Showing posts with label Telugu spirutual. Show all posts
Showing posts with label Telugu spirutual. Show all posts

Tuesday, 12 May 2015

Trupthi - Santhrupthi


తృప్తి - సంతృప్తి

తృప్తి-సంతృప్తి అనే మాటలను సమానార్థకాలుగా వాడుతుంటాం. అలా చేయడం తప్పు కానప్పటికీ ఆ పద ప్రయోగాలమధ్య ఎంతో వ్యత్యాసముంది.
పరమేశ్వరుని అనుగ్రహంవల్ల రూపొందిన ఈ చరాచర సృష్టిని నిశితంగా పరిశీలిస్తే మానవుని ఉత్కృష్టత తెలుస్తుంది. యుక్తాయుక్తాలను వివేచించి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చో, తదనుగుణంగా బహుళార్థ ప్రయోజనకరంగా మలుచుకునే శక్తి ఇతర ప్రాణులకన్నా మానవునికే అధికం. మనిషి తన భావాలను, అనుభవాలను, అనుభూతుల్నీ ఇతరులతో పంచుకొనగలడు. అప్పుడు మాత్రమే అని జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. తన జీవనం ఎంతో ‘తృప్తి’గా ఉందని భావిస్తాడు. అంటే మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇటువంటి భావన కలుగుతుంది.
తృప్తి లేదా సంతృప్తి మనస్సుకు సంబంధించిన ఫలాలు. ‘తృపి’ దేహానికి (జీవుడికి) సంబంధించినది. సంతృప్తి అంతరంగానికి (ఆత్మకు) సంబంధించినది. పరిశీలనం చేస్తేనే గాని అవగాహన కాదు.
‘తృప్తి’ అనుభవించడం కర్మేంద్రియాల ద్వారా జరిగితే, ‘సంతృప్తి’ జ్ఞానేంద్రియాలకు మాత్రమే పరిమితం.
ఎండలో నడుస్తున్నవానికి చల్లని నీడ తృప్తినిస్తుంది. అలానే ఆ స్థితిలో దాహార్తికి చల్లని నీళ్ళు తృప్తి కలిగిస్తుంది. ఆకలితో సతమతమవుతున్నవానికి పట్టెడన్నంతో కడుపు నింపితే ముఖంలో తృప్తి తాండవమాడుతుంది. పరీక్షల్లో విద్యార్థి కృతార్థుడైనా, నిరుద్యోగికి ఉద్యోగం లభించినా, శ్రమనెంచక ఇల్లు కట్టినా, కూతురుకు పెళ్లిచేసినా ఆ వ్యక్తుల ముఖాలలో కనిపించే ‘తృప్తి’ని మాటలో వర్ణించలేం.
