Sunday, 26 October 2014

నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిద్రలేమి!

సర్వశరీరగతంగా వ్యాపించిన కండరాల నొప్పిని ఫైబ్రోమైయాల్జియా అంటారు. నొప్పి కండరాల్లోనూ, మెత్తని కణజాల సముదాయాల్లోనూ నిగూఢంగా ఉంటుంది. కటి ప్రదేశానికి ఎగువన, దిగువన, శరీరానికి ఇరుపక్కలా కేంద్రీకృతమై ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యాధి కాదు కొన్ని లక్షణాల సమూహం. అందుకే దీనిని సిండ్రోమ్ అంటారు. స్పష్టమైన కారణాలు తెలియని సమస్య ఇది. ఈ స్థితి ప్రాప్తించినవారిలో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. నరాలు, మెదడు, వెన్నుపాముకు చేరే సంకేతాలు సక్రమంగా తర్జుమా కావు. దీంతో కండరాలు, జాయింట్లు, మెత్తటి కణజాలాల్లో జరిగే మామూలు మార్పులను మెదడు నొప్పిని అన్వయించుకుంటుంది. అందుకే ఫైబ్రోమైయాల్జియా కలిగిన వ్యక్తుల్లో శరీరంమీద గాయాలు, దెబ్బలూ వంటివి లేకపోయినప్పటికీ నొప్పులతో ఇబ్బందిపడుతుంటారు.
ఫైబ్రోమైయాల్జియా అనే పదం ల్యా టిన్ నుంచి వచ్చింది. ఫైబ్రస్ అంటే గట్టి నార వంటి కణజాలమని అర్థం. మయో అంటే కండరాలకు సంబంధించినది అని అర్థం. ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. కండరాలు, సంధాయక కణజాలాల్లో నొప్పి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని ఫైబ్రోమైయాల్జియాగా వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ అధ్యయనకారులు కొన్ని అంశాలను కారణాలుగా ప్రతిపాదిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతావారిలో కూడా కనిపించవచ్చు. ఇలా ముఖ్యంగా మహిళల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సమూహాన్ని 1980 నుంచి ఒక వైద్యపరమైన సమస్యగా వైద్యలోకం పరిగణించటం మొదలుపెట్టింది. పైబ్రోమైయాల్జియాకు దారితీసే కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం.
మెదడులోను, వెన్నుపాములోనూ ఉండే నరాల కణజాలం బాగా సున్నితంగా మారటం వల్లగానీ, లేదా నాడీ వ్యవస్థలో తయారయ్యే రసాయనాల మొత్తాల్లో మార్పులు చోటుచేసుకోవటంవల్లగానీ నరాల కణజాలం అత్యధికంగా స్పందిస్తుంది. దీంతో చిన్నపాటి కారణానికే, కొద్దిపాటి మార్పుకే శరీరం నొప్పిని పసిగడుతుంది. మానసిక ప్రవర్తన (మూడ్)ని నియంత్రించే మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావటంవల్ల నొప్పిని తట్టుకునే తత్వం తగ్గిపోతుంది. దీంతో నిద్రలో విశ్రాంతి లభించకపోవటం, నిస్త్రాణ వంటివి కలుగుతాయి. దీని తరువాత బాధితుల శారీరక చైతన్యం తగ్గిపోతుంది. కండరాల్లోను, కణజాలాల్లోనూ ఫ్లూజ్వరంలో మాదిరిగా అకారణంగా నొప్పిగా అనిపిస్తుంటుంది.
కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్ల విడుదలను మెదడులోని పిట్యూటరి గ్రంథి, హైపోథెలామస్ అనే భాగాలు నియంత్రిస్తుంటాయి. ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి లోనైనవారిలో ఈ హార్మోన్ల విడుదలలో తేడాలు చోటుచేసుకుంటాయి. వీటి తయారీలో సంభవించిన అసమతుల్యత కారణంగా నిస్త్రాణ, ప్రవర్తనలో మార్పులు, విషయగ్రహణ శక్తితగ్గటం, మనసును లగ్నం చేయలేకపోవటం, నొప్పిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నిద్రలో గాఢనిద్ర స్థితిని పొందలేకపోవటం ఈ వ్యాధికి మరో కారణం. గ్రోత్ హార్మోన్ వంటి పదార్థాలు గాఢ నిద్రలో విడుదలవుతుంటాయి. నిద్రచెదిరినప్పుడు ఈ హార్మోన్ల విడుదలకు అంతరాయం ఏర్పడుతుంది. నిద్ర చెడిపోవటం అనేది ఫైబ్రోమైయాల్జియా వ్యాధిలో ఒక లక్షణంగానూ, ఒక కారణంగాను పరిణమిస్తుంది. చాలామంది ఫైబ్రోమైయాల్జియా లక్షణాలను ఇతర వ్యాధిస్థితులకు ఆపాదించుకుంటారు. ఫ్లూజ్వరం, దెబ్బలు తగలటం, శస్తచ్రికిత్స దుష్ఫలితాలు, మనోభిఘాతం, ఒత్తిడి. ఇలాంటివాటి కారణంగా ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. మరికొంతమంది ఈ వ్యాధి లక్షణాలను ‘వేడి చేయటం’గా అభివర్ణిస్తుంటారు.
లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకో తీవ్రతతో, ఒకో పద్ధతిలో వ్యక్తమవుతాయి. ముఖ్యంగా నడుము పైభాగంలోనూ, అలాగే నడుము దిగువ భాగంలోనూ నొప్పి ఏకకాలంలో కనిపిస్తుందని చెబుతుంటారు. అలాగే నొప్పి, శరీరంలో కుడి ఎడమ భాగాల్లో ఒకే స్థాయిలో కనిపిస్తుందని చెపుతుంటారు. ప్రధానంగా మొండెం, మెడ, నడుము, తుంటి భాగం, భుజాలు... ఈ భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హస్తపాదాల్లో అంతగా ఉండదు. నొప్పి అస్పష్టంగా మొదలై క్రమంగా తీవ్రతరమవుతుంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలు అనేక ఇతర వ్యాధుల్లో కనిపిస్తాయి. కనుక ఇతర వ్యాధుల ఉనికిని పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫైబ్రోమైయాల్జియాతోపాటు ఇతర వ్యాధులు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. *

కొవ్వు తగ్గితే గుండెకు హాయ..

గుండెపోటు ఎవరికైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడ ఎలా వున్నా రావచ్చు. గుండెకు రక్తసరఫరా చేసే నాళాలు మూడు. వాటిని కరోనరి ఆర్టెరీస్ అంటారు. వీటిల్లో అడ్డంకులు వస్తే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా అందదు. కార్డియక్ అరెస్ట్ సంభవించి గుండె కండరాలు నీరసిస్తాయ. లేకపోతే గుండెపోటు రావొచ్చు.
మన దేశంలో మరణాలలో ఎక్కువ శాతం గుండెపోటు కారణానే జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలలో వాళ్లకన్నా పది సంవత్సరాల ముందే మన దేశంలో గుండెపోటులొస్తున్నాయి.
హార్ట్ ఎటాక్ వస్తే ఏం జరుగుతుంది?
గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని శరీరంలోని భాగాలన్నింటికి చేరేలా పంప్ చేస్తుంది. రక్తప్రసరణకి ముఖ్య రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని ప్రాంతాలకి వెళ్తుంటే, వాటినుంచి శాఖోపశాఖలు చీలి శరీరంలోని అన్ని అవయవాలకూ చేరుతుంటుంది. ఒక్కో అవయవానికి ఒక్కో నాళం ద్వారా రక్తసరఫరా జరుగుతూంటుంది. గుండె కరోనరి, ఆర్టెరి మూడు శాఖలుగా చీలి రక్త సరఫరా జరిగేలా చూస్తుంటుంది. ఏ భాగాలకు రక్తసరఫరా తగ్గినా ఆక్సిజన్ ఆహారం సరిగా లభ్యంకాక బాధపడుతుంటారు. గుండెకి రక్తసరఫరా తగ్గినా అంతే! గుండె చాలా ముఖ్యమైన అవయవం. రక్తాన్ని ‘లబ్ - డబ్’ అని కొట్టుకుంటూ అన్ని అవయవాలకు ప్రసరింపజేసి, కార్బన్‌డయాక్సైడ్‌తో కూడిన రక్తాన్ని వెనక్కి తెచ్చుకుని ఊపిరితిత్తులలోకి పంపి, కార్బన్‌డయాక్సైడ్‌ని బయటకు పంపి, ఆక్సిజన్‌ని రక్తం ద్వారా తీసుకుని మళ్లీ అన్ని అవయవాలకు పంపుతుంటుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాలలో గోడలమీద పేరుకుపోవడం జరుగుతుంది. అలా పేరుకుంటున్న కొలెస్ట్రాల్ పదార్థం రక్తనాళాలలో రక్తం ప్రవహించే మార్గాల్ని మూసేస్తూంటుంది. దాంతో గుండెకి కావలసిన రక్తం అందక హార్ట్‌ఎటాక్ వస్తుంది. కాలం గడిచినకొద్ది ఆహారం, ఆక్సిజన్ అందక రక్తప్రసరణ లోపించడంతో గుండె కండరాలు దెబ్బతింటాయి.
కొద్ది కొద్దిగా గుండె రక్తనాళాలు మూసుకుపోవడం ప్రారంభమైనపుడు కొన్ని హెచ్చరికలు వస్తాయి. వాటిని ఎంజైనా అంటారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. ఆయాసపడుతుంటారు. నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటుంది. గుండె ప్రాంతంలో నొప్పిగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులలోకి వెళ్తుండవచ్చు. దవడలోకి వెళ్లవచ్చు. కిందకు రావచ్చు. కాబట్టి బొడ్డు నుంచి దవడల వరకూ రకరకాలుగా మిమిక్ చేస్తుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో నొప్పి ఉంటే వెంటనే గుండె వైద్యుణ్ణి కలిసి ఇసిజి తీయించాలి. అది గుండె నొప్పయితే ఈ చిన్న పరీక్షలో తెలిసిపోతుంది. గుండె నొప్పయితే గుండె చికిత్సా నిపుణులతో అత్యవసరంగా చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ఛాతీ మధ్యభాగంలో మంట వస్తే ఎసిడిటి తాలూకు నొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది!
లక్షణాలు
గుండెపోటు చాలా సార్లు ఛాతిలో చిన్న నొప్పిగా ప్రారంభమై- అడ్డంకులు పెరిగేకొద్దీ- పెరుగుతుంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. అందుకని ఛాతిలో నొప్పి చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది ఈ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయడంతో ప్రమాదం తీసుకువస్తుంది. చాలాసార్లు మనమింతకు చెప్పుకున్నట్లు ఎసిడిటి అనో, అజీర్ణమనో భావించి వైద్యుణ్ణి కలవకుండా ఉండడంతో హఠాత్తుగా రోగి నొప్పితో తన్నుకునే పరిస్థితి వస్తుంది.
చికిత్స
హార్ట్ ఎటాక్ తీవ్రంగా వచ్చినపుడు ప్రతి నిమిషం విలువైనది! ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత వేగంగా గుండె కండరాలు దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ప్రాణాన్ని కాపాడవచ్చు, గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తిని పునరుద్ధరించి! దాంతో వేగంగా కోలుకుంటారు.
చికిత్సని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించుకోవాలి. ముఖ్యంగా లక్షణాలు కనిపించిన రెండు గంటలలోపు. గుండెపోటు వచ్చిందని తెలిసింతర్వాత అయిదు నిముషాలు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇ.సి.జి తీసి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకుంటారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేసి, వాటిని తొలగించాలి. ఒకప్పుడు యాంజియోప్లాస్టి అంటే శస్త్ర చికిత్స కాదు, ప్రొసీజర్. గతంలో తొడద్వారా కేథటార్‌ని పంపి అడ్డంకుల్ని తొలగించేవారు. రక్తస్రావం ఎక్కువగా ఉండేది. కదలకుండా ఒక రోజు విశ్రాంతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు చేతి రేడియల్ ఆర్టీ ద్వారా యాంజియో చేస్తున్నారు. పొద్దున చేయించుకుని, విశ్రాంతి తీసుకుని రాత్రికి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. చేతి ద్వారా చేయటంవల్ల చాలా తేలికగా పొసీజర్ జరుగుతుంది. దీనిని ‘రేడియల్ యాంజియో’ అంటారు.
