Wednesday 3 June 2015

రుతుశూలకి విరుగుడు

కొంతమంది స్త్రీలకు రుతు సమయానికి రెండు రోజులు ముందుగానే పొత్తికడుపులో విపరీతమైన నొప్పి ప్రారంభమై రుతుస్రావం జరుగుతుంది. ఈ రకంగా విపరీతమైన నొప్పితో రుతుస్రావం జరగడాన్ని ఆయుర్వేదంలో కష్టావర్తమని, రజోకృచ్ఛమని, రుతుశూల అని పిలుస్తారు. కొన్ని గ్రామాల్లో కొంతమంది దీనినే ముట్టునొప్పి అని కూడా పిలుస్తారు. త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలు ప్రకోపించడం వల్ల ఈ రకమైన నొప్పి వస్తుందనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఇవి రెండు రకాలు. మొదటిది యుక్త వయసులోని ఆడపిల్లలకు వచ్చేది, రెండవది 30 సంవత్సరాల లోపు స్త్రీలలో వచ్చేది.
 
మొదటిరకం రుతుశూల
  • ఇది కండరాల సంకోచంతో కలుగుతుంది.
  • రుతుస్రావానికి కొద్ది గంటల ముందు వస్తుంది.
  • ఈ నొప్పి వచ్చినపుడు అరుదుగా నడుం నొప్పి, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, రుచి లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
రెండవరకం నొప్పి
  • కటివలయం (పెల్విక్‌ గర్డిల్‌ ) లోని గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్‌ ట్యూబుల వాపు, నొప్పి వల్ల ఏర్పడుతుంది.
  • పొత్తి కడుపు దిగువ భాగంలో నొప్పి ఎక్కువ సేపు వస్తుంటుంది. 
  • రుతు సమయానికి రెండు లేక అయిదు రోజుల ముందుగానే వస్తుంది.
  • మలబద్ధకం ఉండే స్త్రీలలో తరచుగా ఈ నొప్పి వస్తుంటుంది.
ఈ రెండు రకాల రుతునొప్పులతో బాధపడే స్త్రీలు, మలబద్ధకంతో బాధపడకుండా జాగ్రత్తపడాలి. దీని వల్ల కటి వలయంలో ఉన్న అపాన వాయువులు, మలమూత్రాలతో పాటు బయటకు వెళ్లిపోవడం వల్ల గర్భాశయంపైన, ఇతర అవయవాలపైన ఏమాత్రం ఒత్తిడి ఏర్పడదు. తర్వాత మూలికా చికిత్స వల్ల ఈ అనారోగ్య పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు.
  • కలబందలోని గుజ్జ్జుకి పంచదార కలిపి ఉదయాన్నే ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఈ నొప్పి తగ్గుతుంది.
  • ఇంగువను పొడిచేసి 1 టీ స్పూన్‌ పొడిని ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటిలో గాని, పాలు, ఇతర ఆహారపదార్థాలతో గాని కలిపి వాడుతుంటే రుతుశూల తగ్గిపోతుంది.
  • రావిచెట్టు బెరడు, చింత చెట్టు బెరడు సమంగా కలిపి మెత్తగా నీటితో నూరి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును రోజూ ఉదయం, రాత్రి, భోజనం ముందు ఒక టీ స్పూన్‌ కప్పు నీటిలో కలిపి వాడితే రుతు నొప్పి తగ్గుతుంది.
  • ఉమ్మెత్త ఆకులను మరుగుతున్న నీటిలో వేసి నానబెట్టి తీసి పొత్తి కడుపు క్రింది భాగంలో కాపడం పెట్టిన తర్వాత ఆకులను తీసి సరిపడినంత వేడిగా ఉన్నపుడు పొత్తి కడుపు క్రింది భాగంపై వేసి ఉంచితే నొప్పి త్వరగా తగ్గుతుంది.
  • గుప్పెడు మేడి చెట్టు ఆకులను లీటరు నీటిలో వేసి అర లీటరు మిగిలేట్టు మరిగించి ఆ నీటితో మర్మావయాన్ని శుభ్రపరచుకుంటే వెంటనే రుతు నొప్పి తగ్గుతుంది.
  • 20 మిల్లీ లీటర్ల తురకవేపాకు రసంలో అంతే సమంగా గేదె పెరుగు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే నొప్పి తగ్గిపోతుంది.

No comments:

Post a Comment