Telugu kIDS Special - PUZZLES, GK, FUN GAMES, STORIES, TIPS




























































































           

కొండ గుహల్లో.. పురుగుల వెలుతురులో...

                      క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్రంలోని హిందూ దేవాలయం చాలా పెద్దది. ఇది వినాయకుడి గుడి. విశాల స్థలంలో నిర్మితమైంది. లోపల చాలా కార్లు పార్కింగ్‌ చేసుకోవచ్చు. వినాయకుడి గర్భగుడి చుట్టూ అనేక మందిరాలున్నాయి. వాటిలో ఆంజనేయస్వామి, వేెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, నరసింహ స్వామి, అయ్యప్ప, లక్ష్మి, సరస్వతి, పార్వతి కుమార స్వామి, శివుడు, రాఘవేంద్ర స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. భారత దేశం నుండి ఆస్ట్రేలియా వచ్చిన వారిలో రకరకాల దేవుళ్ళను ఆరాధించేవారున్నారని కాబోలు ఇలా అనేక దేవుళ్ళను ప్రతిష్టించారు. ఇక్కడి అర్చకులు తమిళనాడు నుండి వచ్చిన వారే. గాలి గోపురం మీద వివిధ విగ్రహాల్ని నిర్మించారు. చక్కని నైపుణ్యంతో నిర్మించిన వీటికి చేయి తిరిగిన చిత్రకారుల చేత రంగులు వేయించారు.
బ్రిస్బేన్‌ దగ్గర్లో వున్న టొంబొరిన్‌ కొండగుహల్లో వెలిగే పురుగుల్ని చూడటం పర్యటనలో ముఖ్య భాగం. వెలిగే పురుగులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అడవుల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ గుహలను 2004లో నిర్మించారు. 2005 నుండి పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. ప్రవేశ రుసుం మాత్రం చాలా ఎక్కువ.

వెలుగులోంచి లోపలికెళ్ళగానే ఒక చీకటి గదిలో ఏడు నిమిషాలు కూర్చోబెట్టి గైడు వివరంగా అన్నీ విశదీకరిస్తాడు. ఆపైన వెలిగే పురుగుల గుహలోకి తీసుకెళ్తాడు. కటిక చీకటి. పురుగులు గోడలకు, సీలింగుకు అంటుకుని నక్షత్రాలుగా వెలుగుతుంటాయి. ఇవి వేల సంఖ్యలో ఉంటాయి. అమావాస్య చీకట్లో నక్షత్రాల వెలుగులా ఉంటుంది. వాటిని తాకినా, వెలుగు అగుపించినా అవి వెలగవు. గైడు ఎర్ర టార్చిలైటుతో వివరిస్తుంటాడు. వీటి ఆహారం కీటకాలు. అడవుల్లో కీటకాల్ని వలల్లో పట్టి తెచ్చి వదులుతుంటారు. సకాలంలో ఆహారం అందకపోతే పెద్ద పురుగులు చిన్న పురుగుల్ని తినేస్తాయి. ఈ పురుగులు లార్వా దశకు వచ్చేసరికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఈ దశలోనే సంవత్సరంపాటు వెలుగుతాయి. ప్యూపా దశలో కొద్ది రోజులే బతికి మరణిస్తాయి. ఆడ పురుగులు ఎక్కువ కాంతిని, మగ పురుగులు తక్కువ కాంతిని ప్రసరిస్తాయి. ఇవి ఆకలితో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా కాంతిని వెదజల్లుతాయి.
వెలుగుకు ఆకర్షింపబడి కీటకాలు ప్రవేశిస్తే వాటిని ఇవి తినేస్తాయి. గుహల్లో ఉన్న ప్రాణవాయువు, ఇతర వాతావరణం కలిసి రసాయనిక ప్రక్రియ జరిగి వెలుగులు పచ్చగా కనపడతాయి. మనం చూడనివి చూస్తే తెలియనివి, తెలిస్తే ఆహ్లాదానికి హద్దులుండవు. ఈ దృశ్యాలు పర్యాటకుల మనసుల్లో చెరిగి పోని ముద్రవేస్తాయి.

