయస్సు 39 సంవత్సరాలు. శారీరక శ్రమ లేకుండా, మలబద్ధకంతో బాధపడుతూ తరచుగా మలబద్ధకం నివారణ మాత్రలు వాడుతుంటాను. అలాగే తరచుగా మలవిసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న సర్జన్‌ను సంప్రదించగా పైల్స్ అని చెప్పారు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
ప్రతాప్, గుడివాడ
జ: మీ సమస్యకు ‘నక్స్‌వామిక’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు వారం రోజులపాటు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక వారం పాటు వాడగలరు. అనంతరం ప్లాసిబో 30 అనే మందును ఉదయం 8, సాయంత్రం 8 గోళీల చొప్పున 15 రోజులపాటు వాడగలరు. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. రోజూ మలవిసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం అతిగా సేవించుట, ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహారం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్ చేయాలి.
పొట్టలో నొప్పి-తేన్పులతో ఎలా?
ప్ర: నా వయసు 22 ఏళ్లు. నాకు పొట్టలో నొప్పి వుండి తేన్పులు ఎక్కువగా వస్తుంటాయి. తిన్న తర్వాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. నేను మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటాను. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతాను. నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు.
-చంద్రకాంత్, నల్గొండ
జ: మీ సమస్యకు ‘అర్జెంటం నైట్రికం-200’ అనే మందును రోజుకు 3సార్లు చొప్పున ఒక మూడురోజులు వాడగలరు. తరువాత రెండు వారాల పాటు ప్లాసిబో 30 అనే మందును ఉదయం, సాయంత్రం 6 గోళీల చొప్పున వాడితే మంచి ఫలితం వుంటుంది. అలాగే ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు అలవాటు వుంటే మానివేయాలి. నిలువ వుంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. నీరు సరిపడినంత తాగాలి. మానసిక వత్తిడిని నివారించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలి. టీ కాఫీలు మానివేయాలి. *

సంజీవని

బంధాలతో ఆరోగ్యం పదిలం

  • డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి - Psychologist nbsreddi@gmail.com
  •  
  • 27/08/2014
ఆత్మీయత, అనుబంధం అంతా ఒక బూటకం అంటుంటారు కొందరు. అయితే చక్కటి ప్రేమానురాగాలు, సామాజిక సంబంధాలు స్వంతం చేసుకున్నవారు దీర్ఘాయుష్కులుగా జీవిస్తున్నట్టు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్నేహ బంధాలు, కలివిడితనం ఖర్చులేని ఔషధంలా పనిచేస్తున్న దాఖలాలు ఉన్నాయి. మంచి ఇరుగు, పొరుగు ఉన్నవారు ఉల్లాసంగా, ఉత్సాహంతో పనిచేస్తుంటారన్నది కాదనలేని సత్యం. ఒంటరితనంతో ఉన్నవారికంటే జంటగా ఉన్నవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నారని పరిశోధకులు అంటున్నారు. సానుకూల సంబంధాలు కలవారిలో గుండెపోటు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. సామాజిక సంబంధాలవల్ల కలిగే ప్రయోజనాలపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు పరిశోధనలు పై విషయాలను ధృవీకరిస్తున్నాయి.
ఒత్తిడి తగ్గడమే అసలు రహస్యం
సామాజిక సంబంధాలవల్ల మానసిక ఒత్తిడి తగ్గడంవల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని మానసిక నిపుణులు విశే్లషిస్తున్నారు. ఆధునిక జీవన విధానంవల్ల సమాజంలో అధికశాతం వ్యక్తులు మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారు. తీరికలేని పనులు, సరదాలు లేని ఉద్యోగాలు, పని ఒత్తిళ్ళు ఒంటరి బ్రతుకులు, ఇతర సమస్యలు ఒత్తిడికి కారణమవుతుంటాయి. భయం, ఆందోళన, అసంతృప్తి, విసుగు, సంఘర్షణ, ప్రతికూల భావాలు ఒత్తిడికి మూలాలుగా పరిణమిస్తుంటాయి. దీర్ఘకాలం కొనసాగే మానసిక ఒత్తిడివల్ల మానసిక శారీరక రుగ్మతలు తలెత్తుతుంటాయి. ఒత్తిడి తీవ్రత పెరిగితే డిప్రెషన్ తలెత్తుతుంది. దీంతో నిద్రాహారాలకు దూరమవుతాయి. నిరాశా నిస్పృహలు దగ్గరవుతాయి. ఆత్మహత్యాభావాలు చెలరేగుతాయి. అలాగే ఫోబియా, ఆందోళన, అబ్సెసివ్ కంపల్సిన్ డిజార్డర్ (ఒసిడి) భయాలు, భ్రాంతులు, ఉద్యోగ లోపాలు తలెత్తుతుంటాయి. మానసిక ఒత్తిళ్ళు శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో మనో శారీరక రుగ్మతలైన రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, కీళ్ళనొప్పులు అల్సర్లు తదితర రుగ్మతలు బయటపడతాయి. దీంతోపాటు శృంగార లోపాలు తలెత్తి భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో మనిషి సుఖ సంతోషాలకు దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అలాగే ఆరోగ్య సమస్యలు తీవ్రమై అకాల మృత్యువాత పడవలసి వస్తుంది. అయితే మంచి సంబంధ బాంధవ్యాలు నిర్వహించేవారిలో మానసిక ఒత్తిళ్ళు తగ్గిపోతాయి. తమకు ఎదురయ్యే సమస్యలు బాధలను ఆత్మీయులతో పంచుకుంటే వాటి తీవ్రత తగ్గిపోతాయి. పైగా నలుగురితో చర్చించడంవల్ల సమస్యలకు పరిష్కారం దొరికి ఒత్తిడి తగ్గిపోతుంది. *