రేడియల్ యాంజియో ద్వారా ఇప్పుడు అతి క్లిష్టమైన అడ్డంకుల్ని తొలగిస్తున్నారు. గట్టిగా అయిపోయిన వాటిని ఆర్టరీ చీలే చోట ఉన్న అడ్డంకుల్ని గుండెకి రక్తం సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టెరీలో బ్లాక్‌లు వున్న యాంజియోప్లాస్టీతో తొలగిస్తున్నారు. కేథటార్‌ని లోపలకు పంపి ఇంజెక్షన్‌నిచ్చి అడ్డంకుల్ని తెలుసుకోవడాన్ని ‘యాంజియోగ్రామ్’ అంటారు. కేథటార్ ద్వారా అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని ‘యాంజియోప్లాస్టీ’ అంటారు. అడ్డంకుల్ని తొలగించిన తర్వాత ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా స్టంట్‌లని అమరుస్తారు. అనుభవమున్న గుండె చికిత్సా నిపుణులతోనే యాంజియోప్లాస్టి, స్టంటింగ్ చేయించుకోవాలి.

Monday, 6 October 2014

Quantitative reasoning - GRE

క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో మెలకువలు

గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌ (GRE) లో క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ అతి ముఖ్యమైన, బాగా స్కోరు చేసుకోగలిగిన విభాగం. అందుకే విద్యార్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పరీక్షకు సన్నద్ధం కావాలి!
ఈ విభాగంలో 35 నిముషాల వ్యవధి ఉండే రెండు భాగాలుంటాయి. ప్రతి భాగంలో 20 ప్రశ్నలు ఇస్తారు. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌కు స్కోరు 130-170 స్కేలులో ఇస్తారు. వెర్బల్‌ రీజనింగ్‌ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌ స్కోరు 260-340 గా నిర్ణయిస్తారు.
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌లో ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌, మల్టిపుల్‌ ఆన్సర్‌, కంపారిజన్‌, న్యూమరికల్‌ ఎంట్రీ రకాలుగా ఇస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానం, ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఐదు ఆప్షన్ల నుంచి ఎంచుకోవలసివుంటుంది. దీనికి ఏదో ఒకటే ఆప్షన్‌ సరైనదిగా ఉంటుంది.
అలా కాకుండా మల్టిపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నల్లో ప్రశ్నకు దిగువన ఇచ్చిన ఆప్షన్లలో ఎన్ని సరైనవిగా ఉంటే అన్నింటినీ ఎంచుకోవలసి ఉంటుంది. కరెక్ట్‌ సమాధానాలన్నింటినీ టిక్‌ చేస్తేనే మార్కులు వస్తాయి. సరైన ఆప్షన్‌ ఒక్కటి వదిలేసినా వెయిటేజి ఉండదు.
కంపారిజన్‌ ప్రశ్నల్లో ప్రశ్న/సమస్య ఇచ్చిన తరువాత, దానికింద Column A, Column B కింద ఎంట్రీలు ఇస్తారు. కాలమ్‌ A ఎంట్రీ, కాలమ్‌ B ఎంట్రీ కంటే ఎక్కువగా ఉంటే సమాధానం 'A' అని గుర్తించాలి. అలాకాకుండా కాలమ్‌ A ఎంట్రీ కాలమ్‌ B ఎంట్రీ కంటే తక్కువగా ఉంటే సమాధానం 'B' అని గుర్తించాలి. రెండూ సమానంగా ఉంటే 'C' గా, ఒకవేళ ఇచ్చిన ప్రశ్నలో అవసరమైన డేటా లేకపోతే (insufficient Data) సమాధానం 'D'గా గుర్తించాలి.