ఒక విధంగా వీటిని చూస్తే ఇవన్నీ కోరికలు. సముద్రంలో అలల వంటివి. ప్రతి కోరిక తీరగానే అంతటితో సమప్తం కాదు. ఆ కోరికననుసరించి మరొక కోరిక పుడుతుంది. ధనం లభించాలనీ, కీర్తిపొందాలనీ పదవి చేపట్టాలనీ- ఇలా ఎన్నో కోరికలు మనిషికి కలుగుతూనే ఉంటాయి. వాటికోసం మనస్సు ప్రేరేపించని మార్గమంటూ లేదు. కోరిక తీరాలనే కాని, ఆ మార్గం ఎటువంటిదని మనస్సుకు తట్టదు. కోరిక తీరితేనే తృప్తి. దొరికినదానితో తృప్తి చెందడం, అంతటితో సరిపెట్టుకోవడం మనసుకు అలవాటు లేదు. మంచి, చెడులు రెండూ మనసుకు రెండు పార్శ్వాలు. లేదా నాణేనికి బొమ్మా, బొరుసులు. ఐహిక వాంఛలకు అలవాటుపడిన దేహానికి ఆ విధంగానే తృప్తిని సమకూరుస్తుంది మనస్సు. అంటే భౌతికంగా మనిషికి లభిస్తున్న తృప్తి మనుస్సు కారణంగా లభిస్తున్నది. ఈ తృప్తి అనిత్యమైనది. అశాశ్వతమైనది.
నిత్యమైనది, శాశ్వతమైనది అయిన తృప్తి వేరొకటున్నది. అంతరంగంలో ఉన్నది. మనోనేత్రం మిథ్యాజగత్తును చూస్తూ అనుభవించేది బాహ్మికమైన తృప్తి. దేహానికి మాత్రమే సంబంధించినది. మనోనేత్రాన్ని అంతరంగంవైపు మళ్లించి వీక్షిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ధర్మ సౌందర్య దర్శనం, ఆత్మానంద జ్యోతి ప్రకాశం గోచరమవుతుంది. విశ్వంలో ప్రతి ఒక్కరూ ఆనందానే్న కోరుకుంటారు. మానవుని సహజ స్థితి ఆనందం అంటాయి ఉపనిషత్తులు. ‘‘ఆనందం మన వారసత్వ సంపద, సంతోషం మన ధనం, శాంతి మన స్వంతం’’- ఇవన్నీ మనలోనే ఉన్నాయి. కాని మనం వాటిని అనుభూతం చేసుకోలేకపోతున్నాం అంటారు స్వామి చిన్మయానంద.
శాంతి వంటి తపస్సు, సంతోషాన్ని మించిన సుఖం లేదు. సాగరంలోని అలలు వంటి కోరికలకు మించిన వ్యాధులు లేవు. దయతో సరితూగగల ధర్మం కూడా లేదని శృతులు వక్కాణిస్తున్నాయి.
మనస్సును అంతర్ముఖం చేసి, ఇంద్రియాలను నియంత్రించి, పరమాత్మను ఆత్మలో దర్శించే సాధన చేయాలి. ఫలాపేక్ష రహితమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన అనంతమైన ప్రేమ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మ. అక్కడ సదా పరివేష్టితుడై ఉన్నాడు. వైభోగాలకు, భోగాలకు అక్కడ తావు లేదు. అది పరతత్త్వమైన, ఆధ్యాత్మికమైన స్థితి. 