మ్యూజియం 
ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండు రాష్ట్రంలో వున్న మ్యూజియం చూడదగినది. ఆస్ట్రేలియా పురాతన చరిత్ర గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కువగా కొండల్లో, గుహల్లో, అరణ్యాల్లో జీవించేవాడు. వీరిని అబారిజినల్స్‌ అంటారు. ప్రదర్శనకు వుంచిన వివిధ వస్తువులు, వాహనాల పరిణామ దశలు మనోవికాసానికి తోడ్పడతాయి.

సోలార్‌ సైకిల్‌
1970లో క్వీన్స్‌ల్యాండు యూనివర్శిటీవారు సోలార్‌ సైకిల్‌ కనిపెట్టారు. దీని పేరు సోలార్‌
టెండమ్‌. దీనిపై నలుగురు ప్రయాణించవచ్చు. సూర్యరశ్మి నుంచి వచ్చిన ఎలక్ట్రికల్‌ ఎనర్జీ నేరుగా వెనుక చక్రానికి బిగించి ఉన్న మోటారుకు వస్తుంది. పెడలు తిప్పగానే మరింత వేగం పుంజుకోవటానికి తోడ్పడుతుంది.

డైనోసార్‌ మ్యూజియం
'డైనోసార్స్‌' మ్యూజియంలో ఉన్న మరో ఆకర్షణ ఇచ్చట ఉంచిన కొన్ని లక్షల సంవత్సరాల కిందట భూమిపై తిరుగాడిన డైనోసార్‌ మహాకాయ అస్థిపంజరం ఎముకలు మనకు అగుపిస్తాయి. ఎంత దగ్గర నుండి చూసినా కనుక్కోలేము. కాని ఊహా జనిత చిత్రాన్ని నిర్మించి రాబోయే తరాల కోసం ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. 

బ్లాక్‌ బెస్‌ సైకిల్‌ 
మరో ముఖ్యమైన ఆకర్షణ ''బ్లాక్‌ బెస్‌'' సైకిల్‌. ఇలాంటి సైకిళ్ళు కూడా ఉండేవా అని ఆశ్చర్యమేస్తుంది. హెరీక్లాక్‌ 1884లో ఈ సైకిల్‌ కనిపెట్టారు. చిన్నప్పటినుండి క్లాక్‌కు సైకిల్‌ ప్రయాణమంటే ఎంతో ప్రీతి. స్కూలు దశలో ఉన్నప్పుడు వారంలో దాదాపు 300 మైళ్ళు ప్రయాణించేవాడు. దీని నిర్మాణమంతా ముందు ఒక పెద్ద చక్రం వెనుక ఒక చిన్న చక్రం. చిన్న చక్రానికి పై భాగాన కూర్చోనే సీటు. పెద్ద చక్రానికి పెడలు. ఇదీ దీని ఆకృతి.

కళ కనికట్టు
మనసును కట్టిపడేసే మరో దృశ్యం. సముద్రపు ఒడ్డున ఇద్దరు పరిశోధకులు తాబేలును పట్టుకుని పరీక్షిస్తూ వుంటారు. తటాలున చూసిన వారికి మ్యూజియం సిబ్బందేమోనని అనిపిస్తుంది. కానీ అది ఓ బొమ్మ. బొమ్మలకు ప్రాణం పొయ్యడమంటే ఇదేనేమో. చూడదగింది మోడరన్‌ ఆర్ట్‌ గ్యాలరీ. ఇక్కడ మోడరన్‌ ఆర్ట్‌ చిత్రాలను ప్రదర్శనకు వుంచారు. జపాన్‌ మోడరన్‌ ఆర్ట్‌లో ముందంజ వేసింది. ఎక్కువగా జపాన్‌ కళాకారుల చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయి. ఆలోచింపజేస్తాయి, ఆనందింపజేస్తాయి. ఒకానొక కళాఖండంలో రెండు దుప్పులను ఒకే దుప్పిగా గాజు, మార్బుల్‌తో శిల్పించటం ఇందులో ప్రత్యేకత.
ఆస్ట్రేలియాలో అక్కడక్కడ రోడ్లకు దరిదాపుల్లోను లోపలి అరణ్యాలలోను కొలనులు ఏర్పడి వుంటాయి. ఇవి ఎడారిలో ఒయాసిస్సుల్లా ఉంటాయి. నీళ్ళు వడగట్టినట్లుగా ... పక్షులు, జంతువులు తాగడానికి ఉపయోగపడతాయి. సేద్యానికి ఉపకరిస్తాయి. ఇవి ఎండిపోవు


