Tuesday 12 May 2015

Indriya nigraham


ఇంద్రియ నిగ్రహం


మానవుడు మోక్ష మార్గం పొందాలంటే స్థిరచిత్తం ఉండాలి. మామూలుగానే మనస్సు పరిపరి విధాలపోతూ ఉంటుంది. ఎన్నో కోరికలు మనస్సును అనేక విధాలుగా అన్నివైపులకి లాగుతూ ఉంటాయి. పరీక్షకు చదువుకోవాల్సిన విద్యార్థి మనస్సు చలనచిత్రం వైపు పోతుంది. వంట చెయ్యవలసిన గృహిణి హృదయం టీవీలోని సీరియల్‌వైపు మొగ్గుతుంది. ఆఫీసులో ఫైలు చూడకుండా ఉద్యోగి క్రికెట్ స్కోర్ గురించి ఆలోచిస్తాడు. లౌకికమైన విషయాల పట్ల ఫలితం వెంటనే కనిపిస్తుంది. అటువంటి సాధారణ లౌకిక విషయాలపైనే ఏకాగ్రత సాధించడం కష్టమైనప్పుడు పరమాత్మపై ధ్యానం సులభసాధ్యమా?
ఒకవేళ ఎవరైనా మోక్ష సాధనకై ప్రయత్నించాలనుకున్నా వారికి అనేకులు అనేక రకాలైన బోధలు చేస్తారు. ఈ మార్గంలో వెడితేనే, ఈ రూపంలో భగవంతుని ఆరాధిస్తేనే మోక్షం లభిస్తుందని చెప్తారు. ఇటువంటివి అనేక విషయాలు వినటంవల్ల మనస్సు కలత చెందుతుంది. ఆ పరిస్థితిని పరిహరించమని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా సకల మానవాళికి సందేశమిచ్చాడు.
‘శ్రుతి విప్రతిపన్నాతే, యదాస్థాస్యతి నిశ్చలా, సమాధావచలాబుద్ధి స్తదా యోగమవాప్స్యసి (2-53) నానావిధాలైన వాదాలు విని ఉండటంవల్ల కలత చెందిన నీ మనస్సు ఎప్పుడు చలించకుండా పరమాత్మ ధ్యానంలో స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలవు. అనేక రకాలైన మాటలు వినటంవల్ల ఏది నిజమో తెలియక మనస్సు పరిపరి విధాలుగాపోతుంది.
ఆ పరిస్థితిలో ఆ మాటలన్నింటిని మరిచిపోయి, ఇహలోక విషయాలపై ఆసక్తిని వదిలి, పరమాత్మ ధ్యానంలో మనస్సును స్థిరంగా ఉంచితే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ స్థితినే యోగమంటారు. యోగమన్న మాటకు ఐక్యమని అర్థం. జీవాత్మ పరమాత్మలో కలియడమే యోగం.
ఉప్పునీటిలో కరిగినట్లు ఆత్మపరమాత్మలో ఐక్యమైననాడు శాంతినీ, పరమానందాన్ని పొందగలుగుతాము. చిత్తం చాపలంగా ఉంటే ధ్యానం సాధ్యంకాదు. యోగ స్థితి లభించదు. సూదిలోకి దారం ఎక్కించాలంటే చెయ్యి వణక కూడదు. దారం కొన సన్నగా ఉండాలి. అదే విధంగా ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం ఉంటేనే మనస్సు ఆత్మలోకి ప్రవేశిస్తుంది.
ప్రతి జీవి యొక్క లక్ష్మమూ మోక్షసాధన మాత్రమే. ఆ విషయాన్ని మర్చిపోయి మానవులు ఆహార నిద్రా మైథునాల గురించీ, ఇతర భోగాల గురించీ, వస్తు సముదాయార్జన గురించీ ఆలోచిస్తారు. అలాకాకుండా మనస్సుని భగవంతుడిపై నిశ్చలంగా లగ్నంచేస్తే మోక్షం సాధించగలం. మోక్షం సాధించినప్పుడే మానవజన్మకు సార్థకం చేకూరుతుంది.
మనసును భగవంతుని కథలు వినడంపైమళ్లిస్తే మెల్లమెల్లగా మనసు వాటి రుచి తెలుసుకొంటుంది. ఆ తర్వాత భగవంతుని పై ఆసక్తిని ఏర్పరుచుకుంటుంది. భగవంతుని గురించి ఆలోచనలు పెంచుకుంటుంది. క్షణమైన ఆలస్యం లేకుండా ఆలోచించే మనస్సు వివిధ పనులను చేసిన చేస్తున్న భగవంతుని కథామృతంలోని మర్మంగురించి బాగా ఆలోచన చేస్తుంటుంది. ఇదే అదునుగా మనిషి తన జన్మను సార్థకం చేసుకోవడానికి మనస్సును స్థిరంగా భగవంతునిపైనే నిలపడానికి తన ప్రయత్నం తాను మొదలుపెడ్తాడు. ఆ తరవాత భగవంతుని కృప తోడు అవుతుంది. ఆ తర్వాత ఏకాగ్రత నిలుస్తుంది. అన్యం ఆలోచించేమనసుకు నిజమేదో తెలుస్తుంది ఇక ఎపుడూ శాశ్వతమైనది, ఆనందకరమైనది అయన భగవంతుని తత్వాన్ని ఆకళింపుచేసుకొనే స్థాయని పొందుతుంది.

No comments:

Post a Comment