కంపారిజన్‌ ప్రశ్నల్లో సమస్యలపట్ల మంచి అవగాహన, సాధన ఉన్నట్లయితే పూర్తిగా సమస్య పరిష్కరించకుండానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే దీంట్లో కచ్చితమైన సమాధానం అవసరం ఉండదు కాబట్టి. ఇలా చాలావరకు పరీక్ష సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే విద్యార్థి పరీక్షకంటే ముందే సబ్జెక్టుపై పట్టు సాధించవలసి ఉంటుంది.
న్యూమరిక్‌ ఎంట్రీ ప్రశ్నల్లో సమాధానాలు, ప్రశ్న కింద ఇచ్చిన ఖాళీల్లో పూరించవలసి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి సమస్యను చివరివరకూ సాల్వ్‌ చేయాల్సి ఉంటుంది.
ఏ టాపిక్స్‌ అధ్యయనం ఎలా?
సిలబస్‌ ప్రకారం చూస్తే పాఠశాల స్థాయి భావనలే ఉన్నట్లు కనిపిస్తాయి. అయినా ప్రశ్నలను మాత్రం తార్కికశక్తితో సాల్వ్‌ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు నేరుగా ఫార్ములాను ఉపయోగించి చేసేవి కాకుండా విద్యార్థి నిజమైన అవగాహనను పరీక్షించేవిగా ఉంటాయి.
సిలబస్‌ అంకగణితం (Arithmetic), బీజగణితం (Algebra), రేఖాగణితం (Geometry) , దత్తాంశ విశ్లేషణ (Data Analysis)గా ఉంటుంది. ఒక్కొక్కదాన్ని చిన్న అధ్యాయాలు (Chapters)గా విభజించి అధ్యయనం చేస్తే సుమారు 20 అధ్యాయాలు అవుతుంది.
క్వాంటిటేటివ్‌ విభాగంలో ప్రశ్నల్లో వాడే సింబల్స్‌, పదాలు (terminology) ప్రామాణిక గణితంలో వాడే వాటిలాగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక సింబల్స్‌ ఏదైనా ప్రశ్నలో వాడినట్త్లెతే, దాని గురించిన వివరణ కూడా ఇస్తారు.
అరిథ్‌మెటిక్‌లో అంకెలు, సంఖ్యలు, భిన్నాలు, వర్గాలు, వర్గమూలాలపై ప్రాబ్లమ్స్‌ సాధన చేయాలి. ఇవే కాకుండా డెసిమల్స్‌, రియల్‌ నంబర్స్‌, నిష్పత్తులు, పర్సెంటేజీలో కూడా ప్రశ్నలు అడుగుతారు. వీటిల్లో ప్రశ్నలు నేరుగా కాకుండా కొంచెం విమర్శనాత్మకంగా- విద్యార్థి ఆలోచనాశక్తిని పరీక్షించేవిగా అడుగుతారు.
ఆల్జీబ్రాలో లీనియర్‌, నాన్‌-లీనియర్‌లో సమీకరణాలను సాల్వ్‌ చేసే పద్ధతులపై ప్రశ్నలుంటాయి. నాన్‌-లీనియర్‌లో ముఖ్యంగా క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఈక్వేషన్సే కాకుండా అసమానతల (Inequalities) పై కూడా ప్రశ్నలు వస్తాయి. అసమానతలను చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ పరీక్ష కంటే ముందే సాధన చేస్తూ సులభమైనదిగా మార్చుకోవచ్చు.
జామెట్రీలో రేఖలు, కోణాలను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు ఉంటాయి. త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజాలపై మంచి అవగాహన ఉండాలి. వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలు, అంతర కోణాలు, బాహ్య కోణాలకు సంబంధించిన ఫార్ములాలను గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది.
వృత్తాలు, త్రీడైమెన్షనల్‌ ఫిగర్స్‌ మీద కూడా ప్రాక్టికల్‌ ఓరియంటెడ్‌గా ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలను చేయడానికి ఫార్ములాలను గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తయితే, ఇచ్చిన ప్రశ్నను సరిగ్గా విశ్లేషించి ఎక్కడ ఏ ఫార్ములాను ఉపయోగించాలో పసిగట్టడం మరో ఎత్తు.