మ‌ది దోచే ‘మూవీ వ‌ర‌ల్డ్’

            ఆస్ట్రేలియాలో 'గోల్డ్‌ కోస్ట్‌' ఓ అద్భుత ప్రదేశం. అందులో 'మూవీ వరల్డ్‌' మరింత ప్రత్యేకర. అక్కడి సీ వరల్డ్‌ వింతలు, విశేషాలు వర్ణించడం కష్టమే. సీల్‌ చేపల విన్యాసాలు, స్టంట్‌ డ్రైవింగ్‌ కార్ల పరుగులు, డాల్ఫిన్‌ చేపల జల క్రీడలు, పాటలు, మిక్కీమౌస్‌ వేషగాళ్ల నృత్యాలు...ఒకటా రెండా... అన్నీ సందర్శకులను కట్టిపడేసేవే!

            బ్రిస్బేన్‌ డౌన్‌టౌన్‌లో కేవలం నడకకు అనుమతించిన రోడ్లమీద నడుస్తున్నాం. ఇక్కడ వాహనాల్ని అనుమతించరు. అందరిదీ కాలినడకే. అందమైన రోడ్డు. ఒక పక్క రెస్టారెంట్లు. ఎత్తైన చెట్లు. ఫుట్‌ పాత్‌లకు టైల్స్‌ ఫ్లోరింగు. విశ్రాంతిగా కూర్చోవటానికి బెంచీలు. మరోపక్క మాల్స్‌. సొంపైన సంగీతం వినవచ్చింది. చుట్టూ చూశాను. దారి పక్కన గుమిగూడిన ప్రేక్షక శ్రోతల మధ్య గిటారు వాయిస్తూ గాయకుడు. సంగీత ప్రదర్శన పూర్తైంది. అతని ముందు పరిచిన తెల్లని బట్టపై నాణేలు, నోట్ల వర్షం కురిసింది. వాటిని తీసుకుని అతను వెళ్లిపోయాడు. ఇక్కడ ప్రదర్శన ద్వారాగాని మరో రకంగా గాని యాచించాలంటే ఎవరికిపడితే వారికి స్వేచ్ఛ ఉండదు. తమ కళను లేదా సమస్యను నగర కౌన్సిల్‌ ముందు విన్నవించుకోవాలి. వారు పరీక్షించి ఆమోదించి సర్టిఫికెట్‌ ఇచ్చాకే కార్యక్రమంలోకి దిగాలి.
ఊబకాయం పట్టికలో అమెరికా పక్కన ఆస్ట్రేలియా చేరుతుంది. ఇందులో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. జన్యువుల సంగతి పక్కన పెడితే తినే ఆహారంలో పరిమితి లేకపోవటం వల్ల కూడా జరుగుతుందని అంచనా. ఇరవై ఐదు సంవత్సరాల యువతి ఊబకాయంతో వీల్‌ చైర్లో రావటం చూసిన మాకు మనసు చివుక్కుమంది. ఇక్కడ కాళ్ళు, చేతులు, వీపు, మెడ మీద పెద్దపెద్ద పచ్చబొట్లు పొడిపించుకునేందుకు స్త్రీ, పురుషులిద్దరూ పోటీ పడతారు. కొందరైతే శరీరమంతా పొడిపించుకోవటం వింత అనిపిస్తుంది.
మూవీ వరల్డ్‌
              గోల్డ్‌ కోస్టులో చూడదగింది మూవీ వరల్డ్‌. ఈ సినిమా ప్రపంచం 415 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు భాగాలగా నిర్మించబడింది. దీనిని 1991 లో ప్రారంభించారు. ఒక పక్క కార్ల రేసింగ్‌. మరో పక్క చిన్న పిల్లల మిక్కీమౌస్‌, ఒక పక్క సెట్టింగులు, ఇంకో పక్క వైల్డ్‌ వాటర్‌ ఫాల్స్‌ ఇలా అనేక ప్రోగ్రాములు వుంటాయి.
స్టంట్‌ డ్రైవింగ్‌
