Wednesday 6 May 2015

Telugu tips for growing plants in home

మొక్కల సంరక్షణ ఇలా.. 

ఎంతో ఖర్చు పెట్టి నర్సరీల నుంచి పూల మొక్కలు ఎండిపోతుంటే ఎవరికైనా బాధనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకు మొక్కలు చనిపోతున్నాయో అర్థం కాదు. నిజానికి మొక్కలు చనిపోవడానికి కారణం మనం చేసే తప్పులే అని చెప్పొచ్చు. మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చదవండి.
చాలామంది నర్సరీల నుంచి పూల మొక్కలు తీసుకురావడమే ఆలస్యం కుండీలలో నాటతారు. కుండీ ఎలా ఉందనే విషయాన్ని పట్టించుకోరు. కుండీలో మొక్కను నాటే ముందు దాని అడుగు భాగాన చిన్న రంధ్రం ఉండేలా చూసుకోవాలి. కుండీలో మట్టిని గట్టిగా అదమకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి.
కుండీలోని మొక్కను నాటేటప్పుడు వేర్లు పూర్తిగా మట్టిలో కూరుకునేలా పెట్టాలి. మొక్కను నాటిన అనంతరం చాలామంది కుండీ నిండా నీరు పోస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎక్కువ, తక్కువ కాకుండా
మధ్యస్తంగానీరు పోయాలి.
కుండీలో నీరు ఎప్పుడూ నిలవకుండా చూసుకోవాలి. కుండీ అడుగుభాగాన రంధ్రం నుంచి నీరు వెళ్లిపోయేలా ఉండాలి. నీరు నిలిచిపోతే మొక్క చనిపోయే ప్రమాదముంటుంది.
మొక్కలు చిగురించాలంటే సూర్యరశ్మి తప్పనిసరి. మొక్కపై సూర్యరశ్మి పడకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కలపై ఎండ పడేలా చూసుకోవాలి. మొక్క అన్ని వైపులా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. వారం పదిరోజుల కొకసారి కుండీని తిప్పి మరోవైపు కూడా ఎండ తగిలేలా చూసుకోవాలి.
ఇండోర్‌ ప్లాంట్ల కుండీలలో వాడేసిన టీ, కాఫీ పొడిని వేస్తుంటారు. కొంతమంది కోడిగుడ్డు పెంకులు, వార్చిన గంజి... ఇలా ఏది పడితే అది వేస్తుంటారు. టీ, కాఫీ పొడి వేయడం వల్ల నష్టం ఉండదు కానీ, గంజి పోయడం వల్ల కుండీలోని మట్టి పైభాగం బిగుసుకుపోయి గట్టి పొరగా ఏర్పడుతుంది. ఫలితంగా మట్టిలో ఉండే రంరఽధాలు మూసుకుపోతాయి. దీంతో మొక్క వేర్లకు ఆక్సిజన్‌ అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఎదుగుదల క్షీణించి మొక్క కొన్ని రోజులకు చనిపోయే అవకాశం ఉంటుంది.
మొక్కల ఆకులపై ఎలాంటి రంగుల మరకలు పడకుండా చూసుకోవాలి. మొక్క కాండానికి కూడా రంగులు వేయకూడదు. రంగులు వేయడం వల్ల రంధ్రాలు మూసుకుపోయి ఆక్సిజన్‌ను గ్రహించలేకపోతాయి.
అందం కోసం హాల్లో మొక్కల కుండీలు పెడుతుంటారు. మరికొందరు నీటిలో పెరిగే మొక్కలను కూడా ఇంట్లోని గదుల్లో అమర్చుకుంటారు. కానీ ఇది మంచిది కాదు. మొక్కలకు సూర్యరశ్మి తగలటం చాలా అవసరం. అసలు నర్సరీలలో మొక్కలు కొనేటప్పుడే అవి ఎండలో పెరిగేవా? నీడలో పెరిగేవా? అన్న విషయం అడిగి
తెలుసుకోవాలి.
పూల మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా వ్యాధుల బారిన పడడం సహజం. మొక్కలకు తామరపురుగులు ఆశిస్తే మొక్కల లేత ఆకులు ముడుచుకుపోతాయి. మొగ్గలు కూడా సరిగా విచ్చుకోవు, పూలు పెద్దగా కనిపించవు. కాబట్టి విధిగా పెస్టిసైడ్స్‌ పిచికారీ చేయాలి. అయితే మోతాదు మించకుండా చూసుకోవాలి.
పెస్టిసైడ్స్‌ ఉపయోగించడం ఇష్టం లేని వారు వేప గింజలను పొడిగా చేసి చల్లినా ప్రయోజనం ఉంటుంది. ఇతర సేంద్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా కూడా కీటకాలు దరిచేరకుండా చూసుకోవచ్చు.
వ్యక్తిగత గృహాలు ఉన్న వారు ఇంటి ప్రహరీ గోడను ఆనుకొని పీచువేర్లు ఉండే మొక్కలను పెంచుకోవచ్చు. వెరిగేటెడ్‌ మందార, క్లోరోడెండ్రాన్‌, డ్యూరాంటీ, ఎరాంతిమమ్‌ వంటి మొక్కలు పెంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది

No comments:

Post a Comment