డేటా అనాలిసిస్‌లో గ్రాఫికల్‌ మెథడ్స్‌, న్యూమరికల్‌ మెథడ్స్‌, కౌంటింగ్‌ మెథడ్స్‌ మీద ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. ఈ అంశంలో సంభావ్యత (Probability), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ మీద ప్రశ్నలు వస్తాయి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఇచ్చిన డేటాను సరిగ్గా, తప్పు లేకుండా గుర్తించడంలోనే అసలైన నేర్పు ఉంటుంది. దీంట్లో ప్రశ్నలు తేలికగా ఉన్నప్పటికీ విద్యార్థులు కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా మార్కుల కోల్పోతూ ఉంటారు. అందుకే పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడే విద్యార్థి తను ఏ తప్పులు చేస్తున్నాడో గుర్తించి వాటిని అధిగమించేవిధంగా అభ్యాసం చేస్తూ సన్నద్ధం కావాలి.
పైన చెప్పిన అంశాలపై విద్యార్థి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఒకవేళ విద్యార్థి తను ఇంతకుముందు నేర్చుకున్న అంశాలు మరిచిపోయి ఉన్నట్లయితే ఇంకోసారి ఈ అంశాల పునశ్చరణ చేసుకోవాలి. ఇది పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తుంది. ప్రాథమిక అవగాహన ఏర్పడిన తర్వాత పరీక్షకు మిగిలున్న సమయాన్ని బట్టి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేస్తే అంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది.
ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే- ఒకే రకమైన ప్రశ్నలు ఎక్కువ సాధన చేయడం కంటే వైవిధ్యం ఉన్న ప్రశ్నలను ఎంచుకొని సాధన చేస్తే పరీక్ష సమయంలో ఎంతో ఉపయుక్తం!.

toefl - ielts

ఆ రెండు పరీక్షలకూ ఏమిటి తేడా?

చాలామంది విద్యార్థులు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌లలో దేన్ని రాయాలా అని తికమకపడుతుంటారు. వీటిలో ఏది సులభమా అని ఆలోచిస్తుంటారు. ఈ రెండు పరీక్షల మధ్య భేదాలేమిటో, సరైన దాన్ని ఎంచుకోవటానికి వేటిని గమనించాలో పరిశీలిద్దాం!
ఆంగ్లం మాతృభాషగా లేని విద్యార్థులు విదేశాల్లోని (ఉదా: యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌) విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకుంటే వారు తప్పకుండా ఆంగ్ల భాషా సామర్థ్య (లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ) పరీక్షను ఎదుర్కొనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఆమోదించే ఆంగ్ల భాషా పరీక్షలు IELTS(ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం), TOEFL (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌). భారత్‌ లాంటి దేశాల విద్యార్థులకు ఈ రెండు పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. 
ఐఈఎల్‌టీఎస్‌ను ఇంగ్లాండ్‌లో రూపొందించారు. ఇది అంతర్జాతీయంగా ఆమోదించే ఆంగ్లాన్ని పరీక్షిస్తుంది. టోఫెల్‌ను ఉత్తర అమెరికాలో రూపొందించారు. ఇది అమెరికన్‌ ఇంగ్లిష్‌ను పరీక్షిస్తుంది.
పోలికలు 
ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ రెండింటినీ ఆంగ్లభాషలో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించడానికే రూపొందించారు. ముఖ్యంగా తరగతి గదిలో భావవ్యక్తీకరణ, ఆంగ్లభాషా సంస్కృతిలో ఇమడగల సామర్థ్యాలనూ పరీక్షిస్తాయి. ఇవి రెండూ కూడా వినడం, చదవడం, రాయడం, మాట్లాడటం అనే నైపుణ్యాలను విద్యార్థులు ఎంత బాగా సమన్వయం చేయగలరో విశ్లేషిస్తాయి.