            స్టంట్‌ డ్రైవింగ్‌ స్థలం బాగా విశాలంగా ఉంటుంది. ముందుగా రెండు పొడవాటి కార్లు అత్యంత వేగంగా వస్తాయి. ఒకదానికొకటి రెండడుగుల దూరంలో ఇరవై అడుగుల కైవారంలో గిరగిరా తిరుగుతాయి. ఒక దానికొకటి ఎదురుగా ఒకదాని వెంట యింకొకటి ఇలా రకరకాలుగా తిరుగుతాయి. వేగంగా తిరగటం వల్ల దట్టంగా పొగలు వస్తాయి. ఇంతలో ఒక కారు పదిహేను అడుగుల ఎత్తు పైనుండి దూకి వీటి మధ్య తిరిగి వెళ్లిపోతుంది. కుడివైపు రెండు చక్రాలు పైకిలేచి ఎడమవైపు రెండు చక్రాలపై పరుగిడటం, ముందు చక్రాలు లేచి వెనక చక్రాలపై వేగంగా దూసుకుపోవడం లాంటి ప్రయోగాలు ఎన్నో ఈ ప్రదర్శన చూశాక సినిమాల్లో చూసేది చాలా తక్కువ అనిపిస్తుంది.
మిక్కీ మౌస్‌ నృత్యాలు
               జనం గుమిగూడిన ఒక థియేటరు ముందు మిక్కీ మౌస్‌ వేషాలు వేసుకున్న కళాకారులు వచ్చి చిత్ర విచిత్రంగా డాన్సులు చేస్తూ ప్రేక్షకుల్లో కలిసిపోయి పిల్లల్ని ఎత్తుకుంటూ నృత్యం చేస్తూ ఆనందం పంచుతారు. ఇంతవరకు టీవీలో చూసిన బొమ్మలకే పరిమితమైన చిన్నపిల్లలు నిజ జీవితంలో వాళ్ల ముందుకు వచ్చి కలిసి ఆడుతున్నందుకు మరింత కేరింతల్తో కాలం గడుపుతుంటారు.
ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎత్తైన కొండ వుంటుంది. వంద అడుగుల ఎత్తులో ద్వారం ఉంటుంది. పర్యాటకులు ఎక్కిన పడవ అందులోంచి వేగంగా కిందకు దూకుతుంది. అలా దిగిన పడవ నీటి కాలువలో ప్రయాణించి మళ్ళీ కొండెక్కి ద్వారం గుండా కిందకు దూకుతుంది. ఆశ్చర్యంగా వుంటుంది, భయం కలిగిస్తుంది. దీనికి చక్కని రక్షణ ఏర్పాట్లున్నాయి.
అసలు కార్యక్రమమంతా మధ్యాహ్నం మూడున్నర గంటలకు. ఉదయం నుండి ప్రదర్శించబడిన మిక్కీమౌస్‌, లూనీటూన్స్‌, బ్యాట్‌మేన్‌, స్పైడర్‌ మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌లు ఏకంగా బారులు తీరి కూర్చున్న పర్యాటకుల మధ్యకు వచ్చి హావభావాలు ప్రదర్శించి సెలవు తీసుకోవటం సందర్శకులకు మరుపురాని సన్నివేశం. మదిలో గూడుకట్టుకునే సంఘటన.
డాల్ఫిన్ల ఆటలు... పాటలు...
             అక్కడక్కడా సినిమా సెట్టింగుల భవనాలు, గుడిసెలు ఉన్నాయి. చక్కటి నైపుణ్యంతో నిర్మించిన గుడిసెలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. దీనికి నిర్వాహకులు హాలీవుడ్‌ అని పేరు పెట్టి సార్థకం చెయ్యటం అభినందనీయం. మనసుకు ఆహ్లాదం కలిగించే శక్తి సముద్రానికి వుంటుంది. అలాంటి సముద్రం థీమ్‌తో చేసినదే 'సీ వరల్డ్‌'. ఇది 1958లో ప్రారంభించడింది. ఇక్కడ సీల్‌ చేపలు ఎన్ని ఆటలు ఆడవచ్చో అన్ని ఆడ్తాయి. ఈ ఆటలన్నీ మనిషే ఆడిస్తాడు. డాల్ఫిన్‌ల విన్యాసాలు మనిషితో