Avivekam - Telugu spirutual


అవివేకము



భగవాన్ శ్రీకృష్ణపరమాత్మ శ్రీ భగవద్గీతలో అర్జునునితో జ్ఞాని అయిన వాడు నాకత్యంత ప్రియమైన వ్యక్తి. మనుష్యులలో బుద్ధిమంతు వారలలో బుద్ధిని నేనే. వివేకము బుద్ధియోగమునే ఆశ్రయించాలి, ఎందుకంటే అది ఫలహేతువు కనుక. దానివలననే ఫలితము కలుగును. ఆ ఫలితమునే అనుభవింపవలసి వచ్చును. మానవులు ఎల్లప్పుడును సమబుద్ధి యందే రక్షణోపాయమును పొందవలెను. రకరకములైన మాటలు వలనను, అవి వినుట వలనను వాదనల వలనను బుద్ధి విచలితమై స్థిరముగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటప్పుడు స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. వివేకము కోల్పోరాదు. ఎటువంటి పరిస్థితుల్లోను సుఖ దుఃఖాలలో గాని ద్వేషములందుగాని బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి. ఎవని మనస్సు, ఇంద్రియములు వశమై ఉండునో అతని బుద్ధి స్థిరముగా నుండును. విషయములందు సదా ఆలోచించువానికి వానియందాసక్తి కలుగును. ఆ ఆసక్తివలన విషయములపట్ల కోరిక కలుగును. కోరిక తీరక విఘ్నములేర్పడినప్పుడు క్రోధము కలుగును, క్రోధమువలన మూఢభావము కలుగుతుంది. దానివలన స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమించినప్పుడు జ్ఞానశక్తి నశిస్తుంది.
అలా నశించినప్పుడు తానున్న స్థితినుండి దిగజారి పతనము మొదలవుతుంది. బుద్ధి వివేకము కోల్పోయి అవివేకము కలుగును. అవివేమువలన నిర్వర్తించు కార్యములు సక్రమంగా జరుగక నాశనము ప్రాప్తించును. చివరకు ప్రాణోపాయము కలుగును. బుద్ధి ద్వారా మనస్సును వశము గావించుకుని జాగరూకతతో సంచరించాలి. వివేకముతో జీవనము సాగించాలి.
దేవుడు ప్రాణికోటికంతటికిని బుద్ధిని ఎంతో కొంత ప్రసాదించాడు. ముఖ్యంగా మానవజాతి బుద్ధి వివేకములతో సక్రమ మార్గమున నియంత్రించగలిగితే అంతా ధర్మమే నాలుగు దిక్కుల ప్రభవిల్లుతుంది. అంతటా శాంతి సౌభాగ్యాలే వెల్లివిరుస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అయితే ప్రాచీన కాలం నుండి కొంతమంది బుద్ధిని సరిగా ఉపయోగించక తమ అవివేకముతో నాశనమయ్యారు. వారిలో.. దుర్యోధనుడు సోదరులతో శత్రుత్వం వహించి పోరు సల్పి అవివేకి అయ్యాడు. ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో దుర్యోధనుని ఆగడాలు అనుమతించి అవివేకి అయ్యాడు.
శూర్పణఖ మాటలు విని సీతను అపహరించిన రావణుడు ఒక అవివేకి, దురాశచే దూరాలోచన లేక సులభంగా ధనార్జన చేసేవాడు అవివేకి, తాను కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్నవాడు అవివేకి. ఈతకాయతో తాటికాయ కోరేవాడు అవివేకి. వాత్సల్యంతో పిల్లలను అతి ముద్దుచేసే తల్లిదండ్రులు అవివేకులు. పరుల మెప్పుకోసం ప్రాకులాడేవాడు అవివేకి. అనాలోచితంగా తొందరపాటుతో అపాయంలో చిక్కుకున్నవాడు అవివేకి. రావణాసురుడు, దుర్యోధనుడు, వాలి, కంసుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారందరూ సర్వనాశనం కావడానికి కారణం వారి అవివేకమే. నేడు ఎంతోమంది ఉన్నత స్థాయి నుండి అథమ స్థాయికి చేరడానికి కారణం అవివేకమే. అయితే ఉపాయంతో, బుద్ధితో, వివేకంతో అపాయాన్ని తప్పించుకొనేవాడు వివేకవంతుడు.
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