తేడాలు 
రెండు పరీక్షలూ బాహ్యంగా ఒకే నైపుణ్యాలను పరీక్షిస్తున్నప్పటికీ, తీరు మాత్రం వేర్వేరు. ఆశయం, లక్ష్యం ఒకటే అయినప్పటికీ వాటి విధానం, పరీక్షా ప్రమాణాల్లో తేడాలు ఉంటాయి. అవి ఏమిటంటే...
ఎ) టోఫెల్‌లో పఠనం (రీడింగ్‌), శ్రవణం (లిసనింగ్‌) విభాగాలకు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఐఈఎల్‌టీఎస్‌లో విద్యార్థులు ఇచ్చిన వ్యాసం/ సంభాషణల్లోని పదాలను కాపీ చేసి రాయాల్సి ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలకు సంగ్రహ ఆలోచన అవసరముంటుంది. కానీ ఐఈఎల్‌టీఎస్‌ యథాతథంగా ఆలోచించగలిగేవారికి ఉపయోగకరం.
లిసనింగ్‌ విభాగం మౌఖిక ఉపన్యాసాలు, సంభాషణలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. విదేశంలో విద్య, సామాజికపరంగా విజయం సాధించడానికి వీటిది కీలకపాత్ర. ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష... విన్న అంశాలపై సమాధానాలు రాసే వీలు కల్పిస్తుంది. ఈ లిసనింగ్‌ విభాగంలో వివిధ రకాల ఉచ్చారణలు వినే అవకాశముంటుంది. కేవలం బ్రిటిష్‌, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌, కెనడియన్‌ ఉచ్చారణ రీతులకే పరిమితం కాకుండా మిగిలినవి కూడా వినవచ్చు.
కానీ టోఫెల్‌లో ప్రామాణిక అమెరికన్‌ ఉచ్చారణనే నిర్వహిస్తారు. టోఫెల్‌ లిసనింగ్‌ విభాగంలో నోట్సు రాసుకోగలిగే నైపుణ్యం ఉండడం తప్పనిసరి. ఎందుకంటే దీనిలో సుదీర్ఘ ఉపన్యాసం/ సంభాషణ విన్న తరువాతే ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
బి) టోఫెల్‌ భాషణ (స్పీకింగ్‌), లేఖన (రైటింగ్‌) విభాగాలు రెండింటినీ సంపూర్ణంగా గ్రేడ్‌ చేస్తారు. వ్యాసంతోపాటు పద సముదాయం, తర్కం, శైలి, వ్యాకరణం నాణ్యతలను బట్టే మార్కులు ఇస్తారు. ఐఈఎల్‌టీఎస్‌ దీనికి భిన్నం. దీనిలో లక్ష్యఛేదన, సాధన, సందర్భశుద్ధి, పొందిక, నిఘంటు వనరులు, ధారాళంగా మాట్లాడడం, వ్యాకరణస్థాయి, కచ్చితత్వం వంటి వ్యక్తిగత అంశాలను బట్టే మార్కులు కేటాయిస్తారు.
సి) ఐఈఎల్‌టీఎస్‌లో స్పీకింగ్‌ పరీక్ష కోసం పరీక్షకునితో ముఖాముఖీ (ఇంటర్వ్యూ)కు హాజరుకావాల్సి ఉంటుంది. టోఫెల్‌లో మాత్రం మౌఖికపరీక్షను ఓ మైక్రోఫోన్‌లో రికార్డు చేస్తారు. ఆరు ప్రశ్నలకు సమాధానాలు రికార్డు చేసి ఎగ్జామినర్‌కు పంపిస్తారు. ఎక్కువ ప్రశ్నలు విద్యాపరమైనవే (పాఠ్యాంశాలకు సంబంధించినవే) ఉంటాయి. ఓ పాఠం/ విద్యాసంబంధ చర్చను విని మీ అభిప్రాయాలను ఇందాకటి పద్ధతిలోనే చెప్పాల్సి ఉంటుంది. (వీటిని టోఫెల్‌లో ఇంటిగ్రేటెడ్‌ టాస్క్స్‌ అంటారు).
డి) మార్కుల విధానం కూడా రెండింటిలోనూ భిన్నం. ఐఈఎల్‌టీఎస్‌లో 0- 9 బ్యాండ్స్‌ వరకు ఇస్తారు. టోఫెల్‌ గ్రేడులు సంఖ్యల్లోనే ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 పాయింట్ల చొప్పున మొత్తం 120 పాయింట్లు ఉంటాయి.