పోటీ పడతాయి. కొలను ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెల్లికిలా, బోర్లా పక్కకు తిరిగి నలభై మైళ్ళ వేగంతో ఈత గొడతాయి. నీటిలోంచి దాదాపు పది అడుగుల ఎత్తుగా లేచి నూట నలభై డిగ్రీల్లో శరీరాన్ని చుట్టూ కదుపుతూ కిందకు దూకుతాయి. మనుషులు రెండు డాల్ఫిన్ల వీపులపై కాళ్ళు మోపి గుర్రపు స్వారీ చేస్తారు. ఐదు డాల్ఫిన్‌లు ఒక్కసారి ఒకే డిగ్రీలో వంగి గింగరాలు తిరిగి నీళ్ళలోకి దూకుతాయి. ఇక్కడ విశేషమేమంటే ఒక్కో డాల్ఫిన్‌ ఒక్కో క్రీడను నిర్వహించాక, కార్యక్రమం నడుపుతున్న వ్యక్తి తన నడుముకున్న సంచి లోంచి ఒక్కో చేప పిల్లను డాల్ఫిన్‌ నోటికి అందిస్తుంటాడు. ఈ కార్యక్రమంలో అవ్వ, అమ్మ, బిడ్డ ఇలా మూడు తరాల డాల్ఫిన్లు వున్నాయని తెలిసింది. ఈ వింతను చూసి బయట పడకముందే మరో చోట సీల్‌ చేపలు చేసే వింతలు అన్ని ఇన్నీ కాదు.ఈ కార్యక్రమం కథలాగా సాగుతుంది. ఒక వ్యాపారి దొంగతనంగా చేపలు పట్టి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని చాకచక్యంగా పట్టుకోవడమే ఈ కథ. దీన్ని రక్తి కట్టించటానికి సీల్‌ చేపలు ముఖ్య పాత్రలు పోషిస్తాయి. నవ్వమంటే నవ్వుతాయి. ముద్దు పెట్టమంటే పెడతాయి. తొడకొట్టమంటే కొడతాయి. పాడమంటే పాడతాయి. ఆవు గొంతులా వుంటుంది. అన్నీ చూశాక నటనలో మనుషులతో పోటీ పడితే సీల్‌ చేపలు ప్రథమ బహుమతి పొందుతాయనడంలో సందేహం లేదు. చివరగా 'ది ఎండ్‌ బోర్డు' సీల్‌ చేప మెడకు తగిలించుకుని ప్రేక్షకుల ముందు నిలబడి వీడ్కోలు చెబుతుంది. అప్పుడు చూడాలి పర్యాటకుల ఆనందం చప్పట్లు మిన్నంటుతాయి.
జెట్‌ బోట్‌ విన్యాసాలు
ఇకపోతే ఆ పక్కనే జరిగే జెట్‌ బోటు విన్యాసాలు అద్భుతం. నాలుగు జెట్‌ బోట్లు నూరు మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తాయి. ఒక్కసారి ఆకాశంలోకి పదిహేను అడుగుల ఎత్తుకు లేచి మూడుసార్లు పొర్లు దండాలు పెట్టి నీటిపై వాలతాయి. అతివేగంగా వచ్చి ఢ కొట్టబోయే సమయంలో అత్యంత చాకచక్యంగా పక్కకు వాలటం చూసి ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది.
ఆస్ట్రేలియా వాసులకు నీళ్ళను చూస్తే చెప్పలేని ఆనందం. ఈత కొట్టాలని, చేపలు పట్టాల ని, వాహ్యాళికి వెళ్ళాలని, ప్రయాణం చెయ్యాల ని. బ్రిస్బేన్‌ నదిపై కిలోమీటరుకు ఒక వంతెన కట్టబడింది. అన్నీ పడవలు ప్రయాణించ టానికి అనువుగా ఉంటాయి. సిటీ క్యాట్‌, సిటీ కూపర్‌ పేరుతో సిటీ బస్సుల్లా పడవలు స్టేజి స్టేజికి తిరిగి ప్రయాణీకుల్ని చేరవేస్తుంటాయి.