Dyana Yogam - Telugu spirutual


ధ్యానయోగం


పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధకులు ఏకాగ్రతతో చిత్తమందు భగవంతుని రూపాన్ని నిల్పుకొని నిరంతరం అర్చించే చర్యనే ధ్యానయోగం అని అంటారు.
ధ్యానయోగానికి పూనుకునేవారికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటుచేయబడ్డాయి. వారు ఆ నియమ నిబంధనలు పాటించినట్లయితేనే ధ్యానయోగం సఫలీకృతమవుతుంది. ధ్యానయోగులు తమ మనసులోకి ఏ భయాన్నీ రానీయరాదు. భయంవల్ల మనస్సు చంచలమై పరమాత్మయందు లగ్నం చేయడం చాలా కష్టమవుతుంది. సర్వవ్యాపి, సర్వరక్షకుడైన భగవంతుడు తనకు అండగా ఉంటాడని విశ్వసించాలి. అలా చేయడంవల్ల భయం వారి దరిచేరదు. అలాగే వారు మరణం విషయమై ఏ మాత్రం దిగులు చెందకూడదు. ధ్యానయోగంలో ఉన్న సమయంలో అనుకోకుండా మరణమే సంభవించినా అది వారికి శ్రేయోదాయకమై మోక్షప్రదమవుతుంది. అందువల్ల ధ్యానయోగులు ఏ విషయానికీ వెరువకుండా ధ్యానయోగం మొదలు పెట్టాలి.
ధ్యానసమయంలో రాగద్వేషాలకూ, సుఖ దుఃఖాలకూ, కామక్రోధాలకూ, ప్రాపంచిక సంకల్ప, వికల్పాలకూ అతీతులై ఉండాలి. ప్రశాంత చిత్తంతో ధ్యానయోగం కొనసాగించాలి.
ధ్యానయోగాలు నిద్ర, సోమరితనం, అలసత్వం, ప్రమాదాది అవరోధాల్ని అధిగమించాలి. సావధాన చిత్తంతో మెలగుతూ ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. ఏమరుపాటు కలిగితే మనస్సు, ఇంద్రియాలు పక్కదారి పట్టి ధ్యానానికి ఇబ్బందులు అవుతాయి. ధ్యానయోగ సమయంలో సాధకులు మిక్కిలి యుక్తియుక్తంగా వ్యవహరించడం అలవరచుకోవాలి.
నిలకడ లేని మనస్సును బలవంతంగా నిగ్రహించడానికి ప్రయత్నించినా అది విషయ సుఖాలవైపు పరుగులు తీయడం సహజం. అందువల్ల దృఢ సంకల్పంతో మనసును అదుపులో ఉంచుకోవాలి. బాహ్య విషయాలనుండి మనస్సును మరలించి భగవంతునియందు లగ్నం చేసి ధ్యానయోగం కొనసాగించాలి.
అత్యాధునిక పరిస్థితులు, పరికరాలు మనస్సులను ఆకర్షించి తమవైపు తిప్పుకునేందుకు సర్వదా ప్రయత్నిస్తూనే ఉంటాయి. అట్టి సమయాల్లో తగినంత నిగ్రహాన్ని పాటిస్తూ నియమ నిబంధనలకు నీళ్ళొదలకుండా ధ్యాన యోగాన్ని కొనసాగించాలి.
గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధ్యానయోగ సాధనా సమయంలో నిర్దేశింపబడిన నియమాలను ఏ మాత్రం ఉల్లంఘించరాదు. మనుస్మృతి మొదలైన శాస్త్రాల్లో ధ్యానయోగ సమయాల్లో బ్రహ్మచర్యం పాటించాలని తెలుపబడింది. ధ్యానయోగ సాధకులు బాహ్య అందాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా అంతఃసౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు కృషిచేయాలి.
ధ్యానయోగ సాధకులు తమ తల్లిదండ్రులనూ, గురువులనూ, పెద్దలనూ గౌరవించాలి. వారి యెడ వినయ విధేయతలతో ప్రవర్తించాలి. ఎవరితోనూ ఎట్టి వివాదాలూ సల్పకుండా వివాద రహితులై ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ నిందింపరాదు. జూదం జోలికి పోరాదు. సాత్త్వికమైన ఆహారానే్న భుజించాలి. సత్యవ్రతులై మెలగాలి. అహింసామార్గవర్తులై ఉండాలి. అరిషడ్వర్గాలను జయించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ ధ్యానయోగంతో మోక్షాన్ని పొందగలగాలి.
ధ్యానయోగులు తమకు ఇష్టమైన దైవ స్వరూపాన్ని చిత్తంలో ప్రతిష్ఠించుకొని ధ్యానం చేయవచ్చు. ‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి’ అన్నట్లుగా ఏ రూపాన్ని పూజించినా, ధ్యానించినా అది పరమాత్మకే చెందుతుంది.
ధ్యానం నిర్గుణ పరబ్రహ్మను కాకుండా సగుణ పరమేశ్వర ధ్యానంగా ఉండాలి.
మత్పరాయణులు అనన్య భావంతో చిత్తాన్ని పరమాత్మ యందే లగ్నం చేసి ధ్యానం చేస్తారు. భగవత్పరాయణులు భగవల్లీలా విలాసాల యందే సంతుష్టులౌతా
రు