ఇ) అధికారిక టోఫెల్‌ గైడ్‌ ద్వారా ఐదు పాత ప్రశ్నపత్రాలు, డిస్క్‌లో పొందుపరచిన ఆడియో పాసేజ్‌లతో అభ్యాసం చేయొచ్చు. ఈ పుస్తకం ద్వారా పరీక్షకు ఏమేరకు సిద్ధమయ్యారో పరీక్షించుకోవచ్చు. ఐఈఎల్‌టీఎస్‌కు రిజిస్టర్‌ చేసుకుంటే ఇలాంటి మెటీరియల్‌నే సమాధానాలతో సహా అందిస్తున్నారు. 
ఏది సులభం?
బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ కావడం వల్ల ఐఈఎల్‌టీఎస్‌ కాస్త సులభంగా అనిపించవచ్చు. పేపర్‌పై రాసేదే కావడం వల్ల టోఫెల్‌లో మాదిరిగా కీబోర్డ్‌, టైపింగ్‌ అనుభవం అవసరం ఉండదు. అలాగే టోఫెల్‌ తరహాలో స్పీకింగ్‌, రైటింగ్‌ వంటి ఏకీకృత పరీక్షలు ఐఈఎల్‌టీఎస్‌లో ఉండవు. స్పీకింగ్‌ విభాగం విడిగా, వేరేరకంగా నిర్వహిస్తుండటం మూలంగా పరీక్ష వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మైక్‌ కంటే ప్రత్యక్షంగానే ముఖాముఖికి హాజరవడం హాయి అనిపిస్తే మాత్రం టోఫెల్‌ సులభమనిపిస్తుంది.
ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష 2.45 గంటలుంటే, టోఫెల్‌ పూర్తవడానికి 4 గంటలు పడుతుంది. రెండు పరీక్షలూ ఏడాదిపాటూ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రెండు పరీక్షలూ మీ ఆంగ్లపరిజ్ఞాన స్థాయికి అనుగుణంగా మిమ్మల్ని కచ్చితంగా గ్రేడ్‌ చేస్తాయి.
విద్యార్థులు రెండు పరీక్షల నమూనా పరీక్షలను రాయడం ఉత్తమం. దాన్ని బట్టి మీకు ఏది సులభతరమో ఎంచుకోవచ్చు. నమూనా పరీక్షల కోసంwww.roadtoielts.com/testdrive/ ,www.ets.org/toefl/ibt/prepare/quick pep/ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.
చివరగా, మీరు ఎంచుకున్న విద్యాసంస్థ ఏ పరీక్ష స్కోరును అంగీకరిస్తుందో చూసుకోవాలి. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ల మధ్య తేడాలు కొన్నే. అవి అంత ప్రధానమైనవి కావు. విద్యార్థిగా మీరు లక్ష్యంగా పెట్టుకున్న విశ్వవిద్యాలయాలు కోరే పరీక్ష వివరాలను తెలుసుకోవాలి.
స్థూలంగా చెప్పాలంటే... మీరు బ్రిటిష్‌ కామన్‌వెల్త్‌లోని కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటున్నట్లయితే ఐఈఎల్‌టీఎస్‌ రాయవచ్చు. లేదంటే టోఫెల్‌ రాయండి. మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో దానిపై ఆధారపడి (యూఎస్‌/ యూకే/ ఆస్ట్రేలియా) వీటిలో ఏదో ఒక పరీక్షను ఎంచుకోవచ్చు.
ఏదేమైనా యూఎస్‌లోని చాలా విశ్వవిద్యాలయాలు ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును అంగీకరిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని పేరున్న విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంకా ఈ పరీక్షను ఆంగ్ల నైపుణ్య పరీక్షగా గుర్తించటం లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఎంచుకునే విశ్వవిద్యాలయం ఏ పరీక్షను అంగీకరిస్తుందో దాన్నే ఎంచుకోవడం మేలు!