అరేబియా సముద్రరాణి

Posted On Sat 13 Jun 01:31:07.875052 2015
                  హాయిగొలిపే సముద్రపు పిల్లగాలులు, సుగంధ ద్రవ్య పరిమళాలు, భిన్న సంస్కృతుల కలబోత ఆ నగర విశిష్టత. ప్రపంచంలోనే ముఖ్యమైన అది పెద్ద నౌకాశ్రయంగా దీనికి పేరుంది. ఒకప్పుడు ఈ నగరాన్ని పోర్చుగీసువారు, తర్వాత డచ్‌వారు ఏలారు. అదే కేరళలోని కొచ్చి నగరం. ఆ నగర విశేషాలు...
          కేరళరాష్ట్ర రాజధాని తిరువనంతపురమైనా వ్యాపార వాణిజ్యాల రాజధానిగా పేరు తెచ్చుకుంది మాత్రం కొచ్చి నగరం. భారతదేశంలోని అందమైన పర్యాటక స్థలాల్లో ఇదొకటి. అంతేకాదు ప్రపంచంలోనే ముఖ్యమైన, పెద్ద నౌకాశ్రయం ఇది. ఎందుకంటే భూ, సముద్ర, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యం ఉన్న అతికొద్ది నౌకాశ్రయాల్లో ఇదొకటి. అందుకే ఈ నగరాన్ని 'అరేబియా సముద్ర రాణి' అంటారు.
ఆ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వ్యాపార వాణిజ్యాలు చేయాలని చైనా, అరబ్బు దేశాల వారు ఉవ్విళ్లూరారు. యూరోపియన్‌ దేశస్తులు ఏకంగా ఆ నగరాన్ని తమ సొంతం చేసుకున్నారు. వెనిస్‌ దేశస్థులు సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిరాటంకంగా సాగించారు. వీరందరికీ ఆ నగరమంటే ఎందుకంత ఇష్టమంటే... ఏ దేశంతోనైనా సత్సంబంధాలు చేయడానికి వీలైన నౌకాశ్రయం అక్కడ వుండడమే. ఇన్ని దేశాల సంస్కృతులు అక్కడ ఏళ్ల తరబడి ఉన్నాయి. అందుకే ఆ నగర వీధుల్లో ఇప్పటికీ ఆయా సంస్కృతుల పరిమళం గుబాళిస్తుంది. ప్రకృతి సౌందర్యం పర్యాటకులనే కాదు, నిత్యం అక్కడుండే స్థానికులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.
చరిత్ర పుటల్లో కొచ్చి...
క్రీ.శ.1498లో వాస్కోడిగామా తన వ్యాపార స్థావరంగా కేరళలోని కాలికట్‌ తీరాన్ని ఎంచుకున్నాడు. తర్వాతికాలంలో ఇక్కడే స్థిరపడ్డాడు. మరో రేండేళ్లకు పోర్చుగీసువారు వచ్చి కొచ్చి మహారాజు అనుమతితో స్థిర నివాసం నిర్మించుకున్నారు. 1662-63 ప్రాంతంలో పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గి ఆ ప్రాంతం డచ్చివారి అధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత బ్రిటీష్‌ పాలనలోకి వచ్చింది. అందుకే ఇప్పటికీ యూరోపియన్‌ సంస్కృతిని చాటి చెప్పే రాజప్రాసాదాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి.
అతి ప్రాచీన చరిత్ర కలిగిన కొచ్చి నగరాన్ని పాత కొత్తల మేలుకలయికగా అభివర్ణించొచ్చు. ఫోర్ట్‌ కొచ్చి, మట్టన్‌చెరి, ఎర్నాకులం, ఎడపల్లి, వెల్లింగ్‌టన్‌, తేవర, నైటిల్ల తదితర ద్పీపాలన్నీ కలిసి కొచ్చి నగరంగా ఏర్పడ్డాయి. ఈ ద్వీపాలన్నింటినీ వంతెనల ద్వారా కలిపారు.
సందర్శనీయం...
మెరైన్‌ డ్రైవ్‌లోని బోట్‌జెట్టీ నుండి కేరళ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కేటీడీసీ) బోట్లలో మట్టన్‌చెరి, పోర్ట్‌ కొచ్చిలకు వెళ్లొచ్చు. సముద్ర కాలువల (బ్యాక్‌వాటర్స్‌)లో ఈ పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఎర్నాకుళంలోని అత్యంత ఆధునిక ఆకాశ హార్మ్యాలు, ఇంకొక వైపు బోల్‌ఘట్టీ, పోర్ట్‌కొచ్చి, మట్టన్‌చెరి దీవులు, మరోవైపు కొచ్చి నౌకాశ్రయంలో నిలిచి ఉన్న పెద్ద నౌకలు... ఇలా ఎటు చూసినా అద్భుతమైన దృశ్యాలే కనిపిస్తాయి.
ఫోర్ట్‌కొచ్చిలో రెండంతస్తుల అందమైన డచ్‌ ప్యాలెస్‌ ఉంది. దీన్ని పోర్చుగీసు వారు నిర్మించారు. తర్వాత వచ్చిన డచ్‌వారు దీనికి ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొచ్చి మహారాజుకు కానుకగా ఇచ్చారుట. అందుకేనేమో దీన్ని డచ్‌ ప్యాలెస్‌ అనే పిలుస్తుంటారు. ఈ కోట గోడలపై చిత్రించిన రామాయణ, మహాభారతాలకు సంబంధించిన చిత్రాలను చూసి తీరవలసిందే.
యూరోపియన్లు మనదేశంలో నిర్మించిన అతి పురాతన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి కూడా ఇక్కడే ఉంది. వాస్కోడిగామా కొచ్చిలోనే మరణిస్తే, ఆయన మృత దేహాన్ని ఈ చర్చిలోనే సమాధి చేశారు. తర్వాత చాలా కాలానికి ఆయన అస్థికలను పోర్చుగల్‌కు తీసుకెళ్లారని చెప్తుంటారు. అయితే సమాధి ప్రదేశాన్ని ఇప్పుడూ చూడొచ్చు.
చూడాల్సిన ప్రదేశాల్లో మరోటి జ్యూయిష్‌ సినగోగ్‌. ఇది యూదుల ప్రార్థనా మందిరం. ప్రపంచంలోనే అతి పురాతనమైనదట. ఈ మందిరం ప్రత్యేకత ఏంటంటే... చేత్తో పెయింట్‌ చేసిన కొన్ని వందల చైనీస్‌ టైల్స్‌ను నేలమీద పరిచారు. వీటిలో ఏ రెండు చిత్రాలూ ఒకేలా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా వీటి మెరుపు కూడా చెక్కుచెదరలేదు.
ఇక్కడున్న బీచ్‌ చిన్నదైనా అందంగా ఉంటుంది. బీచ్‌ పక్కన యూరోపియన్‌ సంస్కృతిని ప్రతిబింబించే పురాతన భవంతులు కనిపిస్తాయి. బ్యాక్‌ వాటర్స్‌ పక్కనే ఉన్న చైనీస్‌ ఫిషర్‌నెట్స్‌ కొచ్చికే ప్రత్యేకం. చైనాలో తప్ప మరెక్కగా కనిపించని ఈ వలలు ఇక్కడ కనిపిస్తాయి. స్థానికులు వీటితోనే చేపలు పడతారు.
సూర్యాస్తమయమయ్యేసరికి పడవలను సముద్రం ఒడ్డుకి తీసుకువచ్చి ఆపుతారు. ఆ సమయంలో సముద్రం అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు... సముద్రం, ఆకాశం కలిసినట్లుండే ప్రదేశంలో బంగారు కాంతులతో మెరిసిపోయే సాగరశోభలను చూడాల్సిందే. ఆ సమయంలో సముద్రంలో ఎగిరిపడే డాల్ఫిన్లను చూడడం అపురూప దృశ్యం.
కొచ్చి నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో త్రిపునితురలోని సువిశాల మైదానంలో హిల్‌ ప్యాలెస్‌ ఉంది. ఇది కొచ్చి మహారాజుల నివాస గృహం. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇందులో రాజవంశీయుల రథాలు, యుద్ధ సామగ్రి, దుస్తుల వంటివి చూడొచ్చు. ఆ రాజవంశానికి చెందిన రాజా రవివర్మ చిత్రించిన వర్ణచిత్రాలు కూడా ఇక్కడు న్నాయి. మనసును కట్టిపడేసేలా, జీవకళ తొణకి సలాడే ఆ చిత్రాలను ఇష్టపడనివారు ఉండరేమో.
సముద్రపు కాలువల్లోని బోల్‌ఘట్టీ అందమైన చిన్న ద్వీపం. ఇక్కడ డచ్‌వారు నిర్మించిన కోట ఉంది. ప్రస్తుతం దీన్ని హోటల్‌గా మార్చారు.
కొచ్చి చుట్టుపక్కల వేగా, ల్యాండ్‌, డ్రీమ్‌ వరల్డ్‌, సిల్వర్‌ స్టార్మ్‌, ఫాంటసీ పార్క్‌ తదితర వాటర్‌ థీమ్‌ పార్కులున్నాయి. ఇవన్నీ పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి.
వెనిస్‌ ఆఫ్‌ ఇండియా
కొచ్చికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అలెప్పీ ఉంది. దీన్ని 'వెనిస్‌ ఆఫ్‌ ఇండియా'గా పిలుస్తారు. ఇక్కడ వెంబానద్‌ సరస్సులో నిర్వహించే పడవ పందేలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కేరళ అందాలను తనివితీరా చూడాలంటే, ఇక్కడి నుంచి కొచ్చికి బ్యాక్‌ వాటర్స్‌లో పడవ ప్రయాణం చేయాల్సిందే.
తెక్కడిలోని ప్రసిద్ధిగాంచిన పెరియార్‌ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరీకి కొచ్చి నుండి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. ఏప్రిల్‌, మే నెలల్లో ఇక్కడ త్రిసూర్‌ పూరమ్‌ ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి.
ఇక్కడికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో మున్నార్‌ హిల్‌ రిసార్ట్‌ ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తేయాకు, యాలకుల తోటలు కనిపిస్తాయి. భూమాతకు చిలకపచ్చ చీర కట్టినట్లుండే ఈ ప్రాంతం పర్యాటకుల్ని వేరే లోకంలో విహరిస్తున్నామన్న భ్రమ కలిగిస్తుంది.
సరసమైన ధరలకే....
షాపింగ్‌ మాల్‌ ప్రియులకు కొచ్చి కచ్చితంగా నచ్చి తీరుతుంది. పర్యటన గుర్తుగా కొనడానకి ఎన్నో హస్తకళాఖండాలు లభిస్తాయి. కథాకళి మాస్క్‌లు, పడవల వాల్‌ హ్యాంగింగ్స్‌, కేరళ సంప్రదాయ చీరలు... ఇలా ఇంకెన్నో వస్తువులు ఆకర్షిస్తాయి. ముఖ్యమైన మరో విశేషమేమంటే ఇక్కడ బంగారు ఆభరణాలు మనం ఊహించనన్ని వెరైటీల్లో దొరుకుతాయి. నాలుగైదు అంతస్తులుగా ఉండే బంగారు షాపులు కనిపిస్తాయి. ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన నగలుంటాయి. ఒక అంతస్తులో రాళ్ల నగలూ, ఒక అంతస్తులో పిల్లలకూ, ఒక అంతస్తులో పెద్దలకీ... ఇలా అన్నమాట.
అక్కడి ఆప్యాయతలు, పండుగలు, సముద్ర గాలులు, కొబ్బరి తోటలు, పడవ షికార్లు, గర్జించే మేఘాలు... అన్నీ పర్యాటకుల మదిలో చెక్కుచెదరని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందమైన ఆ అనుభూతుల్ని ఎన్నిసార్లు నెమరువేసుకున్నా తనివి తీరదు.
కొచ్చికి వెళ్తే అక్కడి వంటలైన పాలడ ప్రథమన్‌ (ఒక రకమైన పాల పాయసం), అరటి, పనస చిప్స్‌, కేరళ హల్వా, ఫళంపురి, అప్పం, ఆడియాపం, కేరళ పరాటాలను తప్పక రుచి చూడాల్సిందే.
కేరళ రాష్ట్రం సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, శొంఠి తదితరాలన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. నాణ్యత కూడా బావుంటుంది.
కొచ్చిలో అందరికీ అందుబాటులో ఉండే హోటళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి కొచ్చికి దాదాపు 25 గంటల ప్రయాణం. అక్టోబర్‌ నుండి మే నెల వరకు పర్యటనకు అనువైన సమయం. అయితే ఓనం, క్రిస్‌మస్‌ సమయాల్లో వెళ్తే అక్కడి ఆచార వ్యవహారాలు చూడ్డానికి వీలవుతుంది. కేరళవాసుల ఆచారాలు, వేషభాషలు, ఆహా రపు అల వాట్లు, పండు గలు భిన్నంగా ఉంటా యి కనక సందర్శ కులకు కన్నుల పండుగే.






No comments:

